చిదంబరం బడ్జెట్: మార్కెట్లకు జోష్
ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ మదుపర్లలో ఉత్సాహాన్ని నింపింది. సెన్సెక్స్ 97 పాయింట్ల లాభంతో ముగిసింది. బ్యాంకింగ్, విద్యుత్, ఫార్మా, ఆటో షేర్లు దూసుకుపోయాయి. ఆర్థిక మంత్రి ప్రతిపాదించిన పన్ను రాయితీలు ఆర్థిక రంగంలో చురుకు పుట్టిస్తాయన్న విశ్వాసాన్నిమార్కెట్ వర్గాలు వ్యక్తం చేశాయి. మార్కెట్ వర్గాలు ఆర్థిక మంత్రి చిదంబరం బడ్జెట్ ప్రతిపాదనలను మెచ్చుకున్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జిడిపిలో 4.6 శాతం దాటకుండా కట్టడి చేయనున్నట్టుగా చెప్పడం, కరెంట్ ఖాతాలోటు 4,500 కోట్ల డాలర్లకు పరిమితమౌతుందని ప్రకటించడం, 2014-15లో ప్రభుత్వ రుణ సమీకరణ ఈ ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాలకంటే తక్కువ స్థాయిలో ఉంటుందని పేర్కొనడం వంటి అంశాలు మార్కెట్ను ఆకట్టుకున్నాయి.
ఆటో, ఫార్మా, బ్యాంకింగ్, విద్యుత్ షేర్లు కదం తొక్కగా, రియల్టీ, ఎఫ్ఎంసిజి, మెటల్ షేర్లు మాత్రం ప్రాఫిట్ బుకింగ్స్ కారణంగా నష్టపోయాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి పాజిటివ్ జోన్లోనే చలిస్తూ వచ్చిన సెన్సెక్స్ ఆఖరులో 97 పాయింట్ల లాభంతో 20464 వద్ద ముగిసింది.
ఇక టాటా పవర్, మహింద్ర అండ్ మహింద్ర, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఐసిఐసిఐ బ్యాంక్, హీరో మోటోకార్ప్, మారుతి సుజుకి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్, ఎన్టిపిసి షేర్లు 4.81 శాతం నుంచి 1.10 శాతం మేర పుంజుకున్నాయి. కోల్ ఇండియా, హిందాల్కో, రిలయన్స్ షేర్లు నష్టాలపాలయ్యాయి.