కొత్త ప్రభుత్వం: ఆల్టైమ్ హైకి మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు రికార్డుల మోత మోగిస్తున్నాయి. నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలతో దేశ వృద్ధిరేటును పరుగులు పెట్టిస్తుందన్న నమ్మకం మదుపర్లలో బలంగా ఉండటమే స్టాక్మార్కెట్ సూచీలు సరికొత్త స్థాయిలను తాకడానికి కారణమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. నైరుతీ రుతుపవనాలు ప్రవేశిస్తుండటం, సహజ వాయువు ధరలు పెరిగే అవకాశాలు మదుపర్లను కొనుగోళ్ల బాట పట్టిస్తున్నాయని వారు చెబుతున్నారు.
ఆశాజనకమైన సంకేతాలతో విదేశీ మదుపర్లూ పెట్టుబడులకు అమితాసక్తిని కనబరుస్తుండటంతో నానాటికీ స్టాక్మార్కెట్లు రికార్డుల దిశగా దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే గురువారం నమోదైన రికార్డులకు కొనసాగింపుగా మార్కెట్లు శుక్రవారం మరో కొత్త రికార్డులను నెలకొల్పాయి. ఉదయం ప్రారంభం నుంచి మధ్యాహ్నం ముగింపు వరకూ మార్కెట్లు లాభాల్లోనే కదలాడటంతో బిఎస్ఈ సూచీ సెన్సెక్స్ 376.95 పాయింట్లు పుంజుకుని 25,396.46 వద్ద ముగిసింది. దీంతో గురువారం నమోదైన ఆల్టైమ్ క్లోజింగ్ హై 25,019.51 కనుమరుగైంది.
ఇంట్రా-డే ట్రేడింగ్లోనూ 25,419.14 స్థాయిని తాకి అంతకుముందు మే 16న నమోదైన 25,375.63 స్థాయిని చెరిపేసింది. అంతేగాక సెన్సెక్స్ ఈ వారంలో 1,179.12 పాయింట్లు పెరిగింది. ఇక ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ సైతం తొలిసారిగా 7,500 స్థాయిపైన ముగిసింది. శుక్రవారం 109.30 పాయింట్లు బలపడి 7,583.40 పాయింట్ల వద్ద నిలిచింది. అంతేగాక ఇంట్రా-డే ట్రేడింగ్లో నమోదైన మునుపటి రికార్డు 7,563.50ను అధిగమించింది.
ఇక విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐ) గురువారం స్టాక్మార్కెట్లలోకి 1,368.97 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చినట్లు మార్కెట్ రెగ్యులేటర్ సెబి తెలియజేసింది. బిఎస్ఇ స్మాల్-క్యాప్, మిడ్-క్యాప్ సూచీలు 1.6 శాతం చొప్పున పెరిగాయి. దేశీయ స్టాక్మార్కెట్ల ట్రేడింగ్లో రియల్టీ షేర్లు అత్యధికంగా 5.02 శాతం పెరిగితే, ఆయిల్, గ్యాస్ షేర్లు 4.82, బ్యాంకింగ్ 1.65, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 1.61, ఆటో 1.53, హెల్త్కేర్ 1.39, ఎఫ్ఎమ్సిజి 1.30 శాతం చొప్పున పెరిగాయి.
ఒఎన్జిసి షేర్ విలువ అత్యధికంగా 10.57 శాతం పుంజుకోగా, గెయిల్ ఇండియా 7.52, హీరో మోటోకార్ప్ 3.68, రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.97, హెచ్డిఎఫ్సి 2.96, మహింద్ర 2.53, బజాజ్ ఆటో 2.31, సిప్లా 2.21 శాతం పెరిగాయి. ఇది ఇలా ఉండగా దేశీయ స్టాక్మార్కెట్లలో మదుపర్ల సంపద 1.5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.