వాట్సప్ రూమర్లను నమ్మొద్దు: గవర్నర్ రాజన్
ముంబై: జనవరి 1 నుంచి కరెన్సీ నోట్లపై రాతలుంటే చెల్లవని జరుగుతున్న ప్రచారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తోసిపుచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో ముఖ్యంగా వాట్సప్ ద్వారా వస్తున్న రూమర్స్ను నమ్మవద్దని ఆర్బీఐ గవర్నర్ రఘరామ్ రాజన్ ఒక ఆడియో మెసేజ్లో పేర్కొన్నారు.
"నాకు తెలిసినంతవరకూ, వాట్సప్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా, వచ్చే యేడాది నుంచి రాతలున్న నోట్లు చెల్లవని ప్రచారం జరుగుతోంది. ఇది తప్పు. అటువంటి నోట్లను మేము నిషేధించడం లేదు. అవన్నీ చెల్లుబాటవుతాయి" అని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ వెల్లడించారు.
"సరిగ్గా లేని నోట్లను చెలామణి నుంచి తొలగించి, కొత్త వాటిని చేర్చాలన్నది ఆర్బీఐ విధానం. అంతమాత్రాన ఆ నోట్లు చెల్లవని కాదు. వాటిని ఎక్కడైనా, ఎవరైనా వాడుకోవచ్చు. తప్పుడు ప్రచారాన్ని నమ్మకండి" అని రఘురామ్ రాజన్ అన్నారు.
ఇలాంటి నోట్లను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి చలామణి నుంచి తప్పిస్తున్నట్లు తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని ఆర్ బీఐ స్పష్టం చేసింది. వచ్చే ఏడాది నుంచి నోట్లపై రాతలుంటే అవి చెల్లవని, బ్యాంకులు కూడా స్వీకరించవని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.