5954 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదార్లపై బ్యాంకుల చర్యలు
సర్ఫాసి చట్టం ప్రకారం ఇంత వరకూ ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.70 వేల కోట్ల బకాయిలకు సంబంధించి 5954 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల మీద చర్యలు తీసుకోవడం ప్రారంభించారు.
సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ యాక్ట్(సర్ఫాసి చట్టం) ప్రకారం ఇంత వరకూ ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.70 వేల కోట్ల బకాయిలకు సంబంధించి 5954 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల మీద చర్యలు తీసుకోవడం ప్రారంభించారు.
మార్చి 31,2017 నాటికి 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు కలిసి సర్ఫాసి చట్టం కింద తీసుకున్న చర్యల వివరాలు ఆర్థిక శాఖ బహిర్గతం చేసింది.

దేశంలో అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ రూ. 20,943 కోట్లకు సంబంధించి 1444 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదార్లపై చర్యలను ప్రారంభించింది. మిగిలిన 20 బ్యాంకులు రూ.48,496 కోట్ల విషయంలో 4150 మొండి బకాయదార్ల మీద చర్య తీసుకున్నట్లు సమాచారం.
ఉద్దేశపూర్వక ఎగవేతదార్లకు ప్రభుత్వ రంగ బ్యాంకులకు బకాయి పడిన మొత్తం విలువ రూ.92,376 కోట్లని ఆర్థిక శాఖ ద్వారా వెల్లడయింది. 2015-16లో ఉన్న రూ.76,685 కోట్ల కంటే ఇది 20.4% ఎక్కువ. అదే విధంగా ఎగవేతదార్ల సంఖ్యలో సైతం 10 శాతం పెరుగుదల సంభవించింది. మార్చి, 2017 నాటికి ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల సంఖ్య 8167గా ఉంది. ఈ కేసుల విషయంలో రూ.32,384 కోట్లకు సంబంధించి 1914 కేసుల్లో ఎఫ్ఐఆర్లు బుక్ చేశారు.
మరో వైపు 2016-17 సంవత్సరంలో దేశంలోని బ్యాంకులు మొండి బకాయిలను బాగానే రద్దు చేశాయి. ఎస్బీఐ, దాని అనుబంధ బ్యాంకులే రూ. 81,683 కోట్ల మొండి బకాయిలను మాఫీ చేశాయి. గత ఐదేళ్లలోనే ఇది అత్యధికం కాగా, గత ఆర్థిక సంవత్సరం కంటే 41% ఎక్కువ.


Click it and Unblock the Notifications