ఎన్నికల మరుసటి రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: త్వరలో 15 శాతం పెరగొచ్చు!
న్యూఢిల్లీ: ఏప్రిల్ 11వ తేదీన ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికలు మే 19న ముగిశాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు బీజేపీ రెండోసారి అధికారంలోకి వస్తుందని వెల్లడించాయి. మే 23వ తేదీన ఫలితాలు రానున్నాయి. ఏ ప్రభుత్వం రానుందో దాదాపు ఒక అంచనా వచ్చింది. గత నెల రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు. పెట్రోల్, డీజిల్ ధరలు రోజువారీగా మారుతుంటాయి. కానీ ఎన్నికల కారణంగా ఇన్నాళ్లు మార్పులేదు. సోమవారం పెట్రోల్ పైన లీటరుకు 8-10 పైసలు, డీజిల్ పైన 15-16 పైసల చొప్పున పెరిగింది.
నరేంద్ర మోడీ ఎఫెక్ట్: ఒక్క నిమిషంలో 3.18 లక్షల కోట్లు సంపాదించారు
ఏ నగరంలో పెట్రోల్-డీజిల్ ధర ఎంత అంటే?
మే 20వ తేదీన ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.71.12, ముంబైలో రూ.76.73 గా ఉంది. అంతకుముందు రోజు ఢిల్లీలో రూ.71.03, ముంబైలో రూ.76.64గా ఉంది. డీజిల్ ధర ఢిల్లీలో రూ.66.11, ముంబైలో రూ.69.27గా ఉంది.
- ఢిల్లీలో పెట్రోల్ రూ.71.12, డీజిల్ రూ.66.11, చెన్నైలో పెట్రోల్ రూ.73.82, డీజిల్ రూ.69.88, ముంబైలో పెట్రోల్ రూ.76.73, డీజిల్ రూ.69.27, కోల్కతాలో పెట్రోల్ రూ.73.19, డీజిల్ రూ.67.86, హైదరాబాదులో పెట్రోల్ రూ.75.43, డీజిల్ ధర రూ.71.90, విజయవాడలో పెట్రోల్ రూ.74.84, డీజిల్ రూ.70.94గా ఉంది.
ఈ నెలలో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధర
మొత్తంగా ఈ నెలలో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గాయి. పెట్రోల్ ధర వివిధ నగరాల్లో ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 20వ తేదీ మధ్య రూ.1.96 - రూ.2.08 మధ్య తగ్గితే, డీజిల్ ధర 56 పైసల నుంచి 60 పైసల మధ్య తగ్గింది. ఇదిలా ఉండగా, ఉత్పత్తి కోతలు కోతలు కొనసాగించాలని, తద్వారా చమురు ధరలు పడిపోకుండా ఈ ఏడాది మొత్తం మద్దతు అందించాలని ఒపెక్ నిర్ణయం తీసుకుంది. దీంతో సోమవారం ముడిచమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో పెరిగింది. బ్రెంట్ క్రూడ్ ధర దాదాపు 1.5 శాతం పెరిగి 73.40 డాలర్లకు చేరుకుంది. ఇవి దేశీయ ఇంధన ధరలను ప్రభావితం చేయనున్నాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు 15 శాతం పెరుగుతాయా?
అంతర్జాతీయ పరిణామాలు, పెరుగుతున్న క్రూడాయిల్ ధర కారణంగా సార్వత్రిక ఎన్నికల తర్వాత పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతాయని భావిస్తున్నారు. త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా రూ.10 నుంచి రూ.12 మధ్య పెరిగినా ఆశ్చర్యం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దాదాపు 15 శాతం మేర ధరలు పెరగవచ్చునని అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వం రాగానే ఇలా ధరలు పెరిగితే ప్రజాగ్రహం ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి క్రమంగా పెరగవచ్చునని అంటున్నారు. ఇదివరకు యూపీఏ హయాంలో పెట్రోల్ ధర రూ.84 వరకు వెళ్లింది. మోడీ హయాంలో మొదట తగ్గి, ఆ తర్వాత రూ.90 వరకు వెళ్లింది. ఇప్పుడు రూ.70కి పైన ఉంది. ఇది రూ.80కి పైన చేరవచ్చునని భావిస్తున్నారు.