45 ఏళ్లకే పింఛన్: ఒక్కో మహిళా ఫ్యామిలికీ రూ.1.05 లక్షల నష్టమా?
అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ అంశంపై మంగళవారం ఏపీ అసెంబ్లీలో దుమారం చెలరేగింది. మహిళలందరికీ పెన్షన్ అని జగన్ బహిరంగ సభల్లో చెప్పారని, సాక్షి పత్రికలో వచ్చిందని, కానీ ఇప్పుడు కేవలం నాలుగు దఫాలుగా కుటుంబానికి రూ.75వేలు అని మాత్రమే అంటున్నారని టీడీపీ విమర్శించింది. ఈ లెక్కన ఆయా కుటుంబ సభ్యులకు ఎంత మొత్తం నష్టం జరిగిందో టీడీపీ అధినేత చంద్రబాబు లెక్కలతో సహా చెప్పారు. అయితే, 45 ఏళ్లకు పింఛన్ స్థానంలో వైయస్సార్ చేయూత తీసుకు వచ్చామని జగన్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
జగన్ సంచలన నిర్ణయం ! ఇండస్ట్రీ సర్కిల్స్లో రచ్చరచ్చ
అయిదేళ్లకు రూ.75వేలు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో అర్హులందరికీ 45 ఏళ్లకే పింఛన్ ఇస్తామని జగన్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని, రాష్ట్రమంతా ప్రచారం చేశారని చంద్రబాబు అన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక మాట మార్చారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో 45 సంవత్సరాలు దాటిన మహిళలకు మొత్తంగా రూ.75 వేలు చొప్పున ఇస్తామని ఇప్పుడు చెబుతున్నారన్నారు.
ఒక్కో మహిళా కుటుంబానికి రూ.1.05 లక్షల నష్టం
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం 45 ఏళ్లకే నెలకు రూ.3 వేల చొప్పున పెన్షన్ ఇస్తే, అయిదేళ్లలో వారికి రూ.1.80 లక్షల ప్రయోజనం చేకూరుతుందన్నారు. కానీ మాత్రం అయిదేళ్లకు రూ.75వేలు ఇస్తామని చెబుతున్నారని, అంటే ఒక్కో మహిళా కుటుంబానికి రూ.1.05 లక్షల నష్టం జరుగుతుందన్నారు.
జగన్ హామీలు 590కి పైగా...
జగన్ పాదయాత్రలో, మేనిఫెస్టోలో, ఇతరత్రా ఇచ్చిన హామీలు 590కి పైగా ఉన్నాయని, వాటిని అమలు చేయాలని అడుగుతున్నామని చంద్రబాబు చెప్పారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో టీడీపీ ప్రభుత్వం బీసీలకు రూ.16,226 కేటాయిస్తే, వైసీపీ ప్రభుత్వం పూర్తి బడ్జెట్లో రూ.15,061కు కుదించిందన్నారు.