ప్రముఖ ఐటీ కంపెనీలకు సైబర్ ముప్పు హెచ్చరిక, గిఫ్ట్ కార్డ్ రూపంలో ఫ్రాడ్
ప్రముఖ ఐటీ కంపెనీలకు సైబర్ అటాక్ ప్రమాద హెచ్చరిక!! ఈ మేరకు క్రెబ్స్ఆన్సెక్యూరిటీ ఫౌండర్ బ్రియాన్ క్రెబ్స్ ఈ మేరకు అలర్ట్ చేశారు. దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలకు సైబర్ నేరగాళ్ల నుంచి ముప్పు ఉందని ఈ సైబర్సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ వెబ్సైట్ క్రెబ్స్ఆన్సెక్యూరిటీడాట్కామ్ చెబుతోంది. బ్రియాన్ క్రెబ్స్ వాషింగ్టన్ పోస్ట్ మాజీ ఉద్యోగి, సైబర్ సెక్యూరిటీ రైటర్. ఈయన ఆధ్వర్యంలో ఈ వెబ్సైట్ నడుస్తోంది.
SBI కార్పోరేట్ శాలరీ అకౌంట్: అర్హత, లాభాలు తెలుసుకోండి
విప్రోలాగా ఇన్ఫోసిస్, క్యాప్ జెమినిలు టార్గెట్
ఈ రిపోర్ట్స్ ప్రకారం విప్రోలాగా ఇన్ఫోసిస్, క్యాప్జెమిని, కాగ్నిజెంట్ వంటి పలు ప్రధాన సంస్థలను సైబర్ మోసగాళ్లు టార్గెట్ చేయాలని చూస్తున్నారు. వీటితో పాటు రిటైల్, ఫైనాన్షియల్, కన్సల్టింగ్ కంపెనీస్ను కూడా అప్రమత్తం చేశారు. సైబర్ అటాకర్స్ గిఫ్ట్ కార్డు రూపంలో ఫ్రాడ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నరని బ్రియాన్ క్రెబ్స్ పేర్కొన్నారు. కాగా, తమ ఉద్యోగుల్లో కొందరి ఖాతాలు హ్యాకింగ్కు గురైనట్లు ఇప్పటికే విప్రో అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలో క్యాప్జెమినీ సైతం ఇదే తరహా దాడులను గుర్తించామని పేర్కొంది. అదే సమయంలో నివారణ చర్యలు తీసుకున్నామని, దీంతో ఎలాంటి నష్టం లేదని పేర్కొంది.
విప్రో విచారణ
ఉద్యోగుల ఈ-మెయిల్స్, కంప్యూటర్స్ పైన జరిగిన సైబర్ దాడులపై దర్యాప్తు చేస్తున్నామని, ఓ ఫోరెన్సిక్ సంస్థను కూడా నియమించుకుంటున్నామని విప్రో తెలిపింది. విచారణ పూర్తయిందా వెల్లడించలేదు. మరిన్ని దాడులకు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని పేర్కొంది. ఇలాంటి సైబర్ దాడుల పట్ల అప్రమత్తంగా ఉన్నామని, డేటా చోరీకి సంబంధించిన దాఖలాలు ఏవీ లేవని ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ సంస్థలు తెలిపాయి.
విప్రోలో వందకు పైగా..
గత నెల విప్రోలో వందకుపైగా కంప్యూటర్లు, డజన్ల కొద్దీ ఉద్యోగులు సైబర్ దాడులకు గురయ్యారన్న క్రెబ్స్ఆన్సెక్యూరిటీ వార్తలపై స్పందిస్తూ గిఫ్ట్ కార్డ్ మోసంపై దృష్టి సారించామని, వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి సైబర్ నేరగాళ్లు ఈ-మెయిల్ స్కామ్కు తెరతీశారని ఇన్ఫోసిస్ కాగ్నిజెంట్ పేర్కొన్నాయి.