ఏపీ బడ్జెట్కు మోడీ దెబ్బ! జగన్ ఎక్కడ సర్దుబాటు చేస్తారు?
న్యూఢిల్లీ/అమరావతి: నాలుగు రోజుల క్రితం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై తెలుగు రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు న్యాయం జరగలేదని, విభజన చట్టంలోని హామీల ప్రస్తావన లేదని వైసీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మండిపడుతున్నాయి. దీనికి బీజేపీ కూడా ధీటుగానే సమాధానం ఇస్తోంది. విభజన హామీలకు కేంద్రం కట్టుబడి ఉందని, దానిని బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదని చెబుతోంది. ఈ నేపథ్యంలో జగన్ హామీలతో భారం, సర్దుబాటు ఎంత, హామీలపై ఎవరేం చెబుతున్నారంటే...
ఏపీ బడ్జెట్ అంచనా నాటి కంటే తక్కువ: జగన్ నవరత్నాలకే ప్రాధాన్యం, కొత్త వాటికి నో!
జగన్ హామీలు.. ప్రభుత్వంపై ఏటా రూ.73,305 కోట్ల భారం
ఏపీ ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఏపీ బడ్జెట్ రూ.2 లక్షల కోట్లను దాటుతుందని భావిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలకు ముందు రూ.2.26 లక్షల కోట్ల మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టింది. దీనికి అటు ఇటుగా ఈ బడ్జెట్ ఉంటుందని అంచనా. ప్రభుత్వ ఖజానాలో ఏమీలేనందున బడ్జెట్ ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వంపై ఏటా రూ.73,305 కోట్లు భారం అవుతుందని అంచనా. జగన్ ఇచ్చిన నవరత్నాలకే బడ్జెట్లో ప్రాధాన్యం ఉండనుంది.
ఎంత అవసరం.. ఎంత సర్దుబాటు
2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మూడు నెలలకు పైగా గడిచిపోయింది. ఈ అంచనా రూ.49,943 కోట్లు. ఇవి కాకుండా వివిధ శాఖలు అంచనాల కంటే రూ.15,000 కోట్ల వరకు అదనపు నిధులు కావాలని చెబుతూ ప్రతిపాదనలు పంపించాయని తెలుస్తోంది. ఇది మొత్తంగా రూ.64,943 కోట్ల భారం పడనుందని తెలుస్తోంది. ఇవి కాకుండా వేతనాలు, పెన్షన్ వంటివి కలుపుకొని రానున్న 9 నెలల కాలానికి బడ్జెట్ రూ.2.5 లక్షల కోట్లను టచ్ చేయవచ్చునని భావిస్తున్నారు. అయితే ఫైనాన్స్ డిపార్టుమెంట్ మాత్రం రూ.1.15 లక్షల కోట్లకు సర్దుబాటు చేయవచ్చునని భావిస్తున్నారు.
ప్రభుత్వంపై భారం ఇలా...
పెన్షన్లు పెంచడంతో ఈ భారం ఏడాదికి రూ.7,440 కోట్ల వరకు పడనుందని తెలుస్తోంది. పెన్షన్ను రూ.2,000 నుంచి క్రమంగా ఈ నాలుగేళ్లలో రూ.3,000 చేయనున్నారు. అయిదేళ్లకు ఈ భారం రూ.37,200 కోట్లు కానుంది. పేదలకు 25 లక్షల ఇళ్లు నిర్మించేందుకు రూ.75,000 కోట్లు అవసరం. స్వయం సహాయక సంఘాలకు నాలుగు ఇన్స్టాల్మెంట్స్ లోన్ మాఫీ చేస్తామని చెప్పారు. దీనికి రూ.19,200 కోట్లు కానుంది. ప్రతి ఇన్స్టాల్మెంట్కు కనీసం రూ.3,800 కోట్లు కేటాయించవలసి ఉంటుంది.
రాష్ట్ర బడ్జెట్పై కేంద్ర బడ్జెట్ ప్రభావం...
బడ్జెట్ నిరాశపరిచిందని, ముఖ్యంగా లోటు బడ్జెట్తో ఉన్న ఏపీకి కేటాయింపులు అంతంత మాత్రంగానే ఉన్నాయని ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెంటనే ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ ప్రభావం రాష్ట్ర బడ్జెట్పై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి తగినంత సాయం అందనప్పుడు సర్దుబాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రెవెన్యూ లోటును భర్తీ చేయలేదని, రాజధానికి కేటాయింపులు లేవన్నారు. ప్రత్యేక హోదాను ప్రస్తావించలేదన్నారు. అయితే బీజేపీ గత అయిదేళ్లుగా హోదా ముగిసిన అధ్యయనం అంటోంది.
జగన్ ప్రభుత్వం ఎక్కడ సర్దుబాటు చేస్తుంది
బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాలని కోరామని, దాని ప్రస్తావన లేదన్నారు. ఏపీ సమస్యల పరిష్కారం విషయంలో కేంద్రం ప్రత్యేకంగా చూడాలని, కేంద్రం సహకారం కచ్చితంగా అవసరమని, దీనిపై మళ్లీ మోడీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామన్నారు. కేంద్రం సాయం అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ జగన్ ఇచ్చిన హామీలు, నవరత్నాల విషయంలో రాజీపడేది లేదని బుగ్గన స్పష్టం చేశారు. ఈ విషయంలో సర్దుబాటు ఉండదని చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి ఆశించిన మేర సహకారం లేదని భావిస్తే, జగన్ హామీలైన నవరత్నాల హామీల విషయంలో సర్దుబాటు ఉండదని చెబుతున్నప్పుడు, ఎక్కడ సర్దుబాటు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
నిధులపై బీజేపీ ఏం చెబుతోంది
కేంద్ర బడ్జెట్ అంటే దేశానికి మొత్తం ఉంటుందని, కేంద్రం నుంచి ఆయా రాష్ట్రాలకు వచ్చే నిధులు యథాతథంగా వస్తాయని, దీనిని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. అదేవిధంగా ఏపీకి తాము ఇచ్చిన హామీల విషయంలో రాజీ లేదని, దానిని బడ్జెట్ సందర్భంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదంటున్నారు. ఉదాహరణకు పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించామని, బడ్జెట్లో దానిని ప్రస్తావించనప్పటికీ, ఆ ప్రాజెక్టును 100 శాతం కేంద్రం పూర్తి చేస్తుందని చెబుతున్నారు. అలాగే, విభజన చట్టంలోని అన్ని హామీలను రెండు తెలుగు రాష్ట్రాలకు నెరవేర్చుతామని చెబుతున్నారు. కేటాయింపులకు, ప్రత్యేకంగా ఇచ్చే నిధులకు సంబంధం లేదని చెబుతున్నారు.
బడ్జెట్ కేటాయింపులు...
విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.1400 కోట్లు, పెట్రోలియం వర్సిటీకి రూ.32 కోట్లు, కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రూ.13 కోట్లు, గిరిజన వర్సిటీకి రూ.8 కోట్లు కేటాయించారు. తెలంగాణలోని హైదరాబాద్ ఐఐటీకి ఈఏపీ కింద రూ.80 కోట్లు కేటాయించారు. తెలుగు రాష్ట్రాల్లోని ఐఐఎం, ఎన్ఐటీ, ఐఐఎస్ఆర్, ట్రిపుల్ ఐటీలకు అవసరమైన నిధులను కేటాయింపుల్లో పేర్కొనలేదు. విభజన చట్టంలోని హామీల అమలును ప్రస్తావించలేదు. అయితే విభజన హామీలు ప్రస్తావించనప్పటికీ ఆ హామీలు నెరవేరుస్తామని బీజేపీ చెబుతోంది.