ఇదీ లెక్క... డొనాల్డ్ ట్రంప్కు దిమ్మతిరిగే కౌంటర్: నిజంగా ఇండియా టారిఫ్ కింగా?
న్యూఢిల్లీ: మన (యూఎస్) వస్తువులపై భారత్ ఎక్కువ పన్ను వసూలు చేస్తోందని, ఇండియా టారిఫ్ కింగ్ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కానీ భారత్ టారిఫ్ కింగ్ కాదని, వ్యవసాయం వంటి కీలకమైన రంగాల ప్రయోజనాలను కాపాడుకునే హక్కు ఉందని ఇంటర్నేషనల్ ట్రేడ్ నిపుణులు అంటున్నారు.
అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై భారత్ ఎక్కువ ఇంపోర్ట్ డ్యూటీస్ వేస్తోందని చెప్పడాన్ని కొట్టి పారేస్తున్నారు. జపాన్, సౌత్ కొరియా, యూరోపియన్ యూనియన్, అమెరికా వంటి దేశాల్లోను వ్యవసాయ ఉత్పత్తులపై ఎక్కువ టారిఫ్ ఉందని నిపుణులు చెబుతున్నారు.
భారత్ తమ ఉత్పత్తులపై అధిక సుంకాలు మోపుతోందని డొనాల్డ్ ట్రంప్ తరచూ ఆరోపించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. అమెరికా ఆరోపణలు పూర్తిగా అసత్యమని, అమెరికాలో పొగాకు దిగుమతులపై 350 శాతం, వేరుశనగలపై 164 శాతం టారిఫ్లు ఉన్నాయని చెబుతున్నారు.
ప్రముఖ ఐటీ కంపెనీలకు సైబర్ ముప్పు హెచ్చరిక
అమెరికా ఆరోపణలు అసంబద్దమని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ బిశ్వజిత్ ధర్ అన్నారు. అమెరికా పలు వ్యవసాయ ఉత్పత్తులపై ఎక్కువ టారిఫ్ విధిస్తోందని గుర్తు చేస్తున్నారు. పొగాకుపై 350 శాతం, పీనట్స్ పైన 164 శాతం విధిస్తోందని తెలిపారు.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారన్ ట్రేడ్ (ఐఐఎఫ్టీ) ప్రొఫెసర్ రాకేష్ మోహన్ జోషి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికా ఆరోపణలు సరికాదని, అభివృద్ధి చెందిన దేశంగా ముందు తన డ్యూటీలను క్రమబద్ధీకరించాలని పేర్కొన్నారు.
ఇండియాను టారిఫ్ కింగ్ అనడం సరికాదని ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మోహిత్ సింఘ్లా అన్నారు. ట్రంప్ మాట్లాడేది వాస్తవాలు కాదన్నారు. భారత్ కంటే అధిక టారిఫ్లను అమలు చేస్తున్న దేశాలు కూడా ఉన్నాయని, కొన్ని ఉత్పత్తులపై జపాన్ 736 శాతం, దక్షిణ కొరియా 807 శాతం టారిఫ్లు విధిస్తున్నాయని గుర్తు చేశారు. ఇతర దేశాల్లాగే భారత్కు కూడా తమ వివిధ రంగాల్లో డొమెక్రటిక్ ఇంట్రెస్ట్స్ కాపాడుకునే హక్కు ఉందని తెలిపారు.
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ (FIEO) ట్రంప్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. అల్కాహాల్ బీవరేజెస్ పైన 150 శాతం, కాఫీ పైన 100 శాతం, ఆటోమొబైల్స్ పైన 60-75 శాతం టారిఫ్ ఉంటే అమెరికా అధ్యక్షుడికి భారత్ విలన్లా కనిపిస్తోందని, కానీ జపాన్, సౌత్ కొరియా, ఈయూ, అమెరికా కూడా అగ్రికల్చరల్ ప్రోడక్స్ పైన ఇలాంటి టారిఫ్స్ విధిస్తున్నాయని చెబుతోంది.
FIEO డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ మాట్లాడుతూ... డబ్ల్యుటీవో ఇండియా యావరేజ్ టారిఫ్ 48.5 శాతంగా ఉండగా, అప్లై అవుతున్న టారిఫ్ మాత్రం కేవలం 13.4 శాతం మాత్రమేనని, ఈ రెండింటి మధ్య తేడా క్లియర్గా కనిపిస్తోందని, అలాంటప్పుడు ఇండియా టారిఫ్ కింగ్ ఎలా అవుతుందని ప్రశ్నించారు.