షేర్ల అమ్మకాలపై విజయ్ మాల్యాకు షాక్, ఎంసీఎఫ్ నుండి ఔట్
ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త, యూబీ గ్రూప్ చైర్మన్ విజయ్ మాల్యాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో విజయ్ మాల్యా గ్రూపు సంస్థల షేర్ల అమ్మకాలు నిలిపి వేశారు. నమోదిత ఒప్పందాలను కింగ్ ఫిషర్, యూబీ గ్రూప్ పూర్తి చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు మంగళూరు కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ (ఎంసీఎఫ్) బోర్డు నుండి మాల్యా తప్పుకున్నారు. విజయ్ మాల్యా కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కు రాజీనామా చేశారని ఎంసీఎఫ్ కంపెనీ సోమవారం తెలిపింది. విజయ్ మాల్యాకు చెందిన యూబీ గ్రూప్లో అస్థిరత ఉన్న విషయం తెలిసిందే. మాల్యాకే చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కూడా కష్టాల్లో ఉంది.
విజయ్ మాల్యా మంగళూరు కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ నుండి తప్పుకున్న నేపథ్యంలో కంపెనీ స్టాక్ పర్సెంటేజ్ పైపైకి పోయింది. 15.3 శాతం పెరిగింది. సోమవారం మధ్యాహ్నం బీఎస్ఈలో 94.05, సెన్సెక్స్ 28,687.72 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.