నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకు ఈ విధంగా చేస్తున్నారా!
నల్లధనం కలిగిన వారు ఎక్కువగా స్థిరాస్తి, బంగారం;ఫారెక్స్ వంటి వాటిల్లో పెట్టుబడి పెడతారు. ఐటీ శాఖ అధ్యయనం ప్రకారం నల్లధనాన్ని నగదు రూపంలో ఉండేది 6 శాతమేనని ఒక అంచనా. నల్లధనం మార్చ
నకిలీ కరెన్సీని కట్టడి చేయాలని, నల్లధనాన్ని అరికట్టాలని కేంద్రం పెద్ద నోట్ల మార్పిడి(రద్దు) చేసింది. అంత వరకూ బాగానే ఉంది కానీ నోట్ల రద్దు తర్వాత 2000 నోటు పట్టుకుని చిల్లర మార్చుకునేందుకు సామాన్యుడు సతమతమవుతున్నాడు. కానీ ఎవరిని ఇబ్బంది పెట్టి, వారందరినీ కట్టడి చేసి నల్లధనాన్ని బయటకు తీసుకురావాలని భావించారో అది సాధ్యపడలేదు సరికదా వాళ్లంతా వినూత్న మార్గాల్లో నల్లధనాన్ని తెల్లధనంగా(సక్రమమైనదిగా) మార్చేశారు. దేశంలో పెద్ద ఎత్తున నల్లధనాన్ని ఎలా మార్చుకున్నారో హఫింగ్టన్పోస్ట్.కామ్ రాసింది. అవేంటో మీ కోసం
1. ఆలయాల విరాళాల రూపంలో
దేవాలయాల్లో ఉండే హుండీల ద్వారా కొంత మంది బ్లాక్ మనీని వైట్గా మారుస్తున్నట్లు తెలుస్తోంది. దేవాలయాల నిర్వాహకులు ఈ డబ్బును అజ్ఞాత వ్యక్తుల నుంచి దానంగా వచ్చినట్లు చూపుతాయి. కరెన్సీ నోట్ల మార్పిడికి కొన్ని దేవాలయాల్లో కమీషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. ఒక మీడియా స్టింగ్ ఆపరేషన్లో రూ. 50 లక్షల నల్లధనాన్ని తెల్లగా మార్చుకునేందుకు 20% కమీషన్ ముట్టచెప్పినట్లు తెలుస్తోంది. దేవుడి హుండీల గురించి ప్రభుత్వం ప్రశ్నించేది లేదని చెప్పడమే ఇందుకు కారణం. ఇలా దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో బ్లాక్ను వైట్గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
2. సహకార బ్యాంకులు, సహకార సంఘాల్లో వెనుకటి తేదీ వేసిన ఎఫ్డీల రూపంలో
అసలు ఎఫ్డీ చేయకపోయినా, ఇప్పుడిప్పుడే ఎఫ్డీ చేస్తున్నా గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఈ మార్గాలను ఎంచుకుంటున్నారు. కొన్ని సహకార బ్యాంకులు, సంఘాలు ఇప్పటికీ మాన్యువల్గా కార్యకలాపాలు జరపడమే ఇందుకు కారణం. గ్రామస్థుల పేర్లతో వెనుకటి తేదీ వేసిన ఎఫ్డీల రూపంలో జమ చేసి కొద్ది రోజుల్లో నల్ల డబ్బును తెల్లగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఈ విధంగా చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రానికి రాష్ట్రానికి నియంత్రణ విధానాలు వేర్వేరుగా ఉండటమే వాటికి ఈ అవకాశమిస్తోంది.
3. పేద ప్రజలను ఉపయోగించి
పేద ప్రజలను బ్యాంకుల వద్ద క్యూల్లో నిలుచోబెట్టి వారి ద్వారా సైతం నల్లధనాన్ని(పెద్ద నోట్లను) మారుస్తున్నట్లు టీవీల్లో వార్తలు వస్తూండటాన్ని చూస్తున్నాం. దీనికి సహకార బ్యాంకులే అవసరం లేదు. నేరుగా ఏ బ్యాంకులోనైనా ఈ తతంగాన్ని పూర్తిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ జన్ధన్ ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. జన్ధన్ ఖాతా కాకుండా సాధారణ పొదుపు ఖాతా కలిగిన పేద ప్రజల ఖాతాల్లో రూ. 2.50 లక్షల్లోపు డిపాజిట్ చేసేందుకు కొందరు(నల్ల ధనవంతులు) వెనుకాడటం లేదు. ఈ విధంగా వారి ఖాతాలను ఉపయోగించుకున్నందుకు వారికి కాస్త ముట్టజెప్పి మిగిలింది విత్డ్రా చేయిస్తారు. దీనికి ఎంతో నమ్మకస్తులు అవసరం కాబట్టి చాలా సంస్థల్లో వారి ఉద్యోగులు, వారి బంధువులను ఈ తతంగానికి ఉపయోగిస్తున్నట్లు సమాచారం.
4. పేద ప్రజలకు వడ్డీ లేని రుణాలు
కర్ణాటకలోని ఒక ఎమ్మెల్యే పేద ప్రజలకు పెద్ద ఎత్తున డబ్బును వడ్డీ లేకుండా రుణానికి ఇచ్చినట్లు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. వడ్డీ లేకుండా రుణాలు ఇస్తుండటం వల్ల పేద ప్రజలు వాటి పట్ల ఆసక్తి చూపుతారు. వారి వద్ద ఒక పక్క మంచి పేరు వస్తుంది. ఎలాగో నల్లడబ్బు మొత్తం వదిలించుకుంటారు. తర్వాత రుణం వసూలు చేసుకునేటప్పుడు మొత్తం డబ్బు కొత్త నోట్ల రూపంలో తీసుకుంటారు.
5. జన్ధన్ ఖాతాదార్లను గుర్తించడం
నోట్ల రద్దు ప్రకటన వెలువడినప్పటి నుంచీ జన్ ధన్ ఖాతాల్లో ఎక్కువ డబ్బు లావాదేవీలు జరుగుతున్నట్లు ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. ఇది బ్లాక్ మనీని మార్చేందుకు మనీలాండరింగ్ జరిగి ఉండొచ్చనే కోణంలో ప్రభుత్వం పరిశీలిస్తోంది. బ్యాంకులు ప్రస్తుతం బిజీగా ఉన్నందున కొత్త ఖాతాలు తెరవడం అంత సులువైన వ్యవహారం కాదు. అందుకే నల్ల ధనవంతులు ఏమీ తెలియని అమాయకులను ఇందుకు మార్గంగా ఎంచుకుంటున్నారు. కేవైసీ వెరిఫికేషన్ సంపూర్ణంగా పూర్తిచేసిన జన్ ధన్ ఖాతాల విషయంలో రూ.1 లక్ష వరకూ, మిగిలిన పీఎమ్జేడీవై ఖాతాల్లో రూ. 50 వేలను డిపాజిట్ కనీస పరిమితిగా నిర్ణయించారు. అనుమానస్పద లావాదేవీలు జరిగాయని భావిస్తే ఈ ఖాతాలను తనిఖీ చేస్తామని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది.
6. బ్యాంకు నోట్ల మాఫియా
నోట్ల రద్దును అనూహ్యంగా ఎంత పకడ్బందీగా ప్రకటించారో అంతే వేగంగా బ్యాంక్ నోట్ మాఫియా తయారయింది. వీరు పాత రూ. 500, రూ. 1000 నోట్లను తీసుకుని 15 నుంచి 20% కమీషన్తో కొత్త నోట్లను ఇస్తారు. ఉదాహరణకు రూ. 500కు 300, రూ. 1000 నోటుకు 800 విలువ కలిగిన కొత్త కరెన్సీ నోట్లను మారుస్తారు. ఈ విధంగా పెద్ద ఎత్తున డబ్బు సంపాదిస్తున్నారు. వీరికి కొత్త నోట్లు ఎలా వస్తున్నాయనేది రహస్యమే. కొంత మొత్తంలో పేద ప్రజలను బ్యాంకుల వద్ద పంపి డబ్బు మారుస్తున్నారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అక్కడక్కడా బ్యాంకు మేనేజర్లతో సంబంధాల ద్వారా ఈ వ్యవహారాన్ని నెట్టుకొచ్చే అవకాశాలు లేకపోలేదు.
7. ముందస్తు వేతనాల చెల్లింపు
బ్లాక్ మనీ కలిగిన వ్యాపారస్థులు ఎంచుకుంటున్న మరో మార్గం ముందస్తు వేతనాల చెల్లింపు. వచ్చే 3 నుంచి 8 నెలల వేతనాన్ని ముందస్తు వేతనాల రూపంలో పాత నోట్లతో చెల్లించేస్తున్నారు. ఇక్కడ ఉద్దేశం ఒక్కొకరి డిపాజిట్లు రూ. 2.5 లక్షల లోపు ఉండేటట్లు చూడటం. అందుకే కొన్ని నెలల వేతనాన్నే సర్దుబాటు చేస్తున్నారు. గుజరాత్లో కొంత మంది వ్యాపారస్తులు వారి వద్ద పనిచేసే వారి పేరిట వేతన ఖాతాలను తెరిచి, వారి డెబిట్ కార్డులను మేనేజ్మెంట్ల దగ్గర ఉంచుకుంటున్నాయని తెలుస్తోంది. ఈ విధంగా ఆయా ఖాతాల్లో పాత నోట్లను జమ చేసి డిసెంబరు 30 లోపు తమ పని పూర్తిచేసేందుకు పూనుకుంటున్నారు. ఇది ఎలాగో ఐటీ శాఖ దృష్టికి రాదనేది వారి నమ్మకం.
8. రైలు టికెట్ల బుకింగ్, రద్దు
రైలు టిక్కెట్ల బుకింగ్కు పాత నోట్లను తీసుకుంటుండటంతో ఈ మార్గాన్ని నల్ల ధనవంతులు వదలట్లేదు. మొదట అవసరం లేకున్నా ఏదో మార్గంలో టిక్కెట్లను బుక్ చేయడం తర్వాత నిదానంగా ఆ టిక్కెట్లను రద్దు చేసి ఖాతాల్లోకి డబ్బు రప్పించుకోవాలనేది ప్లాన్. నవంబరు 8 తర్వాత ఫస్ట్ ఏసీ టిక్కెట్ల బుకింగ్ చాలా రెట్లు పెరిగింది. దీంతో రీఫండ్లను నగదు రూపంలో ఇచ్చేది లేదని రైల్వే శాఖ ప్రకటించింది. ఇవన్నీ ట్రావెల్ ఏజెంట్ల సాయంతో జరుగుతున్న మూలాన వారు ఎలాగో కొత్త కరెన్సీ ఇస్తారనేది ధీమా.
9. మనీ లాండరింగ్ సంస్థలు
కొంత మంది చార్టెర్డ్ అకౌంటెంట్లు మనీ లాండరింగ్ కంపెనీలను నడుపుతూ బ్లాక్ను వైట్గా మార్చుతున్నారనేది ఒక ఆరోపణ. పన్నులు ఎగ్గొట్టే వారికి వీరు నిరంతరం సహకరిస్తుంటారు. కోల్కతలో జమా-ఖర్చీ సంస్థలగానూ, ముంబయిలో పాడ్-పేడీ(pad-pedi)గానూ వ్యవహరిస్తుంటారు. వీరంతా నల్ల డబ్బును వివిధ వ్యాపారాల ద్వారా మారుస్తారు. ఉదాహరణకు జాతీయ రహదారులపై నడిచే వాహనాల ద్వారా మార్చడం ఒక పద్దతి.
10. బంగారం కొనుగోలు
ప్రధాని ప్రకటన చేసిన రోజే తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో విపరీతంగా బంగారం కొన్నారని ఐటీ శాఖ గుర్తించింది. నవంబరు 8 న ప్రకటన వెలువడిన సమయం నుంచి నాలుగు గంటల్లోపే నల్ల ధనవంతులు విపరీతంగా బంగారు ఆభరణాలను కొన్నారనేది బహిరంగ రహస్యమే. అంతే కాకుండా ఈ లావాదేవీలను వెనుకటి తేదీలతో బిల్లులు వేసి అమ్మారని తెలుస్తోంది. ఇదే అదనుగా వ్యాపారులు బంగారాన్ని ఎక్కువ ధరలకు విక్రయించారు. దీంతో ప్రభుత్వం బంగారం వర్తకులపై సైతం దృష్టి సారించింది. ఒక నిర్ణీత మొత్తానికి మించిన కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను అందజేయాలని బంగారు వర్తకులను ఆదేశించింది.
11. వ్యవసాయ ఆదాయ రూపంలో
వ్యవసాయం నుంచి వచ్చిన ఆదాయానికి దేశంలో ఆదాయపు పన్ను ఉండదు. నగదు మండీలో సరకు అమ్మడం ద్వారా వచ్చిందని రైతు చెప్పవచ్చు. అప్పుడు పెద్ద నోట్ల రద్దుకు ముందు తమ ఉత్పత్తులను అమ్మడం ద్వారా డబ్బు వచ్చిందని చెప్పి కొత్త నోట్లతో మార్చుకోవచ్చు లేదా బ్యాంకుల్లో డిపాజిట్ చేయవచ్చు. అయితే వ్యవసాయ ఆదాయంగా పరిగణించబడాలంటే ఆదాయపు పన్ను శాఖ సూచించిన కొన్ని షరతులను పాటించాల్సి ఉంటుంది. రెడిఫ్ సంస్థలో ఒక పెట్టుబడి సలహాదారు(ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్) చెబుతున్నదాని ప్రకారం దేశంలో పంట బాగా పండినా పండకున్నా ఈ ఏడాది వ్యవసాయ ఆదాయం ఎక్కువగా ఉండబోతోంది.
12. రాజకీయ పార్టీల ద్వారా
ఎవరు ఇచ్చారనేది చెప్పకుండా రూ. 20 వేల వరకూ రాజకీయ పార్టీలు విరాళాల రూపంలో స్వీకరించవచ్చు. దీంతో ఈ మార్గం కూడా నోట్లను మార్చుకునేందుకు పలువురు వినియోగిస్తున్నారనేది చాలా మంది నోట వినిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దుకు ముందు పాత నోట్ల రూపంలో విరాళాలు వచ్చాయని వీటిని డిసెంబరు 30 లోపు మార్చాలని ఆయా పార్టీలు ప్రయత్నాలు చేసే అవకాశం లేకపోలేదు. రాజకీయ నాయకులు, వారి అనుచరులు పార్టీ ద్వారా ఈ విధంగా నల్ల డబ్బును మార్చుకోగలరని పార్టీల నాయకత్వం ఆందోళన చెందుతోంది.
13. నల్లధనం అరికట్టేందుకు సహకరించండి
నల్లధనాన్ని మార్చుకునేందుకు ఈ కథనం ద్వారా వివిధ మార్గాలనేమీ సూచించడం లేదు. అక్రమ మార్గాల్లో డబ్బును మార్చేందుకు ప్రయత్నిస్తే ఐటీ శాఖ కన్ను ఉంటుందని మరవకూడదు. ఐటీ శాఖ నోటీసులు పంపితే ఆదాయానికి వనరులు(రుజువు)ను చూపాల్సి ఉంటుందని మరవకండి. దేశవ్యాప్తంగా అప్రకటిత, అక్రమ ఆర్జనను కట్టడి చేసేందుకు దేశ ప్రధానమంత్రి, ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ప్రజలంతా సహకరించాలి. నోట్ల రద్దు ద్వారా సామాన్యుడికి దీర్ఘకాలంలో పెద్ద ఎత్తున ప్రయోజనాలు చేకూరుతాయని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. నల్లధనాన్ని అరికట్టేందుకు చేస్తున్న ఈ క్రతువులో సామాన్యులంతా తమ వంతుగా సహకరించాలి.
నగదు రూపంలో ఉండే నల్లధనం 6శాతమే
హఠాత్తుగా పెద్ద నోట్లను రద్దు చేయడంతో చాలా మంది తమ వద్ద ఉన్న నల్లధనాన్ని ఎలా మార్చుకోవాలని చూస్తున్నారు. బ్లాక్ మనీ అంటే ఎక్కువగా అక్రమ మార్గాల్లో సంపాదించిన సొమ్ముతో పాటు, పన్ను ఎగ్గొట్టిన ధనం. నోట్ల రద్దు తర్వాత గూగుల్లో ఎక్కువగా వెతికిన పదాల్లో నల్లధనాన్ని ఎలా మార్చుకోవడం అనేది కూడా ఉంది. ఒక పక్క పేద ప్రజలు రోజువారీ జీవనానికి కష్టపడుతుంటే నల్ల ధనవంతులు తమ డబ్బును ఎలా మార్చుకోవాలో తెలియక ఆపసోపాలు పడుతున్నారు. నల్లధనం కలిగిన వారు ఎక్కువగా స్థిరాస్తి, బంగారం;ఫారెక్స్ వంటి వాటిల్లో పెట్టుబడి పెడతారు. ఐటీ శాఖ అధ్యయనం ప్రకారం నల్లధనాన్ని నగదు రూపంలో ఉండేది 6 శాతమేనని ఒక అంచనా. మొత్తానికి నల్లధనం మార్చుకునేందుకు బడాబాబులు వ్యూహాలకు పదును పెట్టారు. దానికి కొంత మంది అండ ఉండటంతో సులువుగా నలుపు తెలుపయింది. సహకరించిన వారిలో కొంత మంది బ్యాంకు అధికారులు, బంగారం వ్యాపారస్తులు, దేవాలయాల ట్రస్టీలు ఉన్నట్లు వార్తలు వినవస్తున్నాయి.