పది రాష్ట్రాలకు ప్యాకేజీ: తెలంగాణకు రూ.450 కోట్లు, ఏపీకి రూ.15 కోట్లు
న్యూఢిల్లీ: 2018-19 ఆర్థిక సంవత్సరం వరకు, గత పదేళ్లలో పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లోకి కేంద్ర ప్రభుత్వం రూ.3.15 ట్రిలియన్ డాలర్లు ఇచ్చిందని కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ సోమవారం లోకసభకు వెల్లడించారు. బ్యాంకులు కేపిటల్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో (CRAR) కనీసం 9 శాతం కలిగి ఉండాలని తెలిపారు. 2019 మార్చి 31వ తేదీ నాటికి అన్ని PSB బ్యాంకులు కూడా దీనిని చేరుకున్నాయన్నారు. అదే విధంగా దేశంలోని పది రాష్ట్రాలకు 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.5,239 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని చెప్పారు.
బడ్జెట్ దెబ్బ, ఐటీ కంపెనీలపై బైబ్యాక్ షాక్: ప్రభుత్వం ట్యాక్స్ ఎందుకు విధించిందో తెలుసా?
ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు విడుదల చేశారంటే?
పది రాష్ట్రాలకు విడుదల చేసిన ప్రత్యేక ప్యాకేజీలో త్రిపురకు రూ.1,858 కోట్లు, ఉత్తర ప్రదేశ్కు రూ.1,200 కోట్లు, బీహార్కు రూ.739 కోట్లు, అరుణాచల్ ప్రదేశ్కు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు కోసం రూ.309 కోట్లు, విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టిన ప్రాజెక్టుల కోసం చెల్లించిన వడ్డీ రీయింబర్స్మెంట్స్ కోసం ప్రత్యేక ప్యాకేజీ కింద ఏపీకి రూ.15.81కోట్లు, విభజన చట్టంలోని హామీ మేరకు వెనుకబడిన జిల్లాల కోసం తెలంగాణకు రూ.450 కోట్లు, జమ్ముకాశ్మీర్కు రూ.285 కోట్లు, నాగాలాండ్కు రూ.226 కోట్లు, రాజస్థాన్కు రూ.146 కోట్లు, ఉత్తరాఖండ్కు రూ.8 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రమంత్రి తెలిపారు. మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, జమ్ము కాశ్మీర్, త్రిపుర, తెలంగాణ, ఏపీ, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి జూలై 5వ తేదీ వరకు ప్రత్యేక సాయం కోసం విజ్ఞప్తులు వచ్చినట్లు తెలిపారు.
ఏపీ రోడ్లకు రూ.8,728 కోట్లు
ఏపీలో కేంద్రీయ, గిరిజన వర్సిటీల ఏర్పాటుకు సంబంధించి రెండు బిల్లులను 16వ లోకసభలో ప్రవేశపెట్టినప్పటికీ ఆమోదం లభించలేదని, దీంతో రద్దయ్యాయని మరో కేంద్రమంత్రి రమేష్ నిశాంక్ పోఖ్రియాల్ తెలిపారు. కేంద్ర ప్రాయోజిత విద్యా సంస్థలకు భూకేటాయింపు అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలు జాప్యం చేస్తుండటంతో, నిర్మాణం మరింత భారం అవుతోందని చెప్పారు. మరోవైపు, జాతీయ రహదారుల అభివృద్ధికి గత అయిదేళ్లలో ఏపీకి రూ.8,728 కోట్లు విడుదల చేసినట్లు గడ్కరీ చెప్పారు.
ఆడిట్ సమర్పిస్తే పోలవరం నిధులు
పోలవరం ప్రాజెక్టు కోసం 2014 మార్చి 31వ తేదీ వరకు చేసిన వ్యయానికి సంబంధించి ఆడిట్ సమర్పిస్తే తదుపరి నిధులు విడుదల చేస్తామని మరో కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. 2014 ఏప్రిల్ 1 నాటికి కేంద్ర సాయం రూ.6,764 విడుదల చేశామన్నారు. దీనికి సంబంధించి ఆడిట్, 2013-14 ధరల ప్రకారం అంచనాలు పంపించాలని సూచించినట్లు చెప్పారు.
రూ.642 కోట్ల ఉపాధి నిధులు విడుదల
ఇదిలా ఉండగా, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏపీకి దాదాపు 642 కోట్ల నిధులు విడుదల చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రెండో వాయిదాలో మొదడి విడతగా మెటిరీలయల్, అడ్మినిస్ట్రేటివ్ కాంపోనెంట్ కింద ఈ నిధులు విడుదల చేసింది. ఉపాధి స్కీం అమలుకు సంబంధించి రాష్ట్ర వాటా నిధుల్ని మూడ్రోజుల్లో జమ చేయాలని, లేదంటే తదుపరి నిధులు నిలిపేస్తామని తెలిపింది.