జియో టవర్స్ పెంపు, అప్పులు తగ్గింపు ! అంబానీ మాస్టర్ ప్లాన్
రిలయన్స్ జియో.. ఇప్పుడు దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మొబైల్ నెట్వర్క్. నెలనెలా అత్యధిక వృద్ధిని సాధిస్తూ వస్తున్న ఈ నెట్వర్క్ నెత్తిన సుమారు రూ.2 లక్షల కోట్ల అప్పు ఉన్న సంగతి చాలాకొద్దిమందికి మాత్రమే తెలుసు. భారీగా రుణాలు తీసుకుని ఈ స్థాయిలో వ్యవస్థను నిర్మించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ... ఇప్పుడు రుణభారాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నారు. ఇందుకోసం జియో టవర్స్ను టార్గెట్ చేసి ఓ అద్భుత బిజినెస్ మోడల్ను తీసుకురాబోతున్నారు.
ఎయిర్టెల్కు జియో భారీ 'రెవెన్యూ' దెబ్బ
జియోకు టవర్లే ప్రాణం
ఇప్పుడు రిలయన్స్ జియో తన నెట్వర్క్ కోసం సుమారు 1.7 లక్షల టవర్లను నిర్మించింది. వీటన్నింటి విలువ సుమారు రూ.36 వేల కోట్లు ఉంటుందని ఓ అంచనా. మరికొంత విస్తరణ పూర్తైన తర్వాత దీన్ని విలువ సుమారు 7 బిలియన్ డాలర్లకు (రూ.49 వేల కోట్లు) పెరుగుతుందని ఈ అంశంపై అవగాహన ఉన్న కొంత మంది ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు
దేశంలో అత్యధిక టవర్లు కలిగిన జియో తర్వాత భారతి ఇన్ఫ్రాటెల్, ఇండస్ సంస్థలున్నాయి. వీటి దగ్గర సుమారు 163000 టవర్లు ఉన్నాయి. ఈ బిజినెస్లోకి అడుగుపెట్టిన తర్వాత రిలయన్స్ కమ్యూనికేషన్స్కు చెందిన సుమారు 45 వేల టవర్లను కొనుగోలు చేయడం వల్ల ఈ రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందేందుకు జియోకు అవకాశం దొరికింది. అయితే ఈ టవర్ నెట్వర్క్ను 1.7 లక్షల నుంచి ఈ ఏడాదిలోగా 2.6 లక్షలకు పెంచాలని చూస్తున్నారు ముకేష్ అంబానీ. దీన్ని బట్టి చూస్తే మరింతగా నెట్వర్క్ విస్తరింపజేయడంతో పాటు కస్టమర్ బేస్పై కూడా ఫుల్గా టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది.
విదేశీ సంస్థల ఆసమ్మతి
ఇంతటి నెట్వర్క్ ఉన్న జియోపై విదేశీ సంస్థల కన్ను పడింది. బ్రూక్ ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థతో కలిసి రిలయన్స్ అతి త్వరలోనే ఓ డీల్ కుదుర్చుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీని వల్ల జియో నెత్తిన ఉన్న అప్పు సగానికి పైగా తగ్గుతుందని భావిస్తున్నారు.
జియో టవర్స్ వ్యాపారాన్ని ప్రత్యేక సంస్థగా విడదీసి వేల్యుయేషన్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో బ్రూక్ ఫీల్డ్ వంటి సంస్థలతో పాటు స్వయంగా ముకేష్ అంబానీ కూడా వ్యక్తిగతంగా పెట్టుబడులు పెట్టేందుకు చూస్తున్నట్టు సమాచారం. ఆ తర్వాత దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ మాదిరి మార్చి లిస్ట్ చేయాలనేది రిలయన్స్ జియో ఫైనల్ ప్లాన్.
ఫైబర్ నెట్వర్క్కు కూడా...
రిలయన్స్ జియోకు సుమారు 70 వేల కిలోమీటర్ల ఫైబర్ నెట్వర్క్ కూడా ఉంది. దీన్ని కూడా అమ్మకానికి పెట్టబోతున్నారు. ఇందుకు సంబంధించి గ్లోబల్ పెన్షన్ ఫండ్స్, ఇన్ఫ్రా ఫోకస్డ్ ఫండ్స్తో చర్చలు జరుపుతున్నారు. ఇలా ఈ ప్రయత్నాలన్నీ ఈ ఏడాది ఆగస్టులోగా పూర్తి చేసి అప్పుల భారాన్ని తగ్గించుకున్న టవర్స్ బిజినెస్ ద్వారా ఆదాయాన్ని కూడా పొందాలనేది జియో ప్లాన్.