టీ హబ్లో నాస్కాం వేర్హౌస్: సంతోషమన్న కేటీఆర్
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ఐటీ వినియోగం పెరుగుతున్నందున భారత ఐటీ పరిశ్రమకు ఎటువంటి ఇబ్బందీ లేదని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కాం) అధ్యక్షుడు ఆర్. చంద్రశేఖర్ తెలిపారు. హైదరాబాద్లోని టీ హబ్లో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో నాస్కాం స్టార్టప్ వేర్హౌస్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ఐటీ పరిశ్రమ 80 దేశాలకు సేవలందిస్తోందని, ప్రస్తుతం ఐటీ రంగంలో స్టార్టప్ సంస్థలు దేశీయంగా ఓ సరికొత్త ఒరవడి అన్నారు. కేంద్రం విధివిధానాలు, భవిష్యత్ సమాజం ముందుకుసాగే తీరును బట్టి నాస్కాం అడుగులు వేస్తుందని ఆయన చెప్పారు.
దేశంలో 10 వేల స్టార్టప్ సంస్థలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ‘10కే స్టార్టప్' కార్యక్రమాన్ని నాస్కాం ప్రారంభించిందన్నారు. ఇప్పటికే పది రాష్ట్రాల్లో స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం అందించేందుకు తాము ఒప్పందం చేసుకున్నామని తెలంగాణతో తాజాగా ఎంవోయూ కుదుర్చుకున్నామని చంద్రశేఖర్ తెలిపారు.
టీ హబ్లో ఏర్పాటు చేసిన వేర్హౌస్ నాలుగోదని, టీ హబ్లో ఇందుకోసం 40 సీట్లను కేటాయించారని చంద్రశేఖర్ చెప్పారు. టీ హబ్లో నాస్కాం వేర్హౌస్ను ఏర్పాటు చేయడంపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇందులో స్టార్టప్ కంపెనీలకు ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలుంటాయి.
పారిశ్రామికవేత్తలు, నిపుణుల సలహాలు, సూచనలు, శిక్షణ శిబిరాలు, సదస్సులు, మెంటారింగ్లు ఉంటాయన్నారు. చక్కని ఆలోచనతో స్టార్టప్ను తెచ్చినా, దాన్ని ప్రణాళికాబద్ధంగా ఆచరణయోగ్యం చేస్తేనే విజయం దక్కుతుందని నాస్కామ్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి చెప్పారు.
టీ హబ్లో నాస్కాం వేర్హౌస్
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ నాస్కాం స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం అందించేందుకు ప్రత్యేకంగా నాస్కాం 10000 స్టార్టప్స్ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉప్పెనలా ఉన్న స్టార్టప్ల వృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు, ప్రోత్సహించేందుకు నాస్కాం ముందుకురావడం సంతోషకరమన్నారు.
టీ హబ్లో నాస్కాం వేర్హౌస్
ప్రపంచ పరిణామాలను గమనించి తెలంగాణ ప్రభుత్వం తరఫున అన్నిరాష్ర్టాల కంటే ముందుగానే టీ హబ్ను తీర్చిదిద్దామని చెప్పారు. దేశీయంగా ఉద్యోగులను అందుకు సిద్ధంచేయడంతోపాటు టీ హబ్ ద్వారా ఉద్యోగ సృష్టికర్తలకు కూడా ప్రోత్సాహం ఇస్తున్నామని చెప్పారు.
టీ హబ్లో నాస్కాం వేర్హౌస్
ఐటీరంగంలో హైదరాబాద్ సత్తాను గుర్తించడం వల్లే వరల్డ్ ఐటీ కాంగ్రెస్ను ఏర్పాటుచేయాలని ప్రపంచ దిగ్గజ సంస్థలు నిర్ణయించాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖకు చెందిన నాలుగు పాలసీలను ఫిబ్రవరి రెండో వారంలో.. వీలైతే ఫిబ్రవరి 13వ తేదీన విడుదల చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ప్రకటించారు.
టీ హబ్లో నాస్కాం వేర్హౌస్
ఇందులో నవజాత కంపెనీల కోసం ప్రత్యేకంగా పాలసీ రానున్నదని చెప్పారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో పరిశోధన నైపుణ్యాలు పెంచేలా కృషి చేస్తున్నామని, ఇందుకోసం విద్యాశాఖతో కూడా చర్చిస్తామని తెలిపారు. టెక్నాలజీ రంగంలో భవిష్యత్ను నిర్దేశించే ఆవిష్కరణలు చేసే విద్యార్థులకు ప్రత్యేక క్రెడిట్ పాయింట్స్ ఇచ్చేందుకు ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు.