అమెరికాపై భారత్ అధిక టారిఫ్లు ఎందుకు?
న్యూఢిల్లీ: అమెరికా వస్తువులపై భారత్ అధిక టారిఫ్లు విధిస్తోందని నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న డొనాల్డ్ ట్రంప్కు ఇండియా షాకిచ్చింది. ఈ మేరకు 29 అమెరికాకు చెందిన ఉత్పత్తులపై అదనపు కస్టమ్స్ సుంకాన్ని విధించబోతున్నట్లు భారత్ ప్రకటించింది. ఇటీవల భారత్ను జనరలైజ్డ్ సిస్టమ్ ఆప్ ప్రిఫరెన్స్( GPS) జాబితా నుంచి అమెరికా తొలగించింది. ఇది ఇండియాకు మరింత ఆగ్రహం తెప్పించింది. దీంతో దెబ్బకు దెబ్బగా ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా అమెరికా నుంచి దిగుమతి అయ్యే బాదాం, పప్పుధాన్యాలు, వాల్నట్, యాపిల్స్ తదితర ఉత్పత్తులపై టారిఫ్ పెరగనుంది. దీంతో ఈ వీటి ధరలు ప్రియం కానున్నాయి. ఇవి ఆదివారమే అమలులోకి వస్తున్నాయి.
దెబ్బకు దెబ్బ .. అమెరికా వస్తువులపై ట్యాక్స్ ... రేపటినుంచి
భారత్కు చెందిన స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై ట్రంప్ సర్కార్ విధించిన పన్నులకు ప్రతీకారంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా పై అమెరికా ఉత్పత్తులపై పన్ను విధించాలని భావించినప్పటికీ గత ఏడాదిగా వాయిదా పడుతూ వస్తోంది. గత ఏడాది జూన్ 21నే ఈ నిర్ణయం తీసుకున్నా... వాయిదా పడింది. గత ఏడాది మార్చిలో మన స్టీల్ పైన 25 శాతం, అల్యూమినియం పైన 10 శాతం చొప్పున దిగుమతి సుంకం విధించింది అమెరికా ప్రభుత్వం. భారత్ అధిక టారిఫ్ కారణంగా వాల్నట్పై 30 శాతం నుంచి 120 శాతానికి, పప్పులపై 30 శాతం నుంచి 70 శాతానికి పన్ను పెరగనుంది. కాయాధాన్యాలపై విధించే పన్నును 40 శాతానికి పెంచింది. బోరిక్ యాసిడ్, బైండర్లపై పన్నును 7.5 శాతానికి పెంచింది. ఒక రకమైన రొయ్యలపై పన్నును 15 శాతం చేసింది. గింజలు, ఇనుము, స్టీల్ ఉత్పత్తులు, యాపిల్, బేర్స్, స్టెయిన్లెస్ స్టీల్, ట్యూబ్, పైప్ ఫిట్టింగ్, మరలు, బోల్డులపై కూడా పన్ను విధించింది.
ఈ పెంపుతో భారత్కు 217 మిలియన్ డాలర్ల ఆదాయం అధికంగా సమకూరుతుంది. అమెరికా ప్రభుత్వం చర్యతో భారత్కు 240 మిలియన్ కోట్ల డాలర్ల మేర నష్టం జరిగింది. దీంతో అమెరికా నుంచి దిగుమతి అవుతున్న 5.5 బిలియన్ డాలర్ల విలువైన 29 రకాల ఉత్పత్తులపై టారిఫ్ విధిస్తోంది.
అమెరికా అల్మోండ్స్ కొనుగోలులో భారత్ ముందుంది. 2018లో అగ్రదేశం యొక్క దాదాపు సగానికి పైగా అల్మోండ్స్ను భారత్ దిగుమతి చేసుకుంది. వీటి విలువ రూ.543 మిలియన్ డాలర్లు. గత ఏడాది 156 మిలియన్ డాలర్ల అమెరికన్ యాపిల్స్ కొనుగోలు చేసింది.
గత దశాబ్దకాలంగా భారత్-అమెరికా మధ్య వాణిజ్యం వేగంగా పెరుగుతోంది. 2018లో 142.1 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగింది. ఇరు దేశాల మధ్య మంచి వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. కానీ గత కొద్దికాలంగా హై టారిఫ్ కంట్రీ అంటూ ట్రంప్... ఇండియాపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.