సర్వే: 59% మంది గ్రామీణులకు రుణ పథకాల గురించి తెలియదు
న్యూఢిల్లీ: గ్రామీణ భారతంలోని ప్రజల్లో దాదాపు 60 శాతం మందికి కేంద్ర ప్రభుత్వ రుణ పథకాలకు చేరడం లేదని ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది. 5న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఓ సర్వేలో షాకింగ్ వాస్తవాలు వెల్లడయ్యాయి. కేంద్ర ప్రభుత్వంలోని రుణ పథకాల గురించి 59 శాతం గ్రామీణులకు తెలియడం లేదు. ప్రతి ఐదుగురు రైతుల్లో ఒక రైతు వాతావరణ మార్పు వల్ల ఇబ్బందులుపడుతున్నారు.
రూరల్ మీడియా ప్లాట్ఫారం గావోన్ కనెక్షన్ సర్వే 18,000 మంది గ్రామీణులతో సర్వే నిర్వహించింది. ఉత్తర ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ సహా మొత్తం 19 రాష్ట్రాల్లో ఈ సర్వే నిర్వహించింది.
రుణ పథకాల గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల 59 శాతం మంది రైతులు లోన్ పొందలేకపోతున్నారని ఈ సర్వేలో తేలింది. 25 శాతం మంది రైతులు రూ.50,000 వరకు రుణాలు, 15 శాతం మంది రైతులు 5 లక్షల వరకు రుణాలు తీసుకున్నారు.
అధిక రుణాలు తమకు సవాల్గా మారాయని 13 శాతం మంది రైతులు చెబితే, విత్తనాల ధరలు, పెర్టిలైజర్స్ ధరలు, పెస్టిసైడ్ ధరలు ఎక్కువగా ఉన్నాయని, ఇలాంటి వాటి వల్ల పంటకు ఎక్కువ ఖర్చు అవుతోందని 17 శాతం మంది చెప్పారు. అలాగే, అకాల వర్షాలు, వర్షాలు పడకపోవడం వంటి పలు వాతావరణ అంశాల కారణంగా పంట నష్టపోతున్నామని 19 శాతం మంది చెప్పారు. నీటి పారుదల సమస్యను పరిష్కరిస్తే వ్యవసాయం సహా నీటి సమస్యలు ఉండవని 41 శాతం మంది అభిప్రాయపడ్డారు.
మరిన్ని షాకింగ్ అంశాలు కూడా వెలుగు చూశాయి. గ్రామాల్లో నివసించే వారిలో చాలామంది మహిళలు నీటి కోసం దాదాపు అర కిలోమీటర్ నడవాల్సి వస్తోందని ఈ సర్వేలో తేలింది. తమకు పైప్ లైన్ మంచి నీరు వస్తోందని కేవలం 8 శాతం మంది మాత్రమే చెప్పారు. తమకు పబ్లిక్ ట్యాప్స్ లేదా హ్యాండ్ పంప్స్ ద్వారా మంచి నీరు వస్తోందని 61 శాతం మంది చెప్పారు. డీజిల్ ధరలు పెరగడం ఇబ్బందికరంగా మారిందని 20 శాతం మంది చెప్పారు.
వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా వాడకం కోసం ఇంటర్నెట్ వినియోగిస్తున్నామని 38 శాతం మంది చెప్పగా, అన్ని రకాల సమాచారం తెలుసుకునేందుకు ఇంటర్నెట్ వినియోగిస్తున్నామని 30 శాతం మంది చెప్పారు. తమకు ఆండ్రాయిడ్ మొబైల్స్ లేవని 15 శాతం మంది చెప్పారు.
రైల్వే టిక్కెట్ దాదాపు ఉచితం!!: SBI కార్డుతో ఇలా చేయండి...