2018-19 లో రూ.1.2 లక్షల కోట్ల మొండి పద్దుల వసూలు చేసిన ప్రభుత్వ రంగ బ్యాంకులు
బ్యాంకుల నుండి లోన్లు తీసుకుని లోన్లు కట్టకుండా ఇబ్బంది పెట్టే మొండి పద్దుల వసూళ్ళకు నడుం బిగించాయి ప్రభుత్వ రంగ బ్యాంకులు. గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో రూ.1.2 లక్షల కోట్ల మొండి పద్దులను రికవరీ చేసుకున్నట్లు తెలిపాయి . దివాలా స్మృతి చట్టం (ఐబీసీ) ద్వారా ప్రధానంగా ఈ మొండి బకాయిల (ఎన్పీఏ)ను రాబట్టుకోగలిగినట్లు ఓ ఉన్నతాధికారి చెప్పారు. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో ఉన్న కొన్ని పెద్ద దివాలా కేసులు పరిష్కారం కాకపోవటంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్ధేశిత రూ.1.80 లక్షల కోట్ల రికవరీ లక్ష్యాన్ని అందుకోలేకపోయాయన్నారు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ఖాతాలన్నీ పరిష్కారంకావచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులు కన్సాలిడేషన్ దిశగా సాగుతుండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రికవరీలు గరిష్ఠ స్థాయిలో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. మరోవైపు ఎన్బీఎఫ్సీ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు.
2019 ఎన్నికలలో ట్విట్టర్ ను తెగ వాడేశారుగా .. ఎంతగా అంటే
2017-18లో బ్యాంకులు రూ.74,562 కోట్ల ఎన్పీఎలను రికవరీ చేసుకోగా 2018-19 నాటికి ఇది రూ.1.2 లక్షల కోట్లకు చేరుకుందన్నారు. ఇందులో ఎన్సీఎల్టీలో పరిష్కారమైన కేసుల విలువ రూ.55,000 కోట్లుగా ఉందని తెలిపారు.రెండు భారీ మొండి పద్దులైన ఎస్సార్ స్టీల్, భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్ ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయని, వచ్చే కొద్ది నెలల్లో ఇవి పరిష్కారం కావచ్చని తెలిపారు. ఈ రెండు పద్దుల విలువ సుమారు రూ.55,000 కోట్ల వరకు ఉండనుందన్నారు.