మోడీ టార్గెట్: ఐదేళ్ళలో రూ 3.25 లక్షల కోట్లు?: ప్రభుత్వరంగ కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణ
అఖండ మెజారిటీ తో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఎ ప్రభుత్వం భారీ పెట్టుబడుల ఉపసంహరణ టార్గెట్ పెట్టుకొంది. ప్రధాని నరేంద్ర మోడీ ... పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా కనీసం రూ 3.25 లక్షల కోట్లు ($47 బిలియన్ డాలర్లు) సమీకరించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. తద్వారా వివిధ మూలధన పెట్టుబడులు సులువు అవుతాయని, కరెంటు అకౌంట్ డెఫిషిట్ తగ్గుదలతో పాటు ఆర్ధిక రంగం పరుగులు పెడుతుందని ఆయన యోచిస్తున్నారట. ఈ మేరకు ప్రభుత్వం లోని ఇద్దరు ఉన్నతాధికారులు వెల్లడించినట్లు రాయిటర్స్ వార్త సంస్థను ఉటంకిస్తూ ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది.
మారిన పాన్ - ఆధార్ కార్డు నిబంధనలు, కొత్త రూల్స్ ఇవే
మూడు రేట్లు అధికం...
కాంగ్రెస్ నేతృత్వం లోని యూపీఏ ప్రభుత్వం 2009-14 మధ్య కాలంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా కేవలం $14.52 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. కాగా ఎన్డీయే తోలి ప్రభుత్వం 2014-19 మధ్య కాలంలో ఏకంగా $40.92 బిలియన్ డాలర్ల పెట్టుబడుల ఉపసంహరణ చేసింది. ఇప్పుడు రెండో సారి వచ్చే ఐదేళ్ళలో $47 బిలియన్ డాలర్ల మొత్తం రాబట్టాలని మోడీ యోచిస్తుండటం విశేషం.
40% వరకు వాటాల తగ్గింపు...
సాధారంగంగా ప్రభుత్వరంగ కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణ జరిగినా... ప్రభుత్వం 51% మెజారిటీ వాటాను తన వద్దే ఉంచుకొంటుంది. అయితే ఇందుకు భిన్నంగా ఈ సారి ప్రభుత్వ వాటాను ఏకంగా 40% వరకు కూడా తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ సందర్భంగా ఇదే విషయాన్నీ వెల్లడించటం తో ఇకపై పెట్టుబడుల ఉపసంహరణ 40% వరకు ఉంటుందని స్పష్టం అవుతోంది. అదే జరిగితే ప్రభుత్వం పెట్టుకొన్న టార్గెట్ సులువుగా చేరుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
గుర్తించిన కంపెనీలు ఇవే...
కాగా పెట్టుబడుల ఉపసంహరణ కోసం ప్రభుత్వం గుర్తించిన కంపెనీల్లో ఆయిల్ అండ్ నతురల్ గ్యాస్ కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, గెయిల్ ఇండియా లిమిటెడ్, ఎన్టీపీసీ, యెన్ హెచ్ పీ సి, యెన్ ఎం డీ సి, కోల్ ఇండియా, భారత్ హెవీ వంటి దిగ్గజ కంపెనీలు ఉన్నట్లు విశ్వనీయ వర్గాలు తెలిపాయని రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం లెక్కిస్తే ఈ కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహారం ద్వారా తప్పనిసరిగా రూ 3.25 లక్షల కోట్లు వస్తాయన్న అంచనాకు వచ్చినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
వ్యూహాత్మక నిర్ణయం...
ప్రభుత్వ రంగ కంపెనీల్లో మెజారిటీ వాటాను తగ్గించుకొంటునప్పటికీ ... జీవిత బీమా సంస్థ తో సంయుక్తంగా ఆయా కంపెనీల్లో 51% వాటాను కలిగి ఉండాలని మోడీ ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీనిని వ్యూహాత్మక నిర్ణయంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే, దేశ ఆర్ధిక రంగానికి వెన్నెముక లాంటి ప్రభుత్వ రంగ కంపెనీల్లో పూర్తిగా నియంత్ర కోల్పోతే ... దీర్ఘకాలంలో దేశానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే, మోడీ ఇలాంటి వ్యూహాత్మక నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది.