జెట్ ఎయిర్వేస్ దివాలా ! కుప్పకూలిన స్టాక్
జెట్ ఎయిర్ వేస్ పని దాదాపుగా అయిపోయింది. ఇక రేపో మాపో అధికారిక ప్రకటన లాంఛనమే కానీ జెట్ ఎయిర్ క్రాష్ ల్యాండ్ అయినట్టే అనుకోవాలి. ఇక చరిత్రలో కలిసిపోబోతున్న మరో ఎయిర్ లైన్గా ఉండబోతోంది జెట్ ఎయిర్. ఈ రోజు స్టాక్ ఏకంగా 55 శాతం పతనం కావడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వారం రోజుల్లో కూడా స్టాక్ సుమారు 75 శాతానికి పైగా పతనమైంది. సరిగ్గా ఈ ఏడాది ప్రారంభంలో సుమారు రూ.10 వేల కోట్లుగా ఉన్న జెట్ ఎయిర్వేస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇప్పుడు కేవలం రూ.400 కోట్లకు దిగొచ్చింది.
ఏం జరిగింది
రూ.650 కోట్ల పన్ను ఎగవేత: జెట్ ఎయిర్వేస్ నరేష్ గోయల్కు షాక్
జెట్ ఎయిర్వేస్ అప్పుల్లో కూరుకుపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. భారీగా బకాయి పడి అసలు, వడ్డీ కూడా కట్టలేని స్థితికి దిగజారిపోయిన కంపెనీ నుంచి ఎంతో కొంత రాబట్టుకోవాలని రుణదాతలు చేసిన ప్రయత్నాలన్నీ పూర్తిగా విఫలమయ్యాయి. దీంతో జెట్ ఎయిర్వేస్ దివాలా తీసిందని అధికారికంగా ధృవీకరించి ఎంతో కొంత రాబట్టుకోవాలని ప్రధాన రుణదాత ఎస్బీఐ ముందడుగు వేసింది. ముంబై జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ను (ఎన్.సి.ఎల్.టి) ఆశ్రయించింది. ఇలా చేస్తే అయినా మిగిలిన ఆస్తులను ఏవైనా ఉంటే అమ్ముకుని బయటపడొచ్చని ఎస్బీఐ సహా మిగిలిన బ్యాంకులన్నీ ఆలోచిస్తున్నాయి. ఎందుకంటే జెట్ ఎయిర్ ఆపరేషన్స్ అన్నీ ఆగిపోయి సరిగ్గా రెండు నెలలు కాబోతోంది. తక్షణం రూ.1200 కోట్లు వస్తే తప్ప ఎయిర్ లైన్ నడపడం సాధ్యం కాదని అప్పట్లో సంస్థ చేతులెత్తేసింది. ఎంతో మంది ఇన్వెస్టర్లు కూడా వివిధ ప్రయత్నాలు చేసి ఆగిపోయారు. ఎతిహాద్, టాటా సన్స్ సహా మరికొన్ని విదేశీ సంస్థలు మొదట్లో ఉత్సాహం చూపినా ఆ తర్వాత వెనక్కి తగ్గారు. దీంతో జెట్ ఎయిర్ వేస్ పని ఇంక అయిపోయింది.
ఏ బ్యాంకుకు ఎంత బకాయి
జెట్ ఎయిర్వేస్ షేర్ ఈ ఏడాది ప్రారంభంలో రూ.250 దగ్గర ట్రేడవుతూ వచ్చింది. అప్పటో సంస్థ మార్కెట్ క్యాప్ సుమారు రూ.10 వేల కోట్ల వరకూ ఉండేది. అలాంటిది ఇప్పుడు సదరు షేర్ ధర రూ.35కి దిగొచ్చింది. గత వారం రోజుల్లోనే స్టాక్ సుమారు 75 శాతం వరకూ పడిపోయింది. ఈ ఏడాదిలో 85 శాతం వరకూ స్టాక్ ధర కుప్పకూలిపోయింది. దీంతో ఇన్వెస్టర్లు కూడా ఏం చేయాలో అర్థంకాక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇక బ్యాంకుల విషయానికి వస్తే.. జెట్ ఎయిర్ సంస్థ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు కలిపి సుమారు రూ.11260 కోట్లు బకాయి పడింది. వాటిల్లో సుమారు రూ.7251 కోట్ల వరకూ మన దేశీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు చెల్లించాల్సి ఉంది. ఒక్క ఎస్బీఐకే సుమారు రూ.1958 కోట్ల వరకూ చెల్లించాల్సిన ఉంది జెట్ ఎయిర్. పంజాబ్ నేషనల్ బ్యాంక్కు రూ.1746 కోట్లు, ఐసిఐసిఐ బ్యాంక్కు రూ.545 కోట్లు, యెస్ బ్యాంక్కు రూ.869 కోట్లు, ఐడిబిఐకి రూ.752 కోట్లు, కెనెరా బ్యాంక్కు రూ.718 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.266 కోట్లు చెల్లించాల్సి ఉంది జెట్ ఎయిర్.
మళ్లీ ఎగుర్తుందా
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఇంత కష్టాల్లో, ఇంతగా అప్పుల్లో కూరుకుపోయిన కంపెనీని కొనుగోలు చేసి నిర్వహించడం కత్తిమీద సాములాంటిదే. వివిధ బ్యాంకులు, ఆర్థికసంస్థలన్నీ తమ బకాయిల్లో 80 శాతాన్ని వదులుకుంటే ఆలోచిస్తామని ఎతిహాద్ లాంటి సంస్థలు చెబ్తున్నాయి. అంటే మనదేశీయ బ్యాంకులు తాము అప్పు ఇచ్చిన సుమారు 8 వేల కోట్లలో రూ.6500 కోట్లు వదులుకోవాల్సి రావొచ్చు. ప్రధానంగా ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి వాటికి గట్టిదెబ్బే పడొచ్చు. ఒక వేళ ట్రైబ్యునల్కు వెళ్లినా పెద్దగా బ్యాంకులకు ఒనగూరే ప్రయోజనం ఉండకపోవచ్చేమోనని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన జెట్ ఎయిర్వేస్ మళ్లీ గాల్లో తేలడం అసంభమని చెప్పలేం కానీ అతికష్టమని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.