ఆర్థిక వృద్ధి: చైనాను మించనున్న భారత్
వాషింగ్టన్: ఈ ఏడాది భారత ఆర్థిక వృద్ధిరేటు 6.3 శాతానికి ఎగబాకవచ్చని, 2016లో 6.5 శాతానికి చేరుకోవచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేస్తున్నది. అంతేకాదు వృద్ధిరేటు విషయంలో వచ్చేఏడాది ఇండియా చైనాను అధిగమించనుందని తాజాగా విడుదల చేసిన నివేదికలో ఐఎంఎఫ్ వెల్లడించింది.
ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ సర్కారు చేపట్టిన సంస్కరణలు అభివృద్ధికి బాటలు వేయనున్నాయని, అయితే వాటి అమలే కీలకమని పేర్కొంది. నిరుడు దేశ వృద్ధిరేటు 5.8 శాతంగా నమోదుకాగా.. చైనాలో 7.4 శాతానికి పడిపోయింది. గడిచిన 24 ఏండ్లలో చైనాకిదే అత్యంత కనిష్ఠ వృద్ధిరేటు. ఈ సంవత్సరం చైనా జీడీపీ 6.8 శాతానికి, 2016లో 6.3 శాతానికి పరిమితం కానుందని ఐఎంఎఫ్ అంచనా వేస్తున్నది.
మన మామిడిపై నిషేధం ఎత్తివేత
లండన్: భారత మామిడి దిగుమతులపై యూరోపియన్ యూనియన్ దేశాలు (ఈయు)నిషేధం ఎత్తివేశాయి. ఏడు నెలల తర్వాత ఈయు మంగళవారం ఈ నిషేధాన్ని ఎత్తివేయగా, ఈయు హెల్త్ రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా ఇప్పుడు భారత మామాడి ఉంటోందని, అందుకే నిషేధాన్ని ఎత్తివేసేందుకు నిర్ణయించుకున్నామని యూరోపియన్ కమిషన్ కమిటీ తెలిపింది.
బ్రస్సెల్స్లో జరిగిన సమావేశంలో ఈయు సభ్యదేశాలు భారత్ నుంచి మామిడి దిగుమతులను అనుమతించాలని తీర్మానించాయి. ఇందుకు అనుకూలంగా ఓటు వేశాయి. అయితే భారత కూరగాయల దిగుమతులపై విధించిన నిషేధాన్ని మాత్రం ఎత్తివేయలేదు. మరోదఫా కూరగాయల శాంపిల్స్ నాణ్యతా ప్రమాణాలను పరిశీలించాకే ఓ నిర్ణయానికి వస్తామని, తదుపరి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.