గుడ్న్యూస్: ఆగస్ట్ 12న జియో గిగాఫైబర్ లాంచ్! ముఖేష్ అంబానీ హింట్!!
న్యూఢిల్లీ: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో గిగా ఫైబర్ కోసం చాలామంది వేచి చూస్తున్నారు. గత ఏడాది గిగాఫైబర్తో బ్రాడ్బ్యాండ్ సేవలోకి రిలయన్స్ ప్రవేశించడంతో బ్రాడ్ బ్యాండ్ మార్కెట్ ధరల వ్యూహాలలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఏడాది కాలంగా గిగాఫైబర్ ప్రధాన నగరాల్లో భారీగా విస్తరిస్తోంది. అదే సమయంలో ప్రివ్యూ ఆఫర్ కింద వినియోగదారులకు దాదాపు ఉచిత హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ను అందిస్తోంది. జియో సేవలు ఇతర కంపెనీల కంటే చౌకగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో గిగా ఫైబర్ కోసం ఎంతోమంది వేచి చూస్తున్నారు. దీని కోసం మరెంతో కాలం వచ్చి చూడాల్సిన అవసరం లేదనిపిస్తోంది.

12వ తేదీన లాంచ్ చేసే ఛాన్స్
టెలికం రంగంలో సంచలనాలు సృష్టించిన జియో... త్వరలో ప్రయోగాత్మక దశలో ఉన్న గిగా ఫైబర్ సేవలను పలు నగరాల్లో అందుబాటులోకి తేనుంది. సమాచారం మేరకు ఆగస్ట్ 12వ తేదీ నుండి జియో బ్రాడ్ బ్యాండ్ కమర్షియల్ సేవలను లాంచ్ చేయనుంది. అయితే ఈ అధికారిక ప్రారంభంపై కంపెనీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

సాధారణ సర్వసభ్య సమావేశం తేదీ రోజునే..
ఫైబర్ టు ది హోమ్ (FTTH) సేవల్ని అధికారికంగా ప్రారంభించే విషయమై వచ్చే నెలలో జరగనున్న సాధారణ సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించే అవకాశముందని ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. 42వ జనరల్ మీటింగ్ ఈవెంట్ తేదీని (ఆగస్ట్ 12) ఇప్పటికే రిలయన్స్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అప్పుడే దీనిని లాంచ్ చేయవచ్చు.

ముఖేష్ అంబానీ ఏం చెప్పారంటే...
ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ క్వార్టర్ 1 ఫలితాల ప్రకటన సందర్భంగా ముఖేష్ అంబానీ జియో గిగాఫైబర్ అంశంపై మాట్లాడారు. జియో గిగా ఫైబర్ బెటా ట్రయల్ సేవలు విజయవంతమయ్యాయని, 50 మిలియన్ల ఇళ్లలో త్వరలో ప్రారంభిస్తామని ముఖేష్ అంబానీ చెప్పారు. ఇప్పటికే జియోతో టెలికం రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. గిగా ఫైబర్ ప్రభావం ఇప్పటికే కనిపిస్తోందని, ఇది మార్కెట్లోకి వస్తే విప్లవాత్మక మార్పులు వస్తాయని అంటున్నారు.

టెస్టింగ్ స్టేజ్లో...
1 GBPS వేగంతో ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. టెస్టింగ్ స్టేజ్లోని ఈ ఫైబర్ కనెక్షన్ తీసుకుంటే బ్రాడ్ బ్యాండ్తో పాటు, ల్యాండ్ లైన్ సౌకర్యం ఉంటుంది. త్వరలో టీవీ సేవల్ని ప్రారంభిస్తుంది. 100 MBPS వేగంతో 100 GB వరకూ 90 రోజుల పాటు ఉచిత సేవలు పొందవచ్చు. ఇందుకు ఏ ఛార్జీలు వసూలు చేయబోమని, కానీ సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.4,500 కట్టాల్సి ఉంటుందని రిలయన్స్ చెబుతోంది. అధికారికంగా సేవలు ప్రారంభమయ్యాక మినిమం ప్లాన్ రూ.600గా ఉంటుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications