ప్రైవేట్ బ్యాంకులు నగదు లావాదేవీలపై పగబట్టాయా?
4 లావాదేవీలు మించితే రుసుములు విదించేందుకు ప్రైవేటు బ్యాంకులు సిద్దమవుతున్నాయి. రూ. 150 వరకూ ఇది ఉంటుందని హెచ్డీఎఫ్సీ ప్రకటనలో పేర్కొంది. అదే బాటలో ఐసీఐసీఐ, యాక్సిస్ సిద్దమ
ప్రైవేటు బ్యాంకులు నగదు లావాదేవీలపై కొరడా ఝులిపిస్తున్నాయి. ప్రతి నెలా 4 ఉచిత నగదు లావాదేవీలను అనుమతిస్తున్న హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ తదితర బ్యాంకులు ఆ తర్వాత రుసుముల బాదుడుకు సిద్దమయ్యాయి.ఈ నేపథ్యంలో 4కు మించి చేసే లావాదేవీలపై వివిధ బ్యాంకులు ఏ విధంగా వ్యవహరించనున్నాయో తెలుసుకుందాం.
పరిమితి మించితే
నగదు ఉపసంహరణ లేదా నగదు డిపాజిట్లు ఆ పరిమితికి మించితే ఒక్కో లావాదేవీపై బుధవారం నుంచి రుసుముగా కనీసం రూ.150 వసూలు చేస్తున్నాయి. సేవింగ్, శాలరీ ఖాతాలకూ ఈ రుసుము వర్తిస్తుందని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఒక ప్రకటనలో పేర్కొంది. థర్డ్ పార్టీ నగదు లావాదేవీలను ఈ బ్యాంకు రోజుకు రూ.25వేలకు పరిమితం చేయనుంది. ఐసీఐసీఐ వెబ్సైట్లో ఉంచిన వివరాల ప్రకారం.. హోం బ్రాంచిలో ఒక నెలలో తొలి నాలుగు నగదు లావాదేవీలకు రుసుము ఉండదు. ఆ తర్వాత నుంచి ప్రతి రూ.వెయ్యికి రూ.5 వసూలు చేస్తారు. కనీస రుసుము రూ.150గా నిర్ణయించింది.
హోం బ్రాంచీ కాకపోతే నెలలో తొలి లావాదేవీ మాత్రమే ఉచితం
అంతేగాక, థర్డ్ పార్టీ నగదు లావాదేవీల పరిమితిని రోజుకు రూ.50వేలుగా నిర్ణయించింది. హోం బ్రాంచి కాని వాటిల్లో నెలలో తొలి నగదు లావాదేవీ ఉచితమని ఐసీఐసీఐ తెలిపింది. ఆ తర్వాత నుంచి రూ.1000కి రూ.5 రుసుము వసూలు చేస్తారు. కనీస రుసుము రూ.150గా ఉంటుంది. నగదు స్వీకరించే యంత్రంలో నెలలో తొలి జమకు రుసుము ఉండదు. ఆ తర్వాత రూ. వెయ్యికి రూ.5 వసూలు చేస్తారు.
యాక్సిస్ బ్యాంకు
ఇక యాక్సిస్ బ్యాంకు విషయానికొస్తే.. తొలి ఐదు లావాదేవీలు లేదా రూ.10లక్షల నగదు డిపాజిట్లు లేదా ఉపసంహరణలకు రుసుము ఉండదు. ఆ తర్వాత రూ.150 లేదా రూ.వెయ్యికి రూ.5 ఏది ఎక్కువయితే ఆ మొత్తం రుసుముగా వసూలు చేస్తారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా రుసుములు వసూలు చేస్తాయా లేదా అన్నదానిపై స్పష్టత రాలేదు. ఇటువంటి రుసుములు వసూలు చేయాలని ప్రభుత్వం నుంచి ఎటువంటి సూచనలు రాలేదని కొంతమంది బ్యాంకు సీనియర్ అధికారులు చెబుతున్నారు. బ్యాంకులు వీటిక్కూడా రుసుములు విధిస్తాయా?
లాభార్జన కోసమా? నగదు రహితానికా?
కొత్తగా అమలు చేస్తున్న రుసుములను మార్చి 1 నుంచే వర్తింపజేస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ పేర్కొంది. ప్రయివేటు బ్యాంకులన్నింటికీ బ్యాంకులు అందజేస్తున్న ఇతర సేవలను కూడా ఒక ఆదాయ వనరుగా చూస్తున్నాయి. అందుకే మొదట లావాదేవీలకు పరిమితి విధించాయి. ఆ తర్వాత మొదట్లో నామమాత్రపు రుసుములు వసూలు చేస్తామని ప్రకటించాయి. ఇప్పుడేమో పరిమితికి మించిన నగదు లావాదేవీలపై రుసుములతో కస్టమర్లను బెంబేలెత్తిస్తున్నాయి. ఈ చర్యలు ఖాతాదార్లను నగదు రహితంగా చేసేందుకా, లేకపోతే బ్యాంకుల లాభదాయకతను పెంచేందుకా అని పలువురు బ్యాంకు ఖాతాదారులు ప్రశ్నిస్తున్నారు.