కొన్ని ఈజీ.. కొంత లాభం, మరింత నష్టం: ఈ బడ్జెట్ ప్రభావం మీపై ఎంత?
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ జూలై 5న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ప్రభావం మీ పైన ఏ మేరకు ఉంటుందో తెలుసుకోండి. మీరు ట్యాక్స్ పేయర్ అయినా, పెట్టుబడులు పెడితే, ఇంటిని కొనుగోలు చేస్తే, బంగారం కొనాలనుకుంటే.. ఇలా ఒక్కో రంగంపై ఒక్కో విధంగా ప్రభావం పడుతుంది. మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక నిర్మల తన తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
జూలై1 నుంచే మార్పు.. రైల్వే టైంటేబుల్, RTGS NEFT ఛార్జీలు
ముందే పిల్ చేసిన ఐటీ రిటర్న్స్
ఎవరికి వారు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం సులభం కాదు. ఈ ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని ఆయా వ్యక్తులకు సంబంధించిన ఆదాయం, పెట్టుబడులు, ఖర్చుల వివరాలతో ఐటీ శాఖ ముందుగా పూర్తి చేసిన ఐటీ రిటర్న్స్ను పన్ను చెల్లింపుదారులకు అందించనుంది. ఇందుకు అవసరమైన సమాచారాన్ని మ్యూచువల్ ఫండ్స్, ఇన్సురెన్స్ కంపెనీలు, రిజిస్ట్రార్స్, బ్యాంకుల నుంచి సేకరిస్తుంది. ముందుగానే పూర్తి చేసిన ఐటీ రిటర్న్స్ ఐటీ శాఖ వెబ్సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని, ఆ వివరాలను సరిపోల్చుకుని రిటర్న్ దాఖలు చేస్తే ఇబ్బందులు తగ్గుతాయి.
హోమ్ లోన్
ఈ ఏడాది ఇళ్లు కొనుగోలు చేసే వారికి భారీ ఊరట. ఇప్పటి వరకు అందుబాటు ధరల్లోని గృహ రుణాలపై చెల్లించే వడ్డీ పన్ను మినహాయింపును రూ.3.5 లక్షలకు పెంచారు. రూ.45 లక్షల లోపు ధర ఉండే గృహాలకు మాత్రమే ఈ పన్ను మినహాయింపు వర్తిస్తుంది. అది కూడా 2020 మార్చి లోపు కొనుగోలు చేసే గృహాలకు మాత్రమే. మరోవైపు, రెంటల్ ప్రాపర్టీ చట్టాన్ని తీసుకురానుంది. అలాగే ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) కొనుగోలు చేస్తే రూ.1.5 లక్షల వరకు మినహాయింపు ఇస్తోంది. ఈవీ వాహనాలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
పాన్-ఆధార్
ఇక నుంచి పాన్ కార్డుకు బదులు ఆధార్ కార్డును ఉపయోగించవచ్చు. ఐటీ రిటర్న్స్ దాఖలుకు కూడా మీకు పాన్ లేకుంటే ఆధార్ కార్డును ఉపయోగించే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ద్వారా కల్పించింది. ఎవరైనా పాన్ కార్డు ఈజీ అనుకుంటే అది కూడా ఉపయోగించవచ్చు.
బంగారం, పెట్రో ఉత్పత్తులు మరింత ఖరీదు
పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూ.1 చొప్పున సెస్ విధించింది. మొత్తంగా రూ.2కు పైగా రేటు పెరుగుతోంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు కొద్దిగా పెరిగాయి. బంగారంపై కస్టమ్ డ్యూటీని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచడం వల్ల పసిడి ధర కూడా పెరగనుంది.
లిస్టైన కంపెనీల్లో ప్రజల వాటా పెంపు
లిస్టే అయిన కంపెనీల్లో ప్రజల కనీస వాటాను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలని కేంద్రం భావిస్తోంది. అధిక నాణ్యత కలిగిన కంపెనీల షేర్లు మరిన్ని ప్రజలకు అందుబాటులోకి రావడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ తరహా స్టాక్స్ ఇప్పుడు అధిక పీఈలో ట్రేడ్ అవుతున్నాయి. ఇవి చవకగా మారతాయన్న అభిప్రాయం ఉంది.
విదేశీ రుణాలతో...
ప్రభుత్వం విదేశీ మార్కెట్ల నుంచి రుణాలు సమీకరించనుంది. స్థానిక మార్కెట్ల నుంచి నిధులు సమీకరిస్తే అది బాండ్ మార్కెట్, వడ్డీ రేట్లపై ప్రభావం చూపుతుంది. కానీ ఇప్పుడు స్థానిక మార్కెట్లపై ఆధారపడదు కాబట్టి తక్కువ వడ్డీ రేట్ల విధానం అలాగే కొనసాగే అవకాశం.
బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ పన్నులు
బ్యాంకింగ్ లావాదేవీలు సూపర్ రిచ్కు కాస్త భారం కానున్నాయి. సామాన్యులపై మాత్రం భారం పడదు. ఏడాదిలో రూ.కోటి అంతకుమించి నగదు విత్డ్రా చేసుకుంటే 2 శాతం పన్ను ఉంటుంది. నగదు వినియోగాన్ని తగ్గించి, డిజిటల్ లావాదేవీలు పెంచడానికి ఇది దోహదపడుతుంది.
మ్యుచువల్ ఫండ్స్
మ్యుచువల్ ఫండ్ సంస్థలు నిర్వహిస్తున్న ఈక్విటీ ఆధారిత పొదుపు స్కీముల్లో (ELSS) ఇన్వెస్ట్ చేసే పెట్టుబడుల్లో రూ.1.5 లక్షల వరకు ప్రస్తుతం సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంది. ఈ సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల షేర్లతో కూడిన ETFకు తీసుకు రానున్నారు. త్వరలో ఈటీఎఫ్ పథకాలు మార్కెట్కు రానున్నాయి. సెక్షన్ 80సీ కింద ప్రయోజనాలు పొందవచ్చు.
రిచ్కు సర్చార్జ్
ఎక్కువ ఆదాయం కలిగిన వారికి ఎక్కువ సర్చార్జ్ మోపారు. రూ.2-5 కోట్ల ఆదాయం ఉంటే 3 శాతం, రూ.5 కోట్లకు పైగా ఉంటే 7 శాతం సర్చార్జ్ పెంచారు. రిటైలర్ ట్రేడర్స్కు పెంచన్ పథకం తీసుకు వస్తున్నారు. ఇది చిన్న వ్యాపారస్తులకు ఎంతో ప్రయోజనకరం. వార్షిక టర్నోవర్ రూ.50 కోట్ల కంటే ఎక్కువ ఉంటే డిజిటల్ పద్ధతిలో చెల్లించే ఖాతాదారులకు తక్కువ ధరకే డిజిటల్ చెల్లింపుల సదుపాయం కల్పిస్తారు.ఇలాంటి చెల్లింపులపై ఆర్బీఐ, బ్యాంకులు ఎలాంటి చార్జీలు, మర్చంట్ డిస్కౌంట్ రేట్స్ భారం మోపవు.