IndiGo కో-ఫౌండర్లు రాహుల్-రాకేష్ మధ్య విభేదాలు, షేర్లు పతనం
ముంబై: IndiGo సహవ్యవస్థాపకులు రాహుల్ భాటియా, రాకేష్ గంగ్వాల్ మధ్య తీవ్ర విభేదాలు పొడసూపాయి. ఈ ప్రభావం ఇండిగో ఎయిర్ లైన్స్ పైన పడుతోంది. షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్ క్లాజులు, ఎయిర్ లైన్స్ వ్యూహాలు, ఆంబిషన్స్ సహా పలు అంశాలపై వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని చెబుతున్నారు. ఈ అంశంపై స్పందించేందుకు ప్రమోటర్లు నిరాకరించారని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య గత కొన్ని వారాలుగా విభేదాలు ఉన్నాయని, అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయని, ఆ రెండు పార్టీలు ఇతర ఆప్షన్స్ను పరిశీలిస్తున్నారని చెబుతున్నారు.
రిలయన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్: మరో ఏడాది ఫ్రీ, ఎలాగో తెలుసుకోండి!
జెట్ ఎయిర్వేస్ సంక్షోభం విమానయాన సంస్థలను ఆందోళనకు గురి చేసిన విషయం తెలిసిందే. తీవ్ర ఆర్థిక లోటుతో జెట్ తాత్కాలికంగా తన సేవలను నిలిపివేసింది. ఇప్పుడు ఇండిగోలో ఇద్దరు కో ఫౌండర్స్ మధ్య విభేదాలు షాక్కు గురి చేస్తున్నాయి. ఈ విభేదాల నేపథ్యంలో ఇండిగో షేర్లు పతనం అయ్యాయి. విస్తరణ వ్యూహాలు, వాటాదారుల ఒప్పందం అంశాలపై ప్రమోటర్లిద్దరి మధ్య తీవ్ర విభేదాలు పొడసూపినట్లుగా తెలుస్తోంది. నిర్వహణ, నియంత్రణ, షేర్ హోల్డర్స్ ఒప్పందంలో కొన్ని క్లాజుల విషయంలో భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయని తెలుస్తోంది. భారత్లో అతిపెద్ద ఎయిర్ లైన్ మార్కెట్ కలిగిన ఇండిగోలో కోఫౌండర్ల మధ్య విభేదాలు ప్రమాదకరమని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యవహారం బయటకు రాకముందే సమస్య పరిష్కారం దిశగా లీగల్ ఫర్మ్స్ ఖైతాన్ అండ్ కో, జే సాగర్ అసోసియేట్స్ పని చేస్తున్నాయని తెలుస్తోంది. వార్తలపై ఇండిగో ఫౌండర్లు స్పందించాల్సి ఉంది. గత ఏడాది సీఈవోగా ఆదిత్య ఘోష్ నియామకం తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు ప్రారంభం అయినట్లుగా తెలుస్తోంది.
యునైటెడ్ ఎయిర్ లైన్స్, యూఎస్ ఎయిర్వేస్ వెటరన్ రాకేష్ గాంగ్వాల్ కారణంగా కూడా ఇండిగో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ విమానయాన సంస్థగా ఎదిగిందని అంటున్నారు. భారత్లో ఇండిగో రికార్డ్ బ్రేకింగ్ ప్లేన్ ఆర్డర్స్ వెనుక, వేగవంత విస్తరణ వెనుక గాంగ్వాల్ పాత్ర ఎంతో ఉందని అంటారు. గాంగ్వాల్ అమెరికా సిటిజన్. గాంగ్వాల్ అమెరికా నుంచి నడిపించగా, రాహుల్ భాటియా ఇండియాలో ఇండిగో గ్రోత్కు కృషి చేశారని చెబుతున్నారు. గత రెండేళ్లుగా వారి మధ్య విభేదాలు వస్తున్నాయని చెబుతున్నారు.
మార్చి 31 నాటికి ఇండిగో మాతృసంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్లో రాహుల్ భాటియాకు 38 శాతం వాటా, గాంగ్వాల్కు 37 శాతం వాటా ఉంది. 2006లో భాటియా, గాంగ్వాల్ ఇండిగోను స్థాపించారు, 2013లో కంపెనీ లిస్టింగ్ నాటికి ఇండిగోలో ప్రమోటర్లు ఇద్దరు 99శాతం వాటాను కలిగి ఉన్నారు. సీఈఓగా ఆదిత్య ఘోష్ ఇండిగోను వీడిన ఎనిమిది నెలల తర్వాత ఈ ఏడాది జనవరిలో నూతన సీఈఓగా రొణొజాయ్ దత్తా నియమితులయ్యారు.
ఇండిగో తన కెపాసిటీని 52 శాతం పెంచనుందని ఫ్లీట్ సైజ్ 155 నుంచి 250కి పెంచుతుందని గాంగ్వాల్ తెలిపాడు. అయితే దీనిని మెజార్టీ మేనేజ్మెంట్ వ్యతిరేకించిందని తెలుస్తోంది. వ్యతిరేకించిన వారిలో ప్రెసిడెంట్ ఆదిత్య ఘోష్ కూడా ఉన్నారు.