పైపైకి పసిడి .. రూ.40 వేలకు పరుగు ... ఇప్పుడే కొనేయాలా ?
హైదరాబాద్ : బంగారం ధర భగ్గుమంటోంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా వెలిగిపోతోంది. ఎవరూ ఊహించని విధంగా అతి కొద్దికాలంలోనే రూ.35 వేల మార్కును దాటి పరుగులు తీస్తోంది. ఈ జోరు చూస్తుంటే.. రూ.40 వేల మార్కుకు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనేది నిపుణుల మాట. మరి ఈ టైంలో బంగారాన్ని కొనుక్కోవాలా ? లేక ఆగాలా.. ? ఇదే ఇప్పుడు అందరి మదిలో ఉన్న మాట.
5 ఏళ్ల గరిష్టానికి ధర ?
బంగారం ధర గత నెల రోజుల్లోనే అనూహ్యంగా పెరిగింది. ఈ మధ్యకాలంలోనే ఎప్పుడూ లేని విధంగా పెరిగింది. మే నెలలో రూ.32500 పలికిన ధర ఏకంగా రూ.2500 పెరిగింది. నెల రోజుల్లోనే ఈ స్థాయిలో పెరగడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ ధర రూ.35వేల నుంచి 35 వేల 300 వరకూ పలుకుతోంది.
ఎందుకు పెరుగుతోంది ?
అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతోంది. రెండు దేశాలూ.. ఒకరిపై ఒకరు అధిక పన్నులు వేసుకుంటూ అంతర్జాతీయ వాణిజ్య సమాజాన్ని ఇబ్బందుల్లోకి నెడ్తున్నాయి. దీంతో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1250 డాలర్ల నుంచి 1400 డాలర్లకు పెరిగింది. ఈ నెల రోజుల్లోనే ఔన్స్ గోల్డ్ 125 డాలర్లు పెరిగింది. మరోవైపు అమెరికా - ఇరాన్ మధ్య కూడా వాతావరణం అంత సఖ్యతగా లేదు. అమెరికా డ్రోన్ను ఇరాన్ కూల్చివేయడం వంటివి మరింత టెన్షన్ పెట్టిస్తున్నాయి. ఇరాన్ మీదుగా విమానాలన్నింటినీ రద్దు చేసింది అమెరికా. వీటి ఎఫెక్ట్తో క్రూడాయిల్ ధరలు కూడా పెరిగాయి. ఇంకో కారణం ఏంటంటే.. గత ఐదారేళ్లుగా బంగారం ధరల్లో పెద్దగా వృద్ధి లేదు. వివిధ కారణాలతో రేట్లు అక్కడక్కడే ఉన్నాయి. ఏ కమాడిటీకైనా ఒక అప్ సైకిల్ ఒక డౌన్ సైకిల్ ఉంటుంది. ఇప్పుడు గోల్డ్కు డౌన్ సైకిల్ పూర్తై.. మళ్లీ అప్ ట్రెండ్లోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే రేట్లు పెరుగుతున్నాయి. గోల్డ్ రేట్లు పెరగడానికి మరో కారణం అంతర్జాతీయంగా వివిధ వాణిజ్య బ్యాంకులు బంగారాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తూ ఉండడం. ఇప్పుడు అమెరికా, యూరోప్ వంటి దేశాల్లో వడ్డీ రేట్లు దాదాపుగా సున్నా స్థాయిలో ఉన్నాయి. అంటే మనం ఇన్వెస్ట్ చేసినా రాబడి మాత్రం శూన్యం. ఇలాంటి తరుణంలో వివిధ బ్యాంకులు బంగారాన్నే నమ్ముుకుంటున్నాయి. తమ పెట్టుబడుల రిస్క్ తగ్గించుకునేందుకు హెడ్జింగ్ సూత్రాన్ని నమ్ముతాయి. అందుకే అలా పెట్టుబడులు గోల్డు వైపు వస్తున్నాయి.
రూ.50 వేలకు వెళ్లొచ్చా ?
ఇలా నాలుగైదు కారణాలు బంగారాన్ని ఎవరూ ఊహించని విధంగా పరుగులు పెట్టిస్తోంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో 1400 డాలర్లకు చేరిన ఔన్స్ గోల్డ్ మరో 200 డాలర్ల వరకూ పెరిగేందుకు ఆస్కారం ఉంది. 2011లో ఔన్స్ గోల్డ్ 1900 డాలర్ల వరకూ వెళ్లిన సంగతిని మనం మర్చిపోకూడదు. ఒక వేళ అదే పరిస్థితే వస్తే.. బంగారం పది గ్రాములు రూ.51 వేల వరకూ వెళ్లిన పెద్దగా సంభ్రమాశ్చర్యాలకు పోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ఒక్కసారిగా డిమాండ్ పెరిగిందంటే మాత్రం ఎవరూ అంత సులువుగా ఆపలేరు. ఇదో రేర్ కమాటిడీ కాబట్టి డిమాండ్కు తగ్గట్టు సప్లై లేకపోతే ఆటోమేటిక్గా రేట్ పెరిగిపోతుందనే సంగతిని గుర్తుంచుకోవాలి.
ఇప్పుడు కొనొచ్చా ?
ఇప్పుడున్న పరిస్థితులను అంచనా వేస్తుంటే బంగారాన్ని కొద్దోగొప్పో మన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో ఉంచుకోవడం శ్రేయస్కరమనే అనిపిస్తోంది. పర్సనల్ ఫైనాన్స్ నిపుణుల విశ్లేషణ ప్రకారం మనం పెట్టుబడి పెట్టే ప్రతీ రూ.100లో కనీసం రూ.5-10 మొత్తాన్ని బంగారానికి కేటాయించవచ్చు. అంతకు మించి అందులో పెట్టుబడి పెట్టడం రిస్క్తో కూడుకున్న వ్యవహారం. అయితే ఇప్పుడు ఈ గరిష్ట ధరలో ఎంత పెట్టుబడి పెట్టాలనే అనుమానం వస్తుంది. గత కొద్ది రోజుల నుంచి భారీగా రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి కొద్దో గొప్ప పతనం తప్పకపోవచ్చు. అప్పుడు మెల్లిగా మన పెట్టుబడులను పెట్టుకోవచ్చు. అయితే అతిగా ఆవేశపడి మాత్రం కొనుగోలు చేయొద్దు. ఇప్పటివరకూ రేట్లు రూ.35 నుంచి రూ.38 వేలకూ వెళ్లొచ్చు. ఊపు ఇలానే ఉంటే రూ.40వేలు దాటినే దాటొచ్చు.