అక్కడి నిరుద్యోగ యువతకు ప్రభుత్వ గుడ్న్యూస్, నెలకు రూ.3,500
ఇటీవలి కాలంలో ప్రభుత్వాలు నిరుద్యోగ భృతి పేరుతో కూడా ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోను ఆయా పార్టీలు ఎన్నికల్లో ఇటీవలి కాలంలో ఈ హామీలు ఇస్తున్నాయి. ఏపీలో తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు అండగా భృతిని కొనసాగిస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం దీనిని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పుడు అదే దారిలో రాజస్థాన్ కూడా నడుస్తోంది.
బడ్జెట్ 2019: ఆదాయపన్నుపై రివిజన్ ఉండేనా?
యువతకు రూ.3,500
నిరుద్యోగ భృతి విషయంలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉపాధి అవకాశాల లేక ఇబ్బందులు పడుతున్న యువతకు నెలకు రూ.3,500 భృతి అందించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి యువ సంబల్ యోజన కింద ఈ సాయం అందనుంది. నిరుద్యోగ భృతి పొందాలంటే రాజస్థాన్ యువత అయి ఉండాలి. గ్రాడ్యుయేషన్ లేదా సమానమైన డిగ్రీ చదివి ఉండాలి.
ఎవరికి ఎంత భృతి అంటే?
నిరుద్యోగ భృతి పథకం కింద యువకులకు రూ.3,000, యువతులు, దివ్యాంగులకు రూ.3,500 ఇవ్వాలని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నగదును వారికి రెండు సంవత్సరాల పాటు లేదా ఉద్యోగం వచ్చే వరకు అందించే అవకాశముంది. గతంలో ఇది అక్షత్ యోజనగా ఉంది. ఈ పేరు మార్చారు.
నిరుద్యోగ రేటులో రాజస్థాన్ ఎక్కడంటే..
నిరుద్యోగ భృతిని పలు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలలో అధ్యయనం చేసి తమ రాష్ట్రాల్లో దీనిని ఆచరిస్తున్నాయి. నిరుద్యోగ భృతికి గ్రాడ్యుయేషన్ లేదా సమానమైన డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 18 ఏళ్ల వయస్సు నిండి ఉండాలి. 2015-16లో నిరుద్యోగం అంశంలో రాజస్థాన్ 19వ స్థానంలో ఉంది. గుజరాత్లో తక్కువ అన్ఎంప్లాయిమెంట్ ఉంటే, త్రిపురలో అన్ని రాష్ట్రాల్లో కంటే ఎక్కువగా ఉంది.