కరెన్సీ నోట్లను గుర్తించేందుకు సరికొత్త యాప్, ఇదీ ఆర్బీఐ ప్లాన్
న్యూఢిల్లీ: దృష్టిలోపం ఉన్నవారు కరెన్సీ నోట్లను గుర్తించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఓ యాప్ను అందుబాటులోకి తీసుకురానుంది. డిజిటల్ భారత్ దిశగా దేశం అడుగులు వేస్తోంది. అయినప్పటికీ ఇప్పటికీ దేశంలో క్యాష్ ట్రాన్సాక్షన్స్దే హవా. ఈ నేపథ్యంలో దృష్టిలోపం ఉన్నవారు కూడా సులభంగా గుర్తించేలా యాప్ తీసుకొస్తోంది ఆర్బీఐ. దేశంలో 80 లక్షలమంది దృష్టిలోపం కలిగినవారు ఉన్నారు. సెంట్రల్ బ్యాంకు నిర్ణయంతో వీరికి ప్రయోజనం కలగనుంది.
మారిన పాన్ - ఆధార్ కార్డు నిబంధనలు, కొత్త రూల్స్ ఇవే
నోట్లు ఇలా గుర్తించవచ్చు..
మొబైల్ కెమెరా ముందు మహాత్మా గాంధీ సిరీస్, మహాత్మా గాంధీ న్యూ సిరీస్ కరెన్సీ నోట్లను పెట్టి ఫొటో తీస్తే ఆడియో రూపంలో ఆ కరెన్సీ విలువ ఎంతో చెప్పనుంది. కెమెరా ముందు నోటును కరెక్టుగా పెట్టి, ఫొటో తీస్తే ఆ నోటు ఏదో చెబుతుంది. ఫోటో సరిగ్గా రాకపోయినా మరోసారి ప్రయత్నించండి అని చెబుతుంది. ఈ యాప్ని అభివృద్ధి చేసేందుకు కంపెనీల నుంచి ఆర్బీఐ బిడ్స్ ఆహ్వానించింది.
ఇంటాగ్లియో ఆధారిత గుర్తింపు మార్క్స్
రూ.100, అంతకంటే ఎక్కువ విలువ కలిగిన నోట్లను దృష్టిలోపం ఉన్నవారు గుర్తించేందుకు ఇంటాగ్లియో ప్రింటింగ్ ఆధారిత గుర్తింపు మార్స్ ఉన్నాయి. ప్రస్తుతం రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500, రూ.2,000 కరెన్సీ నోట్లు ఉన్నాయి. రూ.1 నోటు కూడా ఉంది. దృష్టిలోపం ఉన్నవారు నగదు ఆధారిత ట్రాన్సాక్షన్స్ చేసే సమయంలో ఆ నోటు ఎంత విలువ కలిగినదో గుర్తించడం ముఖ్యం. 2016లో నోట్ల రద్దు అనంతరం కొత్త బ్యాంకు నోట్లు చలామణిలోకి వచ్చాయి. దృష్టిలోపం ఉన్నవారు నోట్లతో కొనుగోలు, విక్రయ వ్యవహారాలు రిపేటప్పుడు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఆర్బీఐ సున్నితమైన ధోరణితో ఉందని ఆర్బీఐ పేర్కొంది. ఇప్పుడు తీసుకొచ్చే యాప్ సులభంగా నోట్లను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది.
వెండర్స్కు ఆదేశాలు
ఇందుకు మొబైల్ అప్లికేషన్ను అభివృద్ధి చేయాలని వెండర్స్కు ఆర్బీఐ సూచించింది. దృష్టిలోపం ఉన్నవారు నోట్లు గుర్తించేందుకు తాము ఓ డివైజ్ లేదా మెకానిజంను అభివృద్ధి చేసే ప్రయత్నాలు చేస్తామని ఆర్బీఐ గత ఏడాది ప్రకటించింది.