ఇక ఏటీఎమ్ల నుంచి పేపర్ స్లిప్లు రావు..!
ఏటీఎమ్ల నుంచి ఖాతాదారులు నగదు విత్ డ్రా చేసుకున్నాక ఇచ్చే పేపర్ స్లిప్లకు స్వస్తి చెప్పాలని హెచ్డీఎఫ్సీ బ్యాంకు నిర్ణయించింది. దీనికి బదులుగా బ్యాంకులో నమోదు చేయించుకున్న మొబైల్ ఫోన్ నెంబరకు వివరాలు సంక్షిప్త సందేశాల (ఎస్ఎంఎస్) రూపంలో పంపించాలని నిర్ణయించింది.
తొలుత ఈ విధానాన్ని కొద్ది ఏటీఎమ్లలో ప్రారంభిస్తామని, ఈ నెలాఖరులోగా అన్ని ఏటీఎమ్లకు విస్తరిస్తామని హెచ్డీఎఫ్సీ వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా తమకు 11,700 ఏటీఎమ్ కేంద్రాలుండగా, వీటిల్లో పేపర్ స్లిప్లు నిలిపివేయడం వల్ల సాలీనా రూ. 10 కోట్ల వరకూ ఆదా అవుతుందని తెలిపారు.
కాగా, ఇప్పటికే పేపర్ స్లిప్ కావాలా? వద్దా అన్న ఆప్షన్ను ఏటీఎమ్ కేంద్రాలు కోరుతున్న సంగతి తెలిసిందే. సమీప భవిష్యత్తులో మిగతా బ్యాంకులన్నీ ఇదే పద్ధతిని అమలు చేసేందుకు నిర్ణయించాయి. మరోవైపు ప్రపంచంలో అత్యంత విలువైన టాప్-100 బ్రాండ్స్ పేర్లలో హెచ్డిఎఫ్సి బ్యాంకుకు సైతం చోటు దక్కింది.
దేశీయ కరెన్సీ పేపర్తో ఉత్పత్తి
మన కాగితంలో మన కరెన్సీని ఉత్పత్తి చేసుకునే అవకాశం ఎప్పుడొస్తుందని ప్రధాని నరేంద్రమోడీ గతంలో ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఆయన ఆలోచనలకు బీజం పడింది. దీనికి సంబంధించి దేశీయంగా కరెన్సీ పేపర్ ఉత్పత్తి చేసే యూనిట్ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్లో శనివారం ప్రారంభించారు.
ప్రస్తుతం పెద్ద నోట్ల ప్రింటింగ్కు దిగుమతి చేసుకున్న కాగితాన్ని వాడుతున్నారని, ఈ యూనిట్ ప్రారంభంతో ఆ నోట్లకు దేశీయ పేపర్ను ఉపయోగించనున్నారు. ఇక్కడి సెక్యూరిటీ పేపర్ మిల్లోని ఈ కొత్త యూనిట్ ఏడాదికి 6 వేల టన్నుల పేపర్ను ఉత్పత్తి చేస్తుంది
ఈ సందర్భంగా అరుణ్ జైట్లీ మాట్లాడుతూ మైసూర్ ప్రింటింగ్ ప్రెస్లో 12 వేల టన్నులు సామర్థ్యంతో ఇలాంటి యూనిట్ను ఈ ఏడాది చివరికి ప్రారంభిస్తామని జైట్లీ తెలిపారు. ఈ రెండు ప్రాజెక్టులతో రానున్న ఏళ్లలో రూ. 1,500 కోట్ల ఆదా అవుతుందన్నారు.