ట్యాక్స్ ఫ్రీ, ప్రయోజనాలు, ప్రతికూలతలు: 7 బెస్ట్ చైల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్
చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఇన్సురెన్స్ కంపెనీలు, ఫండ్ హౌస్లు ఇచ్చే యూనిట్ లింక్డ్ ఇన్సురెన్స్ ప్లాన్స్, చిల్డ్రన్ సేవింగ్ ప్లాన్స్ వైపు చూస్తుంటారు. వీటి ద్వారా మీ పిల్లల విద్య సాఫీగా సాగుతుంది. వారికి భవిష్యత్తు ఉంటుంది. కానీ రిటర్న్స్ మాత్రం తక్కువగా ఉంటాయి. అయితే అనుకోని పరిస్థితులు ఎదురై ఇంట్లోని పెద్దవారికి ఏమైనా జరిగితే పిల్లల చదువుకు అడ్డంకులు రావొద్దంటే, వారి భవిష్యత్తు బాగుండాలంటే కొన్ని స్కీంలపై దృష్టి పెట్టాలి. ఇన్సురెన్స్ తర్వాత మీ పిల్లల కోసం వీటిపై కూడా మీరు దృష్టి సారించవచ్చు. ఇక్కడ పిల్లలకు సంబంధించిన కొన్ని మంచి చైల్డ్ ఇన్వెస్ట్మెంట్ సేవింగ్ ప్లాన్స్...
ఎస్బీఐ హాలీడే సేవింగ్స్ అకౌంట్తో ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు
పీపీఎప్
ఇన్వెస్ట్ చేసేందుకు ఇది(పీపీఎఫ్) అత్యుత్తమ ప్లాన్. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా ఎన్నో లాభాలు ఉంటాయి. ఇది పదిహేనేళ్ల కాలపరిమితి కలిగిన స్కీం. మీ చిన్నారి విద్యకు ఆధారం చూపించగల పథకం. ప్రస్తుత వడ్డీ రేటు దాదాపు 8 శాతంగా ఉంది. వేతన జీవులకు, సొంత వ్యాపారం నిర్వహించుకునే వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడి ఆలోచన ఉన్నవారు మాత్రమే ఇందులో చేరాలి. మెచ్యూరిటీ పీరియడ్ 15 ఏళ్లు కాగా ముందస్తు మూసివేతకు అవకాశం లేదు. 15 ఏళ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత కావాలనుకుంటే మరో 5 ఏళ్లు ఖాతాను కొనసాగించుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టం 80సీ పన్ను మినహాయింపునకు అవకాశం ఉంది. పెట్టుబడి పెట్టిన మూడో ఏట నుంచి రుణం పొందే సదుపాయముంది. వచ్చిన వడ్డీకి ట్యాక్స్ ఫ్రీ. అంతేకాదు, ఆదాయపన్ను చట్టం 80సీ కింద రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్ రిబేట్ ఉంది. పెట్టుబడికి ఇది ఆకర్షణీయ పథకం. ఇందులో మైనస్ ఏమైనా ఉందా అని అనుకుంటే.. దీర్ఘకాలిక పెట్టుబడి కావడం ఒకటే కారణం. కానీ మీ పిల్లల భవిష్యత్తును నిర్మించేందుకు ఉపయోగపడుతుంది.
సుకన్య సమృద్ధి అకౌంట్
సుకన్య సమృద్ధి అకౌంట్ కూడా అత్యుత్తమ ప్లాన్. ఈ స్కీం 8.5 శాతం వడ్డీని ఇస్తోంది. అలాగే ట్యాక్స్ ఫ్రీ. అయితే కూతురు ఉంటేనే ఇది వర్తిస్తుంది. ఆడపిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశ్యంతో మోడీ ప్రభుత్వం దీనిని తీసుకు వచ్చింది. ఆదాయపన్ను చట్టం 80సీ కింద ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. మీ కూతురు పెళ్లి, చదువు కోసం ఈ స్కీం ఎంతో ఉపయుక్తం. ఇది కూడా దీర్ఘకాలిక పథకం. ఈ పథకంలో ఉన్న సమస్య ఏమంటే.. వడ్డీ రేట్లను సవరించినప్పుడల్లా ఇందులో కూడా మార్పులు ఉంటాయి. అయితే, బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ రేటు వస్తుంది. ఇది ప్లస్. ఈ పథకంలో ఆడపిల్లల పేరు మీద సంవత్సరానికి రూ.250 మొదలుకొని డిపాజిట్ చేయవచ్చు.
గోల్డ్ సేవింగ్స్
మీ పిల్లల కోసం మీరు గోల్డ్ ఈటీఎఫ్ ద్వారా కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. కచ్చితమైన ధరకు బంగారాన్ని యూనిట్ల లెక్కన కొనుగోలు చేసి భద్రపరుచుకునేందుకు గోల్డ్ ఈటీఎఫ్లు ఎంతో అనుకూలమైనవి. ఇక్కడ లాకర్ లేదా స్టోరేజ్ ఛార్జీలు ఉండవు. పైగా ఎలక్ట్రానిక్ పద్ధతిలో మీరు సేవ్ చేసుకుంటారు. కాబట్టి దొంగతనానికి ఆస్కారం ఉండదు! మీరు ప్రతి నెల చిన్న మొత్తంలో దాచుకోవడం ద్వారా పెద్ద మొత్తం కూడబెట్టవచ్చు. పది పదిహేనేళ్ల పాటు పెట్టుబడి ద్వారా మంచి లాభం చూడవచ్చు. ఇందులో ప్రతికూలత ఏమిటంటే మీరు దానిని అమ్మే సమయంలో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. మీకు ఆడపిల్ల ఉంటే జ్యువెల్లరీ స్కీంను ఉపయోగించుకోవచ్చు. బంగారం ధరల్లో మార్పులు ఉంటాయి. ఇది ఆందోళన కలిగించే విషయం. కానీ సుదీర్ఘ కాలంలో మాత్రం ఇది ఎంతో లాభం.
ఎలా పని చేస్తుందంటే?
మదుపర్ల నుంచి సమీకరించిని నిధులను గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రెడెడ్ ఫండ్ నిర్వహకులు బంగారంలో పెట్టుబడి చేస్తారు. ఈ ఫండ్లు షేర్ల మాదిరి స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతాయి. డిమాండు, సరఫరాకు అనుగుణంగా ధర ఎక్స్చేంజ్లో మార్పు ఉంటుంది. ట్రేడింగ్ జరిగే సమయంలో ఎప్పుడైనా ఈ ఫండ్లను కొనే, అమ్మే వీలుంది. మన ఫండ్ ఎన్ఏవీ బంగారం ధరపై ఆధారపడి ఉంటుంది. భౌతికరూపంలో బంగారం తీసుకోకుండా మదుపు చెయ్యడం గోల్డ్ ఈటీఎఫ్లలో వీలవుతుంది. ఫండ్ నిర్వహాకులు ఒక గ్రాము బంగారాన్ని యూనిట్గా పరిగణిస్తారు. కొన్ని స్కీముల్లో అర గ్రాము చొప్పును కూడా ఇస్తారు. స్వచ్ఛమైన బంగారం కొనుగోలు చేసి కష్టోడియన్ వద్ద భద్రపరుస్తారు. గోల్డ్ ఈటీఎఫ్లతో కచ్చితమైన ధరకు కొనుగోలు చేయవచ్చు. అదనపు ఛార్జీలు ఉండవు. లాకర్ అవసరం లేదు. అందుకే దీనిని పేపర్ గోల్డ్ అంటారు. మనకు బంగారం అవసరమైనప్పుడు యూనిట్లను ఎక్స్చేంజ్ ద్వారా అమ్మి ఆ డబ్బుతో బంగారాన్ని కొనుక్కోవచ్చు. తక్కువ డబ్బుతం బంగారంలో మదుపుచేసే అవకాశం గోల్డ్ ఈటీఎఫ్లతో వీలవుతుంది.
ఈక్విటీ మ్యుచువల్ ఫండ్స్
ఈక్విటీ మ్యుచువల్ ఫండ్స్ కూడా ఎంచుకోవచ్చు. కానీ ఇది రిస్క్. మనకు అవసరమైన సమయంలో దీనిని తీసుకునే పరిస్థితులు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ సమయంలో మార్కెట్ పైన ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు 2030లో మీ పిల్లల అవసరం కోసం మీరు దీనిని ఉపయోగించుకోవాలంటే అప్పుడు మార్కెట్లు ఎలా ఉంటాయో చెప్పలేం. కానీ పలు ఈక్విటీ మ్యుచువల్ ఫండ్స్ ద్వారా మంచి రిటర్న్స్ వచ్చిన సందర్భాలు ఎన్నో. దీర్ఘకాలిక పెట్టుబడులు అయితే ఇతర రిటర్న్స్ కంటే బాగుండవచ్చు. మీ పిల్లల చదువులు, భవిష్యత్తు కోసం దీర్ఘకాలిక ప్లాన్ అయితే మ్యుచువల్ ఫండ్స్ ఎంచుకోవచ్చు. అయితే ఈక్విటీ మ్యుచువల్ ఫండ్స్లో రాబడికి ట్యాక్స్ ఉంటుంది. కాబట్టి మీ రాబడిలో కొంత తగ్గుతుంది. కాబట్టి ఈక్విటీ మ్యుచువల్ ఫండ్స్ను ఎంచుకునే సమయంలో అన్నీ ఆలోచించుకోవాల్సి ఉంటుంది.
డెబిట్ మ్యుచువల్ ఫండ్స్
కొన్ని డెబిట్ మ్యుచువల్ ఫండ్స్ బ్యాంకుల కంటే మంచి రిటర్న్స్ ఇస్తాయి. బ్యాంక్ డిపాజిట్ల కంటే మంచి ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇది కూడా మంచి ఎంపిక కాగలదు. ఈక్విటీ మ్యుచువల్ ఫండ్స్లలో ఉండేంత హెచ్చుతగ్గులు ఇందులో ఉండవు. ఈ ఫండ్స్లో కచ్చితమైన రాబడి హామీ ఉండనప్పటికీ అస్థిరత్వతత మాత్రం తక్కువగా ఉంటుంది. కాబట్టి అంచనా వేయవచ్చు. నిపుణుల సలహాలు పాటించాలి. ఎందుకంటే ఇందులో కొన్ని స్కీంలు రిస్కీగా ఉంటాయి. ఏఏఏ సెక్యూరిటీలు కలిగిన డెబిట్ మ్యుచువల్ ఫండ్స్ వైపు వెళ్లడం మేలు. మార్కెట్లు పడిపోయినా మీకు కొంత ఉపశమనంగా ఉంటుంది. 7.5 నుంచి 8 శాతం వరకు వడ్డీ ఉంది.
ఎఫ్డీ
మీరు మీ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారా? అయితే మీరు హై క్వాలిటీ కంపెనీ ఎఫ్డీలు, బ్యాంక్ ఎఫ్డీలకు వెళ్లండి. ఉదాహరణకు పీఎన్బీ ఫైనాన్స్ కంపెనీ మీ ఎఫ్డీ పైన పదేళ్లకు గాను 8.25 శాతం వడ్డీ ఇస్తుంది. బ్యాంకులు 6-7 శాతం వరకు ఇస్తున్నాయి. ఈ డిపాజిట్ల ద్వారా వచ్చే ఆదాయం 12.09 శాతం వరకు కూడా ఉండవచ్చు. అయితే ఎక్కువ కంపెనీ ఎఫ్డీల కాలపరిమితి 5 ఏళ్లు ఉంటుంది. కొన్ని మాత్రం పదేళ్లు, అంతకంటే ఎక్కువ కూడా ఇస్తాయి. మీ పిల్లల భవిష్యత్తు కోసం సుఖన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్లు ఎంతో మేలు. వీటిల్లో వడ్డీ ఎక్కువ. అలాగే ట్యాక్స్ ఫ్రీ. అయితే పైన ఇచ్చిన వాటితో పాటు మరెన్నో ప్లాన్స్ ఉన్నాయి. మీకు ఏది సులభమో దానిని ఎంచుకోవడం మంచిది. తక్కువ కాలపరిమితి కావాలనుకుంటే పీఎన్బీ హౌసింగ్ హౌసింగ్ ఫైనాన్స్ డిపాజిట్ వంటివి ఎంచుకోవచ్చు.