స్వల్ప లాభాల్లో మార్కెట్లు, పడిపోయిన ఐటీ స్టాక్స్: పుంజుకుంటున్న రూపాయి
ముంబై: సోమవారం నష్టాలతో ముగిసిన మార్కెట్లకు ఊరట. మంగళవారం నాడు కోలుకున్నాయి. మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 10.30లకు నిఫ్టీ 11,400 వద్ద ట్రేడ్ అయింది. ఉదయం 9.40 ప్రాంతంలో సెన్సెక్స్ 100 పాయింట్లు బలపడి 37,904 వద్ద, నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 11,387 వద్ద ట్రేడ్ అయింది. డాలరుతో రూపాయి మారకం విలువ 68.93 వద్ద ప్రారంభమై.. 68.88.. 68.90 వద్ద కొనసాగుతోంది. సోమవారం 68.96 వద్ద ముగిసింది.
నరేశ్ గోయల్ నిష్ర్కమణతో జెట్ ఎయిర్వేస్ షేర్లు జోరు మీద ఉన్నాయి. ఆ కంపెనీ షేర్లు దాదాపు ఏడు శాతం మేర లాభపడ్డాయి. జీఎమ్ఆర్ ఇన్ఫ్రా, డీఎల్ఎఫ్, ఓఎన్జీసీ, రిలయన్స్ పవర్, ఎమ్ఎమ్టీసీ లిమిటెడ్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్, స్పైస్ జెట్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, జేకే సిమెంట్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఐటీ స్టాక్స్ నష్టాల్లో కనిపించాయి. ఈ రోజు మైండ్ ట్రీ బోర్డు సమావేశం ఉంది. దీంతో ఈ షేర్లు బ్యాలెన్స్గా లేవు. ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ లైఫ్ నష్టాల్లో ట్రేడ్ అవుతోంది.
భారీ నష్టాల్లో మార్కెట్లు, మరింత బలహీనపడిన రూపాయి: కారణాలివే
కాగా, అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటుందన్న భయాలు ప్రపంచ మార్కెట్లను సోమవారం ఆందోళనకు గురిచేశాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తోందనే ఆందోళనలు అందుకు తోడయ్యాయి. వీటితో పాటుబ్రెగ్జిట్, అమెరికా- చైనా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితిలు కారణం అయ్యాయి. దీంతో అంతర్జాతీయ, ఆసియా మార్కెట్లతో పాటు భారత మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ కీలక 38,000 పాయింట్ల దిగువకు చేరింది.
ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ 3.01%, హాంకాంగ్ హాంగ్సెంగ్ 2.15%, షాంఘై కాంపోజిట్ 1.97%, స్ట్రైట్ టైమ్స్ 1.27%, కొరియా కోస్పి 1.92% చొప్పున డీలాపడ్డాయి. ఐరోపా సూచీలు సైతం బలహీనంగా ట్రేడయ్యాయి.
సెన్సెక్స్ ఉదయం 38,016 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. చివరకు ఇంట్రాడేలో 37,667.40 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరలో కొంత కోలుకుంది. చివరకు 355.70 పాయింట్ల నష్టంతో 37,808.91 పాయింట్ల వద్ద ముగిసింది. గత రెండు సెషన్లలో సెన్సెక్స్ 575 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ సైతం 11,400 దిగువకు చేరింది. 102.65 పాయింట్లు కోల్పోయి 11,354.25 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 11,311.60- 11,395.65 పాయింట్ల మధ్య కదలాడింది.