ఊగిసలాటలో మార్కెట్లు, బలహీనపడిన రూపాయి: లాభాల్లో కొనసాగుతున్నవి ఇవే!
స్టాక్ మార్కెట్లు సోమవారం ఊగిసలాటలతో ప్రారంభమయ్యాయి. ఉదయం స్వల్ప లాభాలతో సూచీలు ప్రారంభమయ్యాయి. డాలర్ మారకం విలువతో రూపాయి 69.50 వద్ద ప్రారంభమైంది. ఇది గత వారం 69.23 వద్ద ముగిసింది. ఉదయం గం.9.45 నిమిషాల వద్ద నిఫ్టీ 20 పాయింట్లు నష్టపోయి 11,645 వద్ద, సెన్సెక్స్ 33 పాయింట్లు నష్టపోయి 33,828 వద్ద ట్రేడ్ అయింది. పది గంటల సమయంలో సెన్సెక్స్ 0.09 శాతం పెరిగి 38,896 వద్ద ట్రేడ్ అయింది.
పవర్ గ్రిడ్, భారతి ఎయిర్ టెల్, హీరో మోటో కార్ప్, హెచ్యూఎల్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎం అండ్ ఎం, ఎల్ అండ్ టీలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్, లక్ష్మీ విలాస్ బ్యాంక్, రిలయన్స్ క్యాపిటల్, జై కార్పొరేషన్ లిమిటెడ్, వొడాఫోన్ ఐడియా, వేదాంత, టాటా స్టీల్ కంపెనీల షేర్లు కూడా లాభాల్లో కొనసాగాయి. హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్, హెచ్సీఎల్ టెక్, ఆర్ఐఎల్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.
ఇళ్లు, కార్లు కొనేవాళ్లకు గుడ్న్యూస్: మీ ఈఎంఐ తగ్గనుంది! మీరు ఎంత సేవ్ చేస్తారంటే..
ఇదిలా ఉండగా, వొడాఫోన్ ఐడియా రైట్స్ ఇష్యూలో విదేశీ మదుపర్లు రూ.18,000 కోట్ల పెట్టుబడులు పెట్టే అవకాశముందని, ఇందులోనూ ప్రధానంగా వొడాఫోన్ గ్రూప్ భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టబోతోందని వార్తలు వస్తున్నాయి. వొడాఫోన్ ఐడియా రూ.25,000 కోట్ల నిధుల సమీకరణకు రైట్స్ ఇష్యూ ప్రకటించింది. ఇది బుధవారం ప్రారంభం కానుంది. ఎఫ్డీఐలకు అనుమతివ్వాలని వొడాఫోన్ ఐడియా ప్రభుత్వాన్ని కోరింది. దీనికి కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 28న ఆమోదం తెలిపింది.
ఈ రైట్స్ ఇష్యూ ద్వారా రూ.18,000 కోట్ల నిధులు విదేశీ మదుపర్ల నుంచి వచ్చే అవకాశముందని చెబుతున్నారు. ఏ సంస్థ అయినా రూ.5000 కోట్ల కంటే ఎక్కువ విదేశీ నిధులు సమీకరించాలనుకుంటే ప్రభుత్వం ఆమోదం అవసరం. ఇందులోని ప్రమోటర్లు వొడాఫోన్ గ్రూప్ రూ.11,000 కోట్లు, ఆదిత్య బిర్లా గ్రూప్ రూ.7,250 కోట్లు రైట్స్ ఇష్యూలో పెట్టుబడి పెట్టబోతున్నాయి. ఈక్విటీ షేరును రూ.12.50 చొప్పున రైట్స్ ఇష్యూ ద్వారా జారీ చేయాలని పదిహేను రోజుల క్రితం నిర్ణయించారు. ఇది మార్కెట్ ధరకు 61 శాతం తక్కువ.