పెద్ద తప్పు చేశా!: అమెజాన్లో బంగారంలాంటి అవకాశం కోల్పోయిన సన్
సాఫ్ట్బ్యాంక్ గ్రూప్ కార్పోరేషన్ వ్యవస్థాపకులు మసయోషి సన్ చైనాలోని టాప్ ఈ కామర్స్ కంపెనీ అలీబాబాలో పెట్టుబడులు పెట్టారు. అదేవిధంగా అమెజాన్లో కూడా ఇన్వెస్ట్ చేద్దామని భావించాడు. కానీ కేవలం 30 మిలియన్ డాలర్ల వద్ద తేడా వచ్చింది. ఈ కారణంగా ఆన్లైన్ వ్యాపారంలో దుసుకుపోతున్న అమెజాన్లో అతనికి వాటాలు లేకుండా పోయాయి.
ఈ యాప్ను వాడుతున్నారా, జాగ్రత్త: హెచ్డీఎఫ్సి వార్నింగ్
30 మిలియన్ డాలర్ల విషయంలో కుదరని డీల్
ఈ మేరకు మసయోషి సన్.. టోక్యోలో జరిగిన మిల్కెన్ ఇనిస్టిట్యూట్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. అమెజాన్లో పెట్టుబడులు పెట్టే బంగారం వంటి అవకాశం వచ్చినప్పటికి ఎలా మిస్ అయ్యానో చెప్పారు. అమెజాన్లో వాటా కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేశానని, కానీ డీల్లో 30 మిలియన్ డాలర్ల విషయంలో తేడా రావడంతో కుదరలేదని తెలిపాడు. దాదాపు 30 శాతం వాటా కొనుగోలు చేసే అవకాశం తనకు వచ్చిందన్నాడు. నాడు తాను 100 మిలియన్ డాలర్లను ఆఫర్ చేయగా అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాత్రం 130 మిలియన్ డాలర్లను కోరాడని చెప్పాడు.
ఇది నేను చేసిన అతి పెద్ద తప్పు
తాను ఇటీవల జెఫ్ బెజోస్ను కలిశానని, ఈ విషయమై తమ మధ్య చర్చ జరిగిందని, అప్పుడు నవ్వుకున్నామని మసయోషి సన్ చెప్పాడు. తాను ఓ మంచి అవకాశాన్ని వదులుకున్నానని, ఇది తాను చేసిన అతిపెద్ద తప్పు అన్నాడు. కానీ అప్పుడు తన వద్ద అంత డబ్బులేదని చెప్పాడు. అమెజాన్ విలువను (130 మిలియన్ డాలర్లు) తాను తక్కువగా అంచనా వేయలేదని, కానీ అంత డబ్బులేకపోవడం వల్ల వాటా తీసుకోలేకపోయినట్లు అభిప్రాయపడ్డారు. రెండు సంవత్సరాల కిందట కూడా అమెజాన్లో వాటాలు కొనేందుకు ప్రయత్నించానని చెప్పాడు. కానీ అందుకు సంబంధించిన వివరాలు వెల్లడించలేదు.
ఆ 30 శాతం వాటా ఉండి ఉంటే
ఇప్పుడు అమెజాన్ మార్కెట్ విలువ 860 బిలియన్ డాలర్లు. ఒకవేళ మసయోషి సన్ ఇందులో 30 శాతం వాటా కొనుగోలు చేసి ఉంటే కనుక ఇప్పుడు అది దాదాపు 260 బిలియన్ డాలర్లుగా ఉండేది. సాఫ్ట్బ్యాంక్కు చైనాకు చెందిన ప్రఖ్యాత ఈ కామర్స్ అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్ లిమిటెడ్లో 132 బిలియన్ డాలర్ల (14.5 యెన్లు) వాటాలు ఉన్నాయి.