రూ.50 వేల పైబడి విలువ కలిగిన బంగారం కొనుగోళ్లకు నో పాన్కార్డు
రూ.50,000 పైబడి విలువ చేసే బంగారు ఆభరణాల కొనుగోళ్లకు పాన్,ఆధార్ తప్పనిసరి నిబంధనను తొలగించింది
జీఎస్టీ అమలు సందర్భంగా బంగారం కొనుగోళ్లకు సంబంధించి కఠిన నిబంధనలను రూపొందించిన కేంద్రం ఇప్పుడు కాస్త సడలింపులు ఇచ్చింది. రూ.50,000 పైబడి విలువ చేసే బంగారు ఆభరణాల కొనుగోళ్లకు పాన్,ఆధార్ తప్పనిసరి నిబంధనను తొలగించింది. దీనికి సంబంధించి ఇంతకుముందు ఇచ్చిన జీఎస్టీ నోటిఫికేషన్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మరింత లోతైన చర్చల తర్వాత ప్రకటనను విడుదల చేస్తుంది. ఇంకా రూ.2 కోట్ల వార్షిక టర్నోవర్ గల వ్యాపారులను సైతం మనీ లాండరింగ్ పరిధిలోకి తీసుకురాకుండా చేశారు. ఇంతకుముందు ఉన్న నిబంధనల ప్రకారం ఈ తరహా వ్యాపారస్థులు మనీలాండరింగ్ నిరోధనక చట్టం కింద బంగారు, రత్నాభరణాల వర్తకులకు సంబంధించి వివరాలను స్క్రుటినీ నియంత్రణ సంస్థలు చేయవు. అంతే కాకుండా అధిక కొనుగోలు దారుల వివరాలను వర్తకులు ఆర్థిక నిఘా విభాగానికి తెలియపరచాల్సిన అవసరం తప్పుతుంది.
పెద్ద నోట్ల రద్దు తర్వాత నల్లధనానికి ఆభరణాల పరిశ్రమ ఊతమిస్తుందన్న అనుమానంతో ఖరీదైన లోహాలు, విలువైన రాళ్ల వ్యాపారులు, ఇతర అధిక విలువ కలిగిన ఉత్పత్తుల్లో వ్యాపారం నిర్వహించే వారిని మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కిందకు తీసుకొస్తూ కేంద్రం గత ఆగస్ట్లో నోటిఫికేషన్ తీసుకొచ్చిన విషయం విదితమే. ప్రస్తుతం వరుసగా పరిశ్రమ ప్రతినిధుల నుంచి వచ్చిన వినతుల మేరకు సంబంధిత అంశాలను పరిశీలించిన తర్వాత నోటిఫికేషన్ రద్దుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ రంగంలో ఉన్న ముఖ్య భాగస్వాములతో సంప్రదింపుల తర్వాత వేరే ప్రకటన వెలువరించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం వెలువరించింది.