ఆ సంస్థతో కుమ్మక్కై 1.1 బిలియన్ డాలర్ల మళ్లింపు: మనీలాండరింగ్ ఆరోపణలపై రిలయన్స్
ఢిల్లీ: రిలయన్స్ ప్రమోటర్ గ్రూప్పై మనీలాండరింగ్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అయితే ఈ ఆరోపణలను సదరు కంపెనీ కొట్టి పారేసింది. ఈ మేరకు డచ్ ఇన్వెస్టిగేటర్లు ఆరోపించారు. ఓవర్ ఇన్వాయిస్తో దాదాపు 1.1 బిలియన్ డాలర్ల మేర ఏ హక్ ఎన్ఎల్ అనే కంపెనీ నిధుల్ని సింగపూర్లోని ఓ కంపెనీకి చేర్చిందని, ఆ కంపెనీ రిలయెన్స్ ఇండస్ట్రీస్కు చెందినదని ఆరోపిస్తున్నారు. వీటిని రిలయెన్స్ తీవ్రంగా ఖండించింది.
రిలయన్స్ గ్యాస్ ట్రాన్స్పోరేటేషన్ ఇన్సురెన్స్ లిమిటెడ్ (ఆర్జీటీఐఎల్) అనే సంస్థ ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ లిమిటెడ్ (ఈడబ్ల్యూుపీఎల్)గా పిలువబడుతోంది. ఇది ప్రయివేటు కంపెనీ. మరోవైపు ఏ హక్ అనేది నెదర్లాండ్స్కు చెందిన కంపెనీ. ఈ కంపెనీకి చెందిన ముగ్గురు ఉద్యోగులు అరెస్టయ్యారు. డచ్ ఇన్వెస్టిగేటర్లు వారిని మూడ్రోజుల పాటు విచారించారు. ఆ తర్వాత కోర్టు వారిని విడుదల చేసింది. ఏ హక్ సంస్థ తోడ్పాటుతో 1.1 బిలియన్ డాలర్లను మళ్లించినట్లు ఆరోపించారు.
విజయ్ మాల్యా జల్సాలకు చెక్: నెల ఖర్చు 29,500 పౌండ్లకు తగ్గించేందుకు ఓకే
ఏ హక్ మాజీ ఉద్యోగుల అరెస్ట్
ఏ హక్ సంస్థకు చెందిన ముగ్గురు మాజీ ఉద్యోగులను డచ్ గవర్నమెంట్కు చెందిన ఫిస్కల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ సర్వీస్ అండ్ ఎకనామిక్ ఇన్వెస్టిగేషన్ సర్వీస్ (ఎఫ్ఐవోడీ-ఈసీడీ) అరెస్ట్ చేసింది. వారిని శుక్రవారం నాడు కోర్టులో ప్రవేశపెట్టింది. అసలేం జరిగిందంటే.. 2006-2008 మధ్య ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ (ఈడబ్ల్యూపీఎల్) సంస్థ రిలయెన్స్కు చెందిన కేజీ-డీ6 బ్లాక్ క్షేత్రం నుంచి వెస్ట్ ఇండియాలోని రాష్ట్రాల కస్టమర్లకు గ్యాస్ చేరవేసేందుకు పైప్ లైన్ నిర్మాణం చేపట్టింది. దీనికి డచ్ సంస్థ ఏ హక్ కూడా సేవలు అందించింది. ఈ క్రమంలో ఏ హక్ ఉద్యోగులు కొందరు ఓవర్ ఇన్వాయిసింగ్ ద్వారా 1.1 బిలియన్ డాలర్ల మేర అవకతవకపడ్డారని చెబుతున్నారు. అంటే బిల్లులు అమాంతం పెంచేశారు.
సింగపూర్ సంస్థకు నిధులు
ఈ నిధులు దుబాయ్, స్విట్జర్లాండ్, కరేబియన్ దేశాల మీదుగా చివరకు సింగపూర్లోని బయోమెట్రిక్స్ మార్కెటింగ్ అనే సంస్థకు చేరాయి. ఈ సంస్థ రిలయెన్స్ ఇండస్ట్రీస్కు చెందినదేనని ప్రాసిక్యూటర్స్ ఆరోపిస్తున్నారు. ఈ లావాదేవీలకు ప్రతిఫలంగా ఏ హక్ ఉద్యోగులకు 10 మిలియన్ డాలర్లు ముట్టాయని పేర్కొన్నారు. ఇలా పైప్లైన్ నిర్మాణ వ్యయాన్ని పెంచడంతో దీని వల్ల ఇండియన్స్ నష్టపోయారని తెలిపారు.
ఆరోపణలు ఖండించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఈడబ్ల్యుపీఎల్
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఈడబ్ల్యుపీఎల్.. ఈ రెండు కంపెనీలు కూడా ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించాయి. ఈ పైప్ లైన్ ప్రాజెక్టు పూర్తిగా ప్రమోటరు సొంత నిధులతో ఏర్పాటు చేసిన ప్రయివేటు కంపెనీ ద్వారా నిర్మించారని పేర్కొంది. భారత్, చైనా, రష్యా, మధ్య ప్రాచ్య దేశాలకు చెందిన స్వతంత్ర కాంట్రాక్టర్ల కన్సార్టియం దీనిని పూర్తి చేసిందని, స్వతంత్ర ఏజెన్సీలు మదింపు చేసిన ప్రామాణిక వ్యయాలతో ఈ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేశారని, అలాంటి కంపెనీల్లో ఏ హక్ ఒకటని పేర్కొంది. ఈ కేసు ఊహాగానాలు, అంచనాలు ప్రాతిపదికగా ఉందని, వాస్తవం మాత్రం లేదని పేర్కొన్నాయి. 2006లో తాము లేదా తమ అనుబంధ సంస్థలు ఏ గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు చేయలేదని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తెలిపింది. తాము ఏ నెదర్లాండ్కు చెందిన సంస్థతో కలిసి పని చేయలేదని పేర్కొంది. రిలయన్స్ ఎప్పుడు చట్టాలు, నిబంధనలకు లోబడి పని చేస్తుందని స్పష్టం చేసింది.