ఐటీ సెక్టార్లో ఉద్యోగాల జోరు: 6కంపెనీల్లో ఏటా లక్ష జాబ్స్, టీసీఎస్లో ఏడాదికి 12వేలు
ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) సెక్టార్లో గత ఆర్థిక సంవత్సరం ఉద్యోగాలు వెల్లువెత్తాయి. నోట్ల రద్దు తర్వాత టీసీఎస్, ఇన్ఫోసిస్ సహా ఎన్నో కంపెనీలు వేలాది ఉద్యోగాలు ఇచ్చాయి. పై రెండు కంపెనీలు 2018-19 ఏడాదిలో ఏకంగా 53,303 ఉద్యోగాలు ఇచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం మొత్తంగా ఐటీ సెక్టార్లోని ప్రధాన ఆరు కంపెనీల్లో 1,04,820 ఉద్యోగాలు వచ్చాయి. నోట్ల రద్దు తర్వాత ఈ మూడేళ్లలో గత ఆర్థిక సంవత్సరమే ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయి.
ఇటీవల టీసీఎస్ 2018-19 ఏడాదికి గాను యాన్యువల్ రిపోర్ట్ విడుదల చేసింది. తాము 29,287 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లుగా పేర్కొంది. 2019 మార్చి 31వ తేదీ నాటికి ఈ కంపెనీలో ఉధ్యోగులు 4,24,285. ఇన్ఫోసిస్ కూడా 24,016 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లుగా పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి ఈ కంపెనీలో ఉద్యోగాలు 2,28,123కు చేరుకున్నాయి.
అయితే అంతకుముందు రెండు ఆర్థిక సంవత్సరాలలో ఈ సెక్టార్లో ఉద్యోగాలు తక్కువగా వచ్చాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 82,919 ఉద్యోగాలు, 2017-18లో 30,181 ఉద్యోగాలు వచ్చాయి. కానీ గత ఏడాది లక్షకు పైగా ఉద్యోగాలు వచ్చాయి. ఇది కేవలం టాప్ 6 ఐటీ కంపెనీల ఉద్యోగాల జాబితా.
ఆయుష్మాన్ భారత్: మీరు అర్హులా కాదా ఇలా తెలుసుకోండి
టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్, విప్రో, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్ ఐటీ కంపెనీలలో గత ఆర్థిక సంవత్సరం లక్షకు పైగా ఉద్యోగాలు వచ్చాయి. 2018 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్, టీసీఎస్ కంపెనీలు చాలా తక్కువ మందిని ఉద్యోగంలోకి తీసుకున్నాయి. 2017 ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఇన్ఫోసిస్ 3,740 మందిని, టీసీఎస్ 7,770 మందిని తీసుకుంది.
హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రోలు తమ యాన్యువల్ రిపోర్ట్ ఇంకా వెల్లడించలేదు. కానీ హెచ్సీఎల్ క్వార్టర్ 3 రిపోర్ట్ ఆధారంగా 12,328 ఉద్యోగాలు వచ్చాయి. విప్రో క్వార్టర్ 3 రిపోర్ట్ ప్రకారం 8,559 ఉద్యోగాలు వచ్చాయి. విప్రో యాన్యువల్ రిపోర్ట్ నేడు వచ్చే అవకాశముంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం జాబ్ క్రియేషన్ 2.90 రెట్లు పెరిగింది. నోట్ల రద్దు ఏడాది కంటే 1.59 రెట్లు ఎక్కువ.
గత 11 ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే ఇన్ఫోసిస్లో ఉద్యోగుల పెరుగుదల 8.18 శాతం ఎక్కువగా ఉంది. 2009 నుంచి 2019 వరకు సరాసరిగా ఏడాదికి 12,320 మందిని తీసుకుంటోంది. అదే సమయంలో టీసీఎస్ 28,052 మందిని తీసుకుంటోంది. గత 11 ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే ఇన్ఫోసిస్ 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ మందిని తీసుకున్నది. అంతకుముందు ఏడాది కంటే ఉద్యోగుల పెరుగుదల శాతం 11.77.
అదే విధంగా గత 11 ఆర్థిక సంవత్సరాలలో టీసీఎస్ ఎక్కువ మంది ఉద్యోగులను తీసుకున్నది 2018-19 ఆర్థిక సంవత్సరమే. అంతకుముందు ఏడాది కంటే గత ఏడాదిలో టీసీఎస్ ఉద్యోగుల పెరుగుదల 23.8 శాతంగా ఉంది. అదే సమయంలో టీసీఎస్లో మహిళా ఉద్యోగుల పెరుగుదల శాతం 35.9గా ఉది. ఇందులో 147 దేశాలకు చెందిన ఉద్యోగులు ఉన్నారు.