బంగారం భగ్గు... స్మగ్లింగ్ పెరిగే ఛాన్స్
ఇప్పటికే పెరుగుతున్న బంగారం ధరలు రానున్న కాలంలో మరింత భగ్గుమనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచాలని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రతిపాదించారు. ప్రస్తుతం బంగారంపై దిగుమతి సుంకం 10 శాతంగా ఉంది. దీన్ని 12.5 శాతానికి పెంచుతున్నట్టు సీతారామన్ తెలిపారు.
నిర్మలా సీతారామన్ బడ్జెట కీలక అంశాలు: బడ్జెట్లో ఏం చెప్పారు?
ఎందుకు పెంచారంటే...
* మన దేశంలో బంగారం ఉత్పత్తి చాలా తక్కువ స్థాయిలో ఉంది. కానీ వినియోగం మాత్రం విపరీతంగా ఉంది. అందుకే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
* బంగారం వినియోగంలో ప్రపంచంలోని దేశాల్లో మన దేశం రెండో స్థానంలో ఉంది. బంగారం దిగుమతి చేసుకుంటున్న ప్రధాన దేశాల్లోనూ భారత్ ముఖ్యమైన స్థానంలో ఉంది. బంగారాన్ని మన దేశంలో ఆభరణాల కోసమే అత్యధికంగా వినియోగిస్తున్నారు.
* బంగారం దిగుమతి కోసం ఏటా భారీ మొత్తంలో విదేశీ మారక నిల్వలను వెచ్చించాల్సి వస్తోంది. దీని మూలంగా కరెంటు ఖాతా లోటు కట్టుతప్పుతోంది. ఈ నేపథ్యంలోనే బంగారం దిగుమతులను తగ్గించడానికి దిగుమతి సుంకాన్ని పెంచాలని ప్రతిపాదించారు.
* గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో భారత్ 3,280 కోట్ల డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది.
* వార్షికంగా మన దేశానికి దాదాపు 800 టన్నుల వరకు బంగారం దిగుమతి అవుతోంది.
* గడచినా జూన్ నెలలో బంగారం దిగుమతులు అంతకు ముందు ఏడాది ఇదే నెలతో పోల్చితే 12. శాతం పెరిగి 269 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి.
ఏం జరగవచ్చు...
* ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఫలితంగా మనదేశంలోనూ ధరలు పెరుగుతున్నాయి.
* తాజాగా దిగుమతి సుంకాన్ని పెంచితే ధరలు ఇంకా పెరుగుతాయి.
* పన్నుల భారాన్ని తగ్గించుకోవడానికి ఎక్కువ మంది వ్యాపారులు అనధికారిక మార్కెట్లో బంగారం కొనుగోళ్ళకు ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ఇది స్మగ్లింగ్ కు దారితీయవచ్చు.
* ఇప్పటికే చాలా మంది బంగారాన్ని విదేశాల నుంచి తెస్తూ పట్టుబడుతున్న ఉదంతాలను రోజు చూస్తున్నాం. ఇది రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశం ఉంది.
బంగారం వినియోగం తగ్గేనా
* ధరలు పెరిగితే బంగారం వినియోగం మరింత తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఫలితంగా బంగారం పరిశ్రమ పై ప్రతికూల ప్రభావం పడవచ్చు. బంగారం వ్యాపారాలు దెబ్బ తింటే ఆ రంగంలో ఉపాధి అవకాశాలపైనా దెబ్బ పడటానికి అవకాశం ఉంటుంది .
* వ్యాపార లావాదేవీలు తగ్గడం వల్ల పన్నుల రూపంలో ప్రభుత్వానికి వచ్చే రాబడులు తగ్గడానికి కూడా అవకాశాలు ఉన్నాయి.
* ఇప్పటికే వస్తుసేవల పన్ను తో పాటు నిర్ణీత పరిమితి దాటితే పాన్ ను వెల్లడించాలన్న నిభంధనతో బంగారం వ్యాపారం పై ప్రభావం పడుతోందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
* వీరు దిగుమతి సుంకాన్ని తగ్గించాలని కూడా డిమాండ్ చేశారు. కానీ వ్యాపారులు ఊహించని విధంగా దిగుమతి సుంకాన్ని పెంచడం వల్ల వారిలో ఆందోళన మరింత పెరుగుతోంది.