జగన్! మీరు చేసేది తప్పు, అభివృద్ధి అడ్డుకోకు: కేంద్రమంత్రి హెచ్చరిక లేఖ!
న్యూఢిల్లీ: 2019 ఆర్థిక సంవత్సరంలో పునరుత్పాదక శక్తి ద్వారా ఆంధ్రప్రదేశ్ 18 శాతం విద్యుదుత్పత్తిని పొందింది. తద్వారా దేశంలో హరిత ఇండియాలో కీలకపాత్ర పోషిస్తోంది. ఏపీలో 12 శాతం ఇళ్లు విండ్, సోలార్ కెపాసిటీ కలిగి ఉన్నాయి. ఇదిలా ఉండగా, వైయస్ జగన్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా షాకిచ్చింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను (PPA)లను సమీక్షించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించగా, అలా చేయడం సరికాదని కేంద్రం హెచ్చరించింది. గతంలో ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర ఇంధన కార్యదర్శి లేఖ రాయగా, ఈసారి కేంద్రమంత్రి ఆర్కే సింగ్ సీఎం జగన్కు లేఖ పంపించారు.
ఏపీ బడ్జెట్, జగన్ హామీలు-ఏ స్కీంకు ఎంత: ఆరోగ్యశ్రీకి కండిషన్, మద్యపాన నిషేదంపై కీలక అడుగు
పీపీఏ ఒప్పందాలు తిరగదోడటం సరికాదు
పీపీఏ ఒప్పందాలు తిరగదోడటం కాంట్రాక్టుల ఒప్పందాలను దెబ్బతీసినట్లు అవుతుందని, అలాగే, ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతారని కేంద్రమంత్రి.. సీఎంకు సూచించారు. ఈ మేరకు తన లేఖలో మొదట ఇటీవల ఎన్నికల్లో గెలిచినందుకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యుత్, పునరుత్పాదక ఇంధన రంగాల్లో ఏపీకి తమ సహకారం ఉంటుందన్నారు. అవినీతి ఎక్కడ చోటు చేసుకున్నా కచ్చితంగా చర్యలు ఉండాలని, అదే సమయంలో మన చర్యలు, ప్రయత్నాలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఉండాలని పేర్కొన్నారు.
పెట్టుబడుల ఆకర్షణ, అభివృద్ధి దెబ్బతింటాయి
మన చర్యలు నిష్పక్షపాతంగా లేకుంటే పెట్టుబడుల ఆకర్షణ, అభివృద్ధి రెండు కూడా దెబ్బతింటాయని కేంద్రమంత్రి పేర్కొన్నారు. పునరుత్పాదక ఇంధన రంగం భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. దేశంలో వేగవంతమైన అభివృద్ధి ప్రదర్శిస్తున్న రంగాల్లో పునరుత్పాదక ఇంధనం ఒకటి అన్నారు. మన చర్యల వల్ల అనవసరంగా.. ఇక్కడ చట్టం పని చేయడం లేదని, కుదుర్చుకున్న ఒప్పందాలను గౌరవించడం లేదన్న అభిప్రాయం బయటకు వెళ్తే పెట్టుబడులు తగ్గిపోతాయని, అప్పుడు అభివృద్ధి నిలిచిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
సమీక్ష కోసం కమిటీ ఏర్పాటు
ఏపీలోని కొత్త ప్రభుత్వం పీపీఏలను సమీక్షించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వం కుదుర్చుకున్న పీపీఏలు న్యాయబద్దంగా లేవని, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి పెను భారమని ఆ కమిటీ అభిప్రాయపడుతోంది. ప్రభుత్వ రంగ డిస్కంలకు ఇది ఆర్థిక భారమంటున్నారు. ఈ పీపీఏలు అనుచితం, ఉద్దేశ్యపూర్వకంగా చేసినవిగా అభిప్రాయపడ్డారు. జూలై 15వ తేదీన ఈ కమిటీ అమరావతిలో భేటీ కానుంది. గత యంత్రాంగం యూనిట్ టారిఫ్ ధర రూ.4.84గా నిర్ణయించగా, దీనిని రూ.2.25గా నిర్ణయించాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి... సీఎంకు రాసిన లేఖలో... అవినీతికి వ్యతిరేకంగా చేస్తున్న యుద్ధంలో మీకు సహకరిస్తామని, అక్రమాలపై చర్యలు ఉండాలని పేర్కొన్నారు.
జగన్! మీరు చేస్తోంది కరెక్టు కాదు..
ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని మేజర్ పెన్షన్ ఫండ్స్ కూడా పునరుత్పాదక ఇంధన సంస్థల ద్వారా పెట్టుబడులు పెడతాయని జగన్కు ఆర్కే సింగ్ గుర్తు చేశారు. 2015 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ సెక్టార్లోకి 4.8 బిలియన్ డాలర్లు వచ్చాయన్నారు. విద్యుత్ టారిఫ్స్ స్వతంత్రంగా పని చేసే రెగ్యులేటరీ కమిషన్లు నిర్ణయిస్తాయని, కేంద్రంలో, రాష్ట్రాల్లో దీనికి వేర్వేరు రెగ్యులేటరీ కమిషన్లు ఉంటాయన్నారు. బహిరంగ విచారణ తర్వాత ఖర్చులు పరిశీలించి నిర్ణయిస్తాయన్నారు. పీపీఏలపై ఓసారి ఒప్పందం కుదుర్చుకుంటే దానికి కట్టుబడి ఉండాలన్నారు. వాటిని గౌరవించకుంటే పెట్టుబడులు రావడం ఇబ్బందికరమన్నారు. పీపీఏలను రద్దు చేయాలనుకోవడం తప్పు.. చట్ట విరుద్దమన్నారు. ఏదైనా ఒప్పందంలో అవినీతి జరిగినట్లు ఆధారాలు, ప్రాథమిక సాక్ష్యాలు ఉంటే దానిపై విచారణ చేయడంలో తప్పు లేదన్నారు. ఏదైనా ఒప్పందంలో తప్పు జరిగినట్లు ఆధారాలు ఉంటే దానిని రద్దు చేసి, విచారణ జరపవచ్చన్నారు. కానీ మూకుమ్మడిగా పీపీఏల రద్దు సరికాదని, ఆధారాలు లేకుండా విచారణ జరపాలనుకోవడం సరికాదన్నారు.
అన్ని రాష్ట్రాల్లో వలె ఏపీలోను...
ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన పీపీఏ ఒప్పందాలకు సంబంధించిన వివరాలు పంపించారు. పవన విద్యుత్ రేట్లు 2014-15లో ఏపీలో యూనిట్కు రూ.4.7గా ఉంటే, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాక, మధ్యప్రదేశ్, కేంద్రంలలో అంతకుమించి ఉన్నాయి. ఒక్క తమిళనాడులో కాస్త తక్కువగా ఉంది. 2016-17లో ఏపీలో రూ.4.84గా ఉంటే, తమిళనాడు, గుజరాత్, కర్ణాటకల్లో స్వల్పంగా మాత్రమే తక్కువగా ఉంది. మిగతా పై రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. ఇక సౌర విద్యుత్ విషయానికి స్తే ఒక యూనిట్కు 2013లో ఏపీలో రూ.6.49గా ఉంటే, తమిళనాడులో రూ.6.48, కర్ణాటకలో రూ.6.87, యపీలో రూ.8.9, మధ్యప్రదేశ్లో రూ.8.05గా ఉంది. 2014లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్లో దాదాపు సమానంగా ఉంది. 2015లో ఏపీలో రూ.4.63గా ఉండగా, తెలంగాణలో అంతకంటే రూ.ఎక్కువ అంటే రూ.5.62గా ఉంది. ఇదిలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా ఎన్టీపీసీ, సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాకు ఎలక్ట్రిసిటీ ధరలు తగ్గింపు అంశంపై లేఖ రాయనున్నారు. యూనిట్ విద్యుత్ ధరను రూ.2.50కు తగ్గించాలని లేఖ రాసే అవకాశముంది.