పీర్ 2 పీర్ లెండింగ్ తో అధిక రాబడులు మీ సొంతం..
పీర్ 2 పీర్ లెండింగ్ (పీ 2 పీ ) గత కొంత కాలంగా మన దేశంలో ఇది ఎక్కువ ఆదరణ పొందుతోంది. దీని ద్వారా రుణదాతలు అధిక రాబడులు పొందే అవకాశం ఉన్నందువల్ల ఎక్కువ మంది ఇన్వెస్టర్లు దీనికి ప్రాధాన్యం ఇస్తున్నారు. రుణం కావాల్సిన వారు కూడా తక్కువ వడ్డీ రేట్లకు రుణం పొందే అవకాశం లభిస్తోంది. ఆన్ లైన్ వేదిక ద్వారా ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న సొమ్మును మరొకరికి రుణంగా ఇచ్చి ఎక్కువ వడ్డీని పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా బ్యాంకుల్లో డిపాజిట్లు, ఇతర పెట్టుబడులకన్నా దీని ద్వారా కొంత ఎక్కువ రాబడులను పొందడానికి అవకాశం ఉంటోంది. అసలు ఈ పీర్ 2 పీర్ లెండింగ్ ఎలా ఉంటుంది. ఎలా దీని ద్వారా రాబడులు ఎలా పొందవచ్చో చూద్దాం.
ఆన్ లైన్ ప్లాటుఫామ్
పీ 2 పీ లెండింగ్ కోసం కొన్ని థర్డ్ పార్టీ వెబ్ సైట్లు అందుబాటులోకి వచ్చాయి. startups కూడా ఈ వ్యాపారం చేస్తున్నాయి. వీటి ద్వారా మీరు మీ సొమ్మును మరొకరికి రుణంగా ఇవ్వవచ్చు. పీ 2 పీ సంస్థలు ఆర్బీ ఐ నుంచి ఎన్ బీ ఎఫ్ సి -పీ2పీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ను పొంది ఉంటాయి. కాబట్టి పెట్టుబడుల విషయంలో సంశయం అవసరం ఉండదు. ఇప్పటివరకు దాదాపు 12కు పైగా సంస్థలకు ఆర్ బీ ఐ నుంచి అనుమతి లభించింది. ఈ ప్లాటుఫామ్ లో నమోదు కావడం ద్వారా మీరు రుణదాతలుగా మారవచ్చు. మీరిచ్చే సొమ్మును నెలవారీ వాయిదాల్లో మీకు అందుతుంది. దీన్ని మీరు మరొకరికి ఇవ్వడం ద్వారా మరింత రాబడిని పొందవచ్చు.
ఎంపిక మీదే
మీరు నమోదు చేసుకున్న ప్లాటుఫామ్ లో రుణం కావాల్సిన వారు కూడా నమోదు చేసుకుని ఉంటారు. వారి ప్రొఫైల్స్, క్రెడిట్ స్కోర్, అవసరాలు, రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యం తదితర సమాచారం ఆధారంగా మీరు రుణ గ్రహీతను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ సమాచారం అంత మీకు అందుబాటులో ఉంటుంది. కొంత కొంత సొమ్మును ఎక్కువ మంది రుణ గ్రహీతలకు ఇవ్వవచ్చు. మీరు గరిష్టంగా 30 శాతం వరకు రిటర్న్ పొందవచ్చు. అయితే ఇది మీ రిస్క్ ను బట్టి ఉంటుంది. మీరిచ్చే రుణాలు ఎలాంటి తనఖా లేకుండా ఉంటాయి. అంటే అన్ సెక్యూర్డ్ అన్న మాట.
భరోసా ఎలా?
రుణం తీసుకోవాలనుకునే వారి గురించి నేరుగా వచ్చి సంస్థ సిబ్బంది తెలుసుకుంటారు. రుణానికి హామీగా ప్రామిసరీ నోట్ రాయించుకుంటారు. చెక్కులు తీసుకుంటారు. కాబట్టి మీరు ఇచ్చే రుణానికి భరోసా ఉంటుంది.
మీరు ఇన్వెస్టర్ గా మారాలంటే..
మీరు కూడా పీర్2పీర్ ఇన్వెస్టరుగా మారాలంటే కింది అర్హతలు కలిగి ఉండాలి.
- భారత దేశ నివాసి అయి ఉండాలి
- వయసు 21 దాటాలి
- బ్యాంక్ ఖాతా తప్పనిసరి (కాన్సల్ చేసిన చెక్)
- పాన్, ఆధార్ కార్డు ఉండాలి
- రుణం ఇవ్వాలనుకుంటే మీరు ముందుగా సంబంధిత ప్లాటుఫామ్ లో ఇన్వెస్టర్ ఖాతాను ప్రారంభించాలి
- సెల్ఫ్ అటెస్టేడ్ డాక్యూమెంట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి
- వన్ టైం రిజిస్ట్రేషన్ కింద కొంత సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది.
- రిజిట్రేషన్ తర్వాత మీకు ఒక వ్యాలెట్ అకౌంట్ ఏర్పాటు అవుతుంది.
- దాన్ని ఆక్టివేట్ చేసుకోవాలి
- రూ. 5,000 నుంచి రూ. 10 లక్షల వరకు మీరు పెట్టుబడి పెట్టవచ్చు.
పీర్ 2 పీర్ లెండింగ్ సంస్థలు
- RupeeCircle
-IndiaMoneyMart
- Faircent
- Paisadukaan
- Finzy
- OMLP2P
- i2i funding
ప్రపంచ వ్యాప్తంగా భారీగా వ్యాపారం
ప్రపంచ వ్యాప్తంగా పీ2పీ రుణవితరణ వ్యాపారం జోరుగా పెరుగుతుంది. 2013 సంవత్సరంలో ఈ పరిశ్రమ విలువ 350 కోట్ల డాలర్లు ఉండగా 2015 నాటికీ 640 కోట్ల డాలర్లకు పెరిగింది. 2050నాటికీ ఇది లక్ష కోట్ల డాలర్లకు చేరుకుంటుందని అంచనా. 2023 నాటికీ భారత్ లో పీ 2 పీ రుణ వితరణ మార్కెట్ పరిమాణం 400-500 కోట్ల డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.