టార్గెట్ టీసీఎస్, 1 పై కన్నేసిన కాగ్నిజెంట్..?
న్యూజెర్సీని కేంద్రంగా కలిగి ఉన్న కాగ్నిజెంట్, భారత్లో అత్యధిక ఉద్యోగులతో ఐటీ ఔట్ సోర్సింగ్ సేవలందిస్తూ గత కొంత కాలంగా ఇన్ఫోసిస్ ఆర్ధిక ఫలితాలను అధగమించి ఇండియాలో రెండో అతి పెద్ద ఐటీ కంపెనీగా అవతరించింది.
ఇప్పుడు కాగ్నిజెంట్ నెంబర్ వన్ స్ధానంపై కన్నేసింది. ప్రస్తుతం భారత్ ఐటీ రంగంలో టీసీఎస్ నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతోంది. ఈ రెండు కంపెనీల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉన్నప్పటికీ, సంవత్సరంలో 20 శాతం వరకూ వృద్ధి రేటుని అంచనా వేస్తోన్న సంస్ధ సాధ్యమైనంత త్వరలో టీసీఎస్ను అధిగమిస్తాననే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది.
కాగ్నిజెంట్ అంచనా వేస్తున్నట్టు 2015 ఆర్ధిక సంవత్సరంలో 19.3 శాతం వృద్ధి నమోదైతే సంస్ధ ఆదాయం 12,24 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 77,736)కు చేరుతుంది. అదే సమయానికి మార్చి 2016 నాటికి టీసీఎస్ ఆదాయం 18 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 1.14 లక్షల కోట్లు)కు చేరుతుందని అంచనా.
అయితే, గత ఏడాదితో పోలిస్తే, ఈ ఏడాది టీసీఎస్ కన్నా కాగ్నిజెంట్ మంచి ఫలితాలు రాబడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే గనుక జరిగితే టీసీఎస్ను కాగ్నిజెంట్ అధిగమించడంలో ఎలాంటి సందేహాం లేదు.
గత మార్చి త్రైమాసికంలో టీసీఎస్ నికర ఆదాయ వృద్ధి 1.6 శాతం కాగా, కాగ్నిజెంట్ సంస్ధ ఏకంగా 4 శాతాన్ని నమోదు చేసింది. దీంతో భారత్లోని మిగతా ఐటీ కంపెనీలతో పోలిస్తే, కాగ్నిజెంట్ మరింత అభివృద్ధి వైపు దూసుకుపోతోంది.
ఇక జనవరి - మార్చి మధ్య కాలంలో టీసీఎస్ 1,031 మంది కొత్త వారిని విధుల్లోకి తీసుకుంటే, కాగ్నిజెంట్ 6,200 మందికి ఉద్యోగాలివ్వడం గమనార్హం. ఈ పరిణామాలన్నింటినీ చూస్తుంటే రాబోయే కాలంలో భారత ఐటీ రంగంలో నెంబర్ వన్ స్ధానాన్ని కాగ్నిజెంట్ కైవసం చేసుకునే అవకాశాలు లేకపోలేదని నిపుణులు అంటున్నారు.