చైనా కంపెనీల దెబ్బ: శాంసంగ్ ఇండియాలో 1,000 మంది ఉద్యోగుల తొలగింపు!
న్యూఢిల్లీ: శాంసంగ్ ఇండియాలోని తన ఉద్యోగులకు షాకిచ్చేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ ఫోన్స్, టెలివిజన్స్ ఇప్పుడు బ్రాండ్స్ కంటే తక్కువ ధరకు లభిస్తున్నాయి. దీంతో కస్టమర్లు చైనా ఫోన్లు, టెలివిజన్ల వైపు దృష్టి సారిస్తున్నారు. దీంతో శాంసంగ్ వంటి పెద్ద కంపెనీలపై ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో భారత్లోని 1,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు శాంసంగ్ సిద్ధమైందని తెలుస్తోంది.
రైల్వే టిక్కెట్ దాదాపు ఉచితం!!: SBI కార్డుతో ఇలా చేయండి...
శాంసంగ్కు చైనీస్ కంపెనీ దెబ్బ
చైనీస్ స్మార్ట్ ఫోన్స్, టెలివిజన్స్ నుంచి ఈ కొరియన్ (శాంసంగ్) కంపెనీ గట్టి పోటీ ఎదుర్కొంటోంది. దీంతో కంపెనీ స్మార్ట్ఫోన్స్, టెలివిజన్ ధరలు తగ్గించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెబుతున్నారు. దీంతో మార్జిన్స్ తగ్గడం, లాభాలు తగ్గడం జరుగుతుందని, ఈ నేపథ్యంలో వెయ్యి మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైందని అంటున్నారు. చైనా కంపెనీతో పోటీ పడి నిలదొక్కుకోవాలంటే ధరలు తగ్గించాలని, అలా చేసి కంపెనీ నిలవాలంటే ఉద్యోగుల్ని తగ్గించాలని చెబుతున్నారు.
జాబ్ కట్ అందుకే
ఖర్చు హేతుబద్దీకరణలో భాగంగా జాబ్ కట్ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. శాంసంగ్ ఇప్పటికే టెలికం నెట్ వర్క్ డివిజన్లో 150 మంది ఉద్యోగులను తొలగించిందని, అక్టోబర్ నాటికి మరికొంతమంది ఉద్యోగులను తొలగిస్తుందని చెబుతున్నారు. శాంసంగ్ ఇండియా అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. భారత్లో తమ వ్యాపారాన్ని విస్తృతం చేస్తామని, ఇందుకోసం పెట్టుబడులు పెడుతూనే ఉంటామని చెప్పారు. ప్రపంచంలోని అతిపెద్ద మొబైల్ ఫోన్ ఫ్యాక్టరీ ఏర్పాటు, ఆర్ అండ్ డీలో పెట్టుబడులు, 5G నెట్ వర్క్ వంటి కొత్త వ్యాపారాల అన్వేషణకు ఉపయోగిస్తామన్నారు.
ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉన్నాం
కంపెనీ పెరిగేకొద్ది ఉద్యోగాల కల్పన కూడా జరుగుతుందని సదరు అధికార ప్రతినిధి అన్నారు. దీర్ఘకాలిక విజయానికి తాము కృషి చేస్తున్నామన్నారు. వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా శాంసంగ్ ఎప్పటికప్పుడు పునరేకీకరణ చేస్తుందని చెప్పారు. ఉద్యోగాల కల్పనకు శాంసంగ్ కట్టుబడి ఉందని, మరింతమందిని తీసుకుంటూనే ఉంటామన్నారు. శాంసంగ్ ఇండియాలో ప్రస్తుతం 20,000 మంది ఉద్యోగులు ఉన్నారని అంచనా. 2017-18లో శాంసంగ్ ఇండియా మొదటిసారి నెట్ ప్రాఫిట్ పడిపోయింది. 2018 ఆర్థిక సంవత్సరంలో 10.7 శాతం (రూ.3,712 కోట్లు) పడిపోయింది.
ఆన్లైన్ ఛాలెంజ్
షియోమీ, వన్ప్లస్ వంటి చైనా కంపెనీల జోరు గత కొన్నేళ్లుగా పెరుగుతోంది. ముఖ్యంగా ఈ కంపెనీలు ఆన్లైన్ ద్వారా తమ ఉత్పత్తులను ఎక్కువగా విక్రయిస్తోంది. ముఖ్యంగా 2016 నుంచి ఓ వైపు శాంసంగ్ స్మార్ట్ ఫోన్ సేల్ చతికులపడుతుండగా, చైనీస్ కంపెనీల గ్రోత్ వేగంగా పెరుగుతోంది. అలాగే, 2017 నుంచి శాంసంగ్ టెలివిజన్స్కు కూడా ఇదే పరిస్థితి ఎదురయింది. ఇండియాలో 40 శాతం స్మార్ట్ ఫోన్స్, 30 శాతం టెలివిజన్స్ అమ్మకాలు ఆన్లైన్ ద్వారా జరుగుతున్నాయి. చైనీస్ కంపెనీలను ఎదుర్కోవటానికి 2017 నుంచి శాంసంగ్ తమ టెలివిజన్ ధరలను 25-40 శాతం తగ్గించాయి. షియోమీ, వన్ప్లస్, వివో, టీసీఎల్, రియల్మి దెబ్బకు శాంసంగ్ ధరలు తగ్గించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటీవల లాంచ్ చేసిన ఫోన్ ధరలు కూడా తగ్గించింది.
ఆర్థికభారం తక్కువ
ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ పరంగా కూడా చైనీస్ కంపెనీల ఆర్థిక భారం తక్కువగానే ఉంది. ఉదాహరణకు షియోమీ ఇండియాలో కేవలం 900 నుంచి 1000 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. అదే శాంసంగ్ ఇండియాలో 20వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ నేపథ్యంలో శాంసంగ్ ఖర్చు హేతుబద్దీకరణపై కసరత్తు చేస్తోంది.