ఉద్దేశపూర్వక ఎగవేత దార్ల పేర్లు బయటకు
మార్చి 2016 నాటికి ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల జాబితాలో ఉన్న వారి పేర్లను ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోషియేషన్ బయటపెట్టింది. మొత్తం 58,792 కోట్ల రూపాయలను బకాయి పడిన 5610 మంది పేర్లను ఉద్యోగుల సంఘం వెల్లడించింది. జాతీయ బ్యాంకుల్లోనే 3192 ఖాతాల ద్వారా రూ. 28,775 కోట్ల మేర ఉద్దేశపూర్వక ఎగవేతదారుల మోసం ఉన్నట్లు తెలుస్తోంది.
బకాయి పడిన వారిలో విన్సమ్ డైమండ్స్ అండ్ జెవలర్స్ లిమిటెడ్- రూ. 2266 కోట్లు, ఫరెవర్ ప్రెసియస్ జ్యువెలర్స్ అండ్ డైమండ్స్- రూ.1001 కోట్లు, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్- రూ.1201 కోట్లు, దక్కన్ క్రానికల్స్ హోల్డింగ్స్ లిమిటెడ్- రూ. 884 కోట్లు, ఇండియన్ టెక్నోమ్యాక్ లిమిటెడ్- రూ. 625 కోట్లు,ర్యాంక్ ఇండస్ట్రీస్- రూ. 566 కోట్లు, రజా టెక్స్టైల్స్- రూ. 694.59 కోట్లు, రెయ్ అగ్రో లిమిటెడ్- రూ. 580 కోట్లు, ఎస్ కుమార్స్ నేషన్వైడ్ లిమిటెడ్- రూ. 598 కోట్లు, జెనిత్ బిర్లా(ఇండియా) లిమిటెడ్- రూ. 139 కోట్లు, జూమ్ డెవలపర్స్- రూ. 1710 కోట్లు, ఎలక్ట్రోథెర్మ్ ఇండియా- రూ. 385 కోట్లు బకాయి పడ్డారు.
అత్యధికంగా ఎస్బీఐ, దాని అనుబంధ బ్యాంకులకు 1546 మంది ఎగవేతదార్లు రూ. 18,576 కోట్లు రుణ బకాయిలు చెల్లించాల్సి ఉంది.