11 ఏళ్లలో బ్యాంక్ మోసాలు రూ.2 లక్షల కోట్లు: టాప్లో ICICI, HDFC, PNB, SBI
గత పదకొండు ఏళ్లలో 50వేలకు పైగా జరిగిన మోసాల్లో బ్యాంకులు రూ.2.05 లక్షల కోట్ల మేర నష్టపోయాయి. సమాచార హక్కు చట్టం కింద దాఖలు చేసిన పిటిషన్కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇచ్చిన డాటా ఇది. అధికంగా కేసులు నమోదైన బ్యాంకుగా ప్రయివేటు రంగ ఐసీఐసీఐ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ప్రభుత్వ రంగ ఎస్బీఐ, ప్రయివేటు రంగ హెచ్డీఎఫ్సీ ఉన్నాయి
ఐసీఐసీఐ నష్టం
2008-09 ఆర్థిక సంవత్సరం నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరం మధ్య మొత్తం 53,334 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో అధికంగా అంటే 6,811 కేసులకు గాను ఐసీఐసీఐ రూ.5,033 కోట్లు నష్టపోయింది. ఆ తర్వాత ఎస్బీఐ 6,793 కేసులకు గాను రూ.23,734.74 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2,497 కేసులకు గాను రూ.1,200.79 కోట్లు నష్టపోయింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు మోసపు ఘటనలు 2,047 కేసులకు గాను రూ.28,700 కోట్లు నష్టపోయింది. ఇందులో వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ ఒక్కడే రూ.13,000 కోట్ల మేర మోసానికి పాల్పడ్డాడు.
కేసులు తక్కువున్నా కోల్పోయింది ఎక్కువే
మోసపోయిన బ్యాంకుల్లో ఐసీఐసీఐ 6,811 కేసులతో ముందు ఉంది. కానీ నష్టాలపరంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు ముందు ఉంది. ఈ బ్యంకు కేసులు 2,047 కాగా, నష్టాలు మాత్రం రూ.28,700.74 కోట్లు. ఎస్బీఐ గత పదకొండు ఏళ్లలో 6,793 కేసులతో రూ.23,734.74 కోట్లను కోల్పోయింది. కేసుల పరంగా రెండో స్థానంలో ఉంది. హెచ్డీఎఫ్సీ 2,497 కేసులతో రూ.1,200.79 కోట్లతో మూడో స్థానంలో ఉంది. దేశీయ బ్యాంకులతో పాటు పలు విదేశీ బ్యాంకులు కూడా మోసపోయిన జాబితాలో ఉన్నాయి. ఈ నెల 3న పీటీఐకి ఈ సమాచారం అందింది.
ఆయా బ్యాంకుల కేసులు... నష్టాలు
బ్యాంక్ ఆఫ్ బరోడా కేసులు 2,160 కాగా, కోల్పోయింది రూ.12,962.96, యాక్సిస్ బ్యాంక్ కేసులు 1,944, కోల్పోయింది రూ.5,301.69, బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసులు 1,872, రూ.12,358.2 కోట్లు, సిండికేట్ బ్యాంక్ కేసులు 1,783, కోల్పోయింది రూ.5,830.85 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసులు 1,613, కోల్పోయింది రూ.9,041.98 కోట్లు, డీబీఐ బ్యాంక్ కేసులు 1,264, కోల్పోయింది రూ.5,978.96 కోట్లు, స్టాండర్ట్ ఛార్టర్డ్ బ్యాంక్ కేసులు 1,263, కోల్పోయింది రూ.1,221.41 కోట్లు, కెనరా బ్యాంక్ కేసులు 1,254, కోల్పోయింది రూ.5,553.38 కోట్లు, యూనియన్ బ్యాంక్ కేసులు 1,244, కోల్పోయింది రూ.11,830.74 కోట్లు, కోటక్ మహీంద్ర బ్యాంక్ కేసులు 1,213, కోల్పోయింది రూ.430.46 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కేసులు 1,115, కోల్పోయింది రూ.12,644.70 కోట్లు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కేసులు 1,040, కోల్పోయింది రూ.5,598.23 కోట్లు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసులు 944, కోల్పోయింది రూ.3,052.34 కోట్లు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ కేసులు 395, కోల్పోయింది రూ.742.31 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా కేసులు 386, కోల్పోయింది రూ.1,178.77 కోట్లు, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ కేసులు 276, కోల్పోయింది రూ.1154.89 కోట్లు, యూకో బ్యాంక్ కేసులు 1081, కోల్పోయింది రూ.7,104.77 కోట్లు, లక్ష్మీ విలాస్ బ్యాంక్ కేసులు 259, కోల్పోయింది రూ.862.64 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ కేసులు 274, కోల్పోయింది రూ.694.61 కోట్లు. ధనలక్ష్మి బ్యాంక్ కేసులు 89, కోల్పోయింది రూ.410.93 కోట్లు. విజయా బ్యాంక్ కేసులు 639, కోల్పోయింది రూ.1,748.90 కోట్లు. యస్ బ్యాంక్ కేసులు 102, కోల్పోయింది రూ.311.96 కోట్లు. ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్ 1,264 కేసులతో రూ.5,978.96 కోట్లు కోల్పోయింది. మరికొన్ని ఇతర బ్యాంకులు కూడా ఉన్నాయి.
నష్టపోయింది ప్రభుత్వరంగ బ్యాంకులో ఎక్కువ
మోసాల కారణంగా నష్టపోయిన బ్యాంకుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని మొత్తమే ఎక్కువగా ఉంది. ఇందులో ఐదు బ్యాంకుల వాటా రూ.90వేల కోట్లకు పైగా ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB), బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) వాటా రూ.90,401.34 కోట్లుగా ఉంది. మొత్తంగా ప్రయివేటు రంగ బ్యాంకుల కంటే ప్రభుత్వ రంగ బ్యాంకులే ఎక్కువగా మోసపోయాయి. గత ఆర్థిక సంవత్సరం (2018-19) లోనే బ్యాంకుల ద్వారా అత్యధిక మోసాలు ప్రకటించబడ్డాయని ఆర్బీఐ తెలిపింది. మోసాల విలువ కూడా ఇదే ఏడాది ఎక్కువగా ఉంది. రూ.71,542.93 కోట్ల నష్టం బ్యాంకులకు వాటిల్లింది.