ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలకు పన్ను రాయితీలకు కేంద్రం నో
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా చెబుతోంది. మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక కూడా ఇటీవల ఈ అంశంపై మరోసారి క్లారిటీ ఇచ్చింది. విభజన సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా నెరవేర్చుతున్నామని కేంద్రం చెబుతోంది. తాజాగా, ఏపీకి ఓ శుభవార్త, ఓ చేదువార్త తెలిపింది.
హోం బయ్యర్స్కు షాక్: ధోనీ కంపెనీతో ఆమ్రపాలి చీకటి ఒప్పందం, అసలేం జరిగింది?
ఒక్క రాష్ట్రానికి ప్రత్యేక పన్ను రాయితీ ఇవ్వలేం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక పన్ను రాయితీల అంశంపై ఎంపీ అవినాశ్ రెడ్డి లోకసభలో లేవనెత్తారు. ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ నెరవేరలేదని, పన్ను రాయతీలు, ప్రోత్సాహకాలు ఇస్తుందా అని ప్రశ్నించారు. దీనిపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ఏపీకి ప్రత్యేకంగా పన్ను రాయితీ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే దేశవ్యాప్తంగా అమలు చేయడం మినహా ఒక్క రాష్ట్రానికి ప్రత్యేకంగా చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసారు.
ప్రతిపాదనలతో వస్తే...
'ఏపీకి ప్రత్యేకంగా పారిశ్రామిక పన్ను రాయితీ ఇవ్వలేం. విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే దేశవ్యాప్తంగా అమలు చేయాలి. ప్రత్యేకంగా ఏపీకి రాయితీలు ఇవ్వలేం. దేశవ్యాప్తంగా అమలు అవుతున్న విధానాలే ఏపీకి కూడా వర్తిస్తాయి.' అని గడ్కరీ చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రతిపాదనలతో వస్తే ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు.
ఎంబీబీఎస్ సీట్లపై శుభవార్త
ఎంబీబీఎస్ సీట్లపై ఏపీకి శుభవార్త. రాష్ట్రానికి అదనంగా 460 సీట్లు వచ్చాయి. ఇప్పటి వరకు 1900 సీట్లు ఉండగా, కొత్తగా వచ్చిన వాటితో కలిపి 2360కి చేరుకున్నాయి. ఇవి ప్రస్తుత కౌన్సెలింగ్ నుంచే అమల్లోకి వస్తున్నాయి. అనంతపురం మెడికల్ కాలేజీలో 50 సీట్లు, శ్రీకాకుళం రిమ్స్లో 50 పెరిగాయి. మిగిలిన 360 సీట్లు ఈడబ్ల్యుఎస్ కోటా కింద మంజూరయ్యాయి.