రిలయన్స్ ఇండస్ట్రీస్ 3 నెలల లాభం రూ.10,362 కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూ4 ఫలితాల్లో భేష్ అనిపించింది. పెట్రో కెమికల్ బిజినెస్ నిరాశపరిచినా మిగిలిన రిటైల్, జియో వ్యాపారాలు అండగా నిలిచి సంస్థను లాభాల్లో పరుగులు తీయించాయి. ఈ రోజు విడుదలైన త్రైమాసిక ఫలితాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.10362 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఇది నిరుటితో పోలిస్తే 9.79 శాతం అధికం.
దేశంలో అతిపెద్ద మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన సంస్థగా రికార్డుకెక్కిన రిలయన్స్ సంస్థ ఆదాయం మొత్తంగా 19.40 శాతం వృద్ధిని నమోదు చేసి రూ.1,54,110 కోట్లకు చేరింది. మొత్తం ఆర్థిక సంవత్సరానికి చూసుకుంటే సంస్థ ఆదాయం ఏకంగా 44.6 శాతం పెరిగి రూ.6,22,809 లక్షల కోట్లకు చేరింది.
స్పైస్ జెట్ను ఇక పట్టుకోలేం ! టికెట్ రేట్లు.. స్టాక్ పైపైకి
''ఈ ఏడాది ఎన్నో మైలురాళ్లను మేం అధిగమించాం. రేపటి రిలయన్స్ను నిర్మించడంలో సఫలీకృతులం అవుతున్నాం. రిలయన్స్ రిటైల్ డివిజన్ రూ.1 లక్ష కోట్ల ఆదాయాన్ని ఆర్జించి అద్భుతమైన మైల్ స్టోన్ దాటింది. అదే సమయంలో రిలయన్స్ జియో ఏకంగా 30 కోట్ల మంది కొత్త కస్టమర్లను సాధించింది. పెట్రో కెమికల్ బిజినెస్ కూడా గతంలో ఎప్పుడూ లేనన్ని లాభాలను ఆర్జించిపెట్టింది'' అన్నారు - రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ.
పెట్రోకెమికల్ బిజినెస్
రిలయన్స్కు ప్రధాన ఆదాయ వనరు పెట్రోకెమికల్ బిజినెస్సే. వాళ్ల ప్రధాన వ్యాపారం కూడా ఇదే. గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్లు ఈ క్వార్టర్లో బ్యారెల్కు 8.2 డాలర్లుగా ఉంది. అయితే డిసెంబర్ క్వార్టర్లో ఇది 8.8 డాలర్లు, అంతకుముందు 11 డాలర్లుగా ఉండేది. ఈ రంగం ఆదాయం 6.1 శాతం క్షీణించి రూ.87844 కోట్లకు చేరింది. ఎబిటా 25.5 శాతం క్షీణించి రూ.4176 కోట్లను తాకింది. ఈ నిరుత్సాహక ఫలితాలకు కారణం తక్కువ క్రూడ్ ఉత్పత్తి, ముందుగా అనుకున్న నిర్వాహణ మరమ్మత్తులే కారణమని సంస్థ చెబ్తోంది.
రిలయన్స్ నెత్తిన అప్పు
ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ పై ఉన్న మొత్తం అప్పు భారం రూ.2,87 లక్షల కోట్లు. ఇది అంతకు ముందు ఏడాది రూ.2.18 లక్షల కోట్లుగానే ఉండేది. సంస్థ చేతిలో నగదు రూ.1,33,027 కోట్లు ఉంది. ఇది అంతకు ముందు రూ.78 వేల కోట్లుగా ఉండేది.