ఇక ఇంటింటికీ రిలయన్స్ గ్యాస్ ! లైన్ క్లియర్ అయితే...
పెట్రోల్, డీజిల్, బట్టలు, చెప్పులు, బంగారం, కెమికల్స్, గార్మెంట్స్, మొబైల్, ఇంటర్నెట్... ఇలా వివిధ రంగాల్లో తన సత్తా చాటిన దేశ అతిపెద్ద పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు ఇంటింటికీ ఎల్పీజీ గ్యాస్ ఇచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సబ్సిడీ గ్యాస్ను ఇంటింటికీ నేరుగా పైపుల ద్వారా ప్రైవేట్ కంపెనీలు ఇచ్చే అంశాన్ని కేంద్రానికి నిపుణుల బృందం పరిశీలిస్తోంది. వీళ్లు దీనికి ఓకె అంటే తక్షణం రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలకు భారీగా ప్రయోజనం దక్కబోతోంది.
ప్రైవేటుకూ అవకాశం ఇవ్వాలా
రిలయన్స్ ఇండస్ట్రీస్కు జామ్నగర్లో అతిపెద్ద రిఫైనరీ ఉంది. దేశంలో అత్యధిక ఎల్పీజీని ఉత్పత్తి చేస్తున్న సంస్థల్లో మొట్టమొదటి స్థానంలో ఉంది రిలయన్స్. అయితే తాము కూడా ప్రభుత్వ సంస్థలతో పోటీపడి సబ్సిడీ సిలిండర్లను లేదా పైప్డ్ గ్యాస్ను సరఫరా చేస్తామని పట్టుబడ్తూ వస్తోంది.
అయితే ప్రస్తుతం ఉన్న పద్ధతి ప్రకారం ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు కొనుగోలుదార్ల నుంచి మార్కెట్ ధరకు గ్యాస్ను సరఫరా చేస్తున్నాయి. ఆ తర్వాత సబ్సిడీ మొత్తాన్ని కేంద్రం బ్యాంకుల ద్వారా నేరగా లబ్ధిదారుడికి ఇస్తోంది. అయితే ఇది ఇంతవరకూ ప్రైవేట్ కంపెనీలకు లేదు. కేవలం ప్రభుత్వ సంస్థలే ఈ సబ్సిడీ గ్యాస్ను సరఫరా చేస్తూ వస్తున్నాయి.
కేంద్ర కమిటీ
సబ్సిడీ గ్యాస్ సరఫరా కేవలం ప్రభుత్వ సంస్థలకే పరిమితం చేయకుండా ప్రైవేట్ కంపెనీలకు కూడా ఇచ్చే అంశాన్ని పరిశీలించేందుకు ఆర్థికవేత్త కిరీట్ పారిఖ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది చమురు మంత్రిత్వ శాఖ. ఇందులో పెట్రోలియం శాఖ మాజీ కార్యదర్శి జిసి చతుర్వేది, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఎం ఏ పఠాన్, ఐఐఎం అహ్మదాబాద్ డైరెక్టర్ ఎర్రోల్ డిసౌజాతో పాటు పెట్రోలియం శాఖ అదనపు కార్యదర్శి ఈ బృందంలో ఉంటారు. వీళ్లు జూలై ఆఖరి కల్లా రిపోర్టును కేంద్రానికి అందజేయాల్సి ఉంటుంది.
ఈ మధ్యే కొత్త పెట్రోల్ బంకుల ఏర్పాటు విషయంలో కొన్ని సలహాలను, విధాన నిర్ణయాలను మార్పును సూచించిన నిపుణుల బృందం, రిటైల్ లైసెన్సు పొందేందుకు రూ.2000 కోట్లు చెల్లించే నిబంధనను కూడా మార్చాలని చెబ్తోంది.
రిలయన్స్కు దూకుడెక్కువ
దేశంలో ఎల్పీజీని మార్కెట్ చేసేందుకు ప్రైవేట్ సంస్థలకు అనుమతులు ఇవ్వాలా వద్దా అనే అంశంపై నిపుణుల బృందం విశ్లేషించబోతోంది. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే గ్యాస్ను సరఫరా చేస్తోంది. సుమారు 10 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు 2.65 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. ప్రపంచ ఎల్పీజీ వినియోగంలో భారత్ రెండో స్థానంలో ఉంది. మన దగ్గర గతేడాది 2.49 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని వినియోగిస్తున్నాం. ఈ గణాంకాలతో పోలిస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు సరఫరా చేస్తున్న వాటా చాలా చాలా చిన్నది. అయితే అది కూడా సబ్సిడీ లేకుండా సరఫరాలు కొనసాగిస్తోంది. అందుకే దీన్నో పెద్ద మార్కెట్గా గుర్తించిన రిలయన్స్ .. ఎల్పీజీపై దృష్టిపెట్టింది.