యాజమాన్య మార్పు: జెట్ ఎయిర్వేస్లో కొత్త పరిణామం, గట్టెక్కించేందుకు రుణదాతల ప్రయత్నం
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ విమానం చేతులు మారనుంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఈ సంస్థను పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు యాజమాన్యం మారాల్సిన అవసరం ఉందని జెట్ ఎయిర్వేస్కు రుణాలు ఇచ్చిన బ్యాంకులు అభిప్రాయపడుతున్నాయి. ఈ దిశగా ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్షార్టియం చర్యలను వేగవంతం చేసింది. ప్రస్తుత యాజమాన్యాన్ని మార్చి, వృత్తి నిపుణుల చేతికి దీనిని అప్పగించడం ద్వారా పునరుద్ధరించాలని బ్యాంకర్లు ప్రతిపాదించారట.
కుప్పకూలిన జెట్ ఎయిర్వేస్ షేర్లు, అంధకారంలో 23వేల మంది ఉద్యోగుల భవితవ్యం
ఇది మంచి పరిణామం కాదు.. జైట్లీకి ఎస్బీఐ చైర్మన్
పాతికేళ్ల పాటు ఈ రంగంలో సేవలు అందించిన జెట్ ఎయిర్వేస్ నిలిచిపోవడం ప్రయాణికులకు, విమానయాన రంగానికి మంచిది బ్యాంకుల కన్సార్టియం అభిప్రాయపడుతోంది. ఇదే విషయాన్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో జరిగిన భేటీలో ఎస్బీఐ ఛైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారని సమాచారం. జెట్ ఎయిర్వేస్కు 119 విమానాలు ఉండగా అందులో 41 విమానాలు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి. లీజ్ చెల్లించనందున మిగిలిన విమానాలను సంబంధిత యాజమాన్యాలు నిలిపేశాయి. రుణాలకు తోడు ఉద్యోగులకు కూడా ఈ సంస్థ బకాయి పడింది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కేంద్రమంత్రి జైట్లీ విమానయాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా, ప్రధాని ముఖ్య కార్యదర్శి నృపేంద్ర మిశ్రాలతో భేటీ అయ్యారు.
ఎతిహాద్తో చర్చలు
జెట్ ఎయిర్వేస్కు రూ.8,200 కోట్ల రుణాలు ఉన్నాయి. మార్చి నెలాఖరు వరకు ఇందులో రూ.1700 తీర్చాలి. ఈ సంస్థ మూతబడితే 23వేల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ సంస్థలో నరేష్ గోయల్కు 51 శాతం వాటా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో దీనిని పునరుద్ధరించడం మంచిదని భావిస్తోంది. ఇప్పటికే తన వాటా 24 శాతాన్ని ఎతిహాద్ అమ్మేందుకు సిద్ధపడింది. ఈ వాటాను తీసుకోవాలని ఎస్బీఐని కోరింది. ఎతిహాద్ ప్రతిపాదనపై ఎస్బీఐ చైర్మన్ రజనీష్ మాట్లాడుతూ... ఎతిహాద్తో చర్చలు కొనసాగుతున్నాయని, వారు బయటకు వెళ్లే విషయంలో తుది నిర్ణయం రాలేదని, ఆ సంస్థ చెప్పే కొన్ని మార్పులు చేయాల్సి ఉందని, ఎవరి జోక్యం లేకుండా పూర్తిస్థాయి వృత్తి నిపుణులే నిర్వహించాలన్నది వారి ఆకాంక్ష అని తెలిపారు. జెట్ పునరుద్ధరణకు బ్యాంకర్లు గత ఐదు నెలలుగా చర్చిస్తున్నారు. సమాచారం మేరకు జెట్ ఎయిర్వేస్ యాజమాన్యాన్ని మార్చాలని బ్యాంకర్లు కోరుతున్నారు. తద్వారా నరేష్ గోయల్ను తప్పించి, ఇతర నిపుణుల చేతికి అప్పగించాలని చూస్తున్నారని తెలుస్తోంది. తమకు ప్రమోటర్ ఎవరు అనే విషయం అవసరం లేదని, కానీ జెట్ ఎయిర్వేస్ నష్టపోవద్దని, దివాలా కోడ్ తక్షణం ప్రయోగించడం పరిష్కారం కాదని, ఇది ఆఖరు అస్త్రం మాత్రమేనని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ తెలిపారు.
విమానయాన సంస్థలతో భేటీ
జెట్ ఎయిర్వేస్ దేశీయంగా వాడని విమానాశ్రయ స్లాట్లను ఇతర విమానయాన సంస్థలకు కేటాయించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెబుతున్నారు. నగదు లేక తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్న జెట్.. లీజుకు సంబంధించిన చెల్లింపులు జరపలేదు. దీంతో పలు విమానాలు రద్దయ్యాయి. జెట్ ఎయిర్వేస్తోపాటు ఇతర సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలపై పౌర విమానయాన వర్గాలు బుధవారం సమావేశమయ్యాయి. ఈ సమావేశానికి ఎయిరిండియా, స్పైస్ జెట్, గో ఎయిర్, ఇండిగో కంపెనీల అధికారులు హాజరయ్యారు.
ప్రధాని మోడీకి పైలట్లు లేఖ
తమకు చెల్లించాల్సిన జీతాల అంశంపై జెట్ ఎయిర్వేస్ పైలట్ల సంఘం నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్(ఎన్ఏజీ) ప్రధాని మోడీకి లేఖ రాసింది. జెట్ ఎయిర్వేస్ పతనం అంచున ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. వేతనాలు చెల్లింపులు జరుపడంలో విఫలం కావడంతో సంస్థపై పలు అనుమానాలు కలుగుతున్నాయని ఆ లేఖలో పేర్కొంది. ప్రస్తుతం కంపెనీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని, దీంతో ఎంతోమంది రోడ్డున పడే ప్రమాదం ఉందని తెలిపింది. ఒకవేళ మూతపడితే విమాన టిక్కెట్లు భారీగా పెరిగే అవకాశం ఉన్నదని, గడిచిన మూడు నెలలుగా పైలట్లు, ఇంజినీర్లకు జీతభత్యాలు చెల్లించాల్సి ఉందని పేర్కొంది. సంస్థ మూతబడితే వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేసింది.