WhatsApp హ్యాక్: మిస్డ్ కాల్తో వైరస్, ఇప్పుడేం చేయాలంటే?
మెసేజింగ్ యాప్ వాట్సాప్ వైరస్ బారిన పడిందా? అంటే అవుననే అంటున్నారు. వాట్సాప్ కమ్యూనికేషన్ ప్రోగ్రాం ద్వారా ఓ స్పైవేర్ పలు మొబైల్ ఫోన్లలోకి ప్రవేశించిందని కంపెనీ తెలిపింది. ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్లలో నిక్షిప్తమైన వారి సమాచారాన్ని తరలించే స్పైవేర్ను వాట్సాప్లో ప్రవేశ పెట్టినట్లుగా చెబుతున్నారు. దీనిని ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ అనే అడ్వాన్స్డ్ సైబర్ యాక్టర్ రూపొందించినట్లుగా తెలుస్తోంది.
స్పైవేర్ ఎలా ప్రవేశించిందంటే?
ఎన్ఎస్ఓ దీనిని వాయిస్ కాల్ ప్రోగ్రాం ద్వారా ప్రవేశపెట్టినట్లు గుర్తించారు. వాట్సాప్ భద్రతా వ్యవస్థలో తలెత్తిన లోపం వల్ల ఈ స్పైవేర్ వచ్చిందని, దీనిని వెంటనే గుర్తించి సరిచేసినట్లు కంపెనీ తెలిపింది. స్పైవేర్ను తొలగించామని పేర్కొంది. యూజర్లు తమ వాట్సాప్ యాప్ను అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. ఇలా అప్ డేట్ చేయడం ద్వారా యూజర్లు వైరస్ను నాశనం చేయవచ్చునని తెలిపింది.
అలా గుర్తించారు
మే మొదటి వారంలో ఈ స్పైవేర్ను గుర్తించినట్లు కంపెనీ తెలిపింది. వాట్సాప్ వాయిస్ కాలింగ్ ద్వారా వచ్చే మిస్డ్ కాల్తో ఈ స్పైవేర్ ఫోన్లలోకి ప్రవేశించినట్లు కంపెనీ తెలిపింది. వాయిస్ కాలింగ్స్కు అదనపు సెక్యూరిటీ ఫీచర్లు యాడ్ చేస్తుండగా టీమ్ ఈ లోపాన్ని గుర్తించినట్లు తెలిపారు.
ఇప్పుడేం చేయాలి
వాట్సాప్లోని ఈ లోపంతో స్పైవేర్ దాడి చేసిందని, యూజర్లకు గుర్తు తెలియని నెంబర్ నుంచి వాట్సాప్ మిస్డ్ కాల్స్ వచ్చి ఉంటాయని, అవతలి నుంచి కాల్ వచ్చే సమయంలోనే ఈ స్పైవేర్ ప్రవేశించిందని తెలిపారు. దీని బారినపడిన బాధితుల సంఖ్య చెప్పలేమన్నారు. వాట్సాప్ యూజర్లు వెంటనే తమ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే దీనిని అధిగమించవచ్చునని తెలిపింది. వాట్సాప్, వాట్సాప్ బిజినెస్ ఇన్స్టాల్ చేసుకున్న అన్ని బ్రాండ్ల ఫోన్లపై ఈ ప్రభావం ఉండవచ్చు. యాపిల్స్ ఐఫోన్, (ఐవోఎస్), ఆండ్రాయిడ్ ఫోన్, విండోస్ ఫోన్, టిజెన్ డివైస్లు ఉండవచ్చు. ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ను 1.5 బిలియన్ల ప్రజలు ఉపయోగిస్తున్నారు. మీ ఫోన్ పైన కూడా దీని ప్రభావం ఉందా అంటే చెప్పలేం. కాబట్టి అప్ డేట్ చేసుకోవడం మంచిదని చెబుతున్నారు. ఇజ్రాయెల్కు చెందిన కంపెనీ తయారు చేసిన ఈ స్పైవేర్ స్మార్ట్ ఫోన్లను హ్యాక్ చేస్తుంది. ఫోన్ల కెమెరాలను నియంత్రించి నిఘా పరిగరాలు మార్చివేయగలదని తెలుస్తోంది. ఇటీవల ఇస్తాంబుల్లో హత్యకు గురైన ఖషోగ్గి ఉదంతంలో ఈ స్పైవేర్ పాత్ర ఉన్నట్లుగా తెలుస్తోంది.