స్టాక్ మార్కెట్లు: ఆర్బిఐ, ఫెడ్ నిర్ణయాలే కీలకం
అక్టోబర్ 29న వెలువడే ఆర్బిఐ సమీక్షలో రెపో రేటును 0.25 శాతం పెంచడానికి అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు, పలు రేటింగ్ సంస్థలు, ఫైనాన్షియల్ సంస్థలు భావిస్తున్నాయి. ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉన్నందు వల్ల ఆర్బిఐ ఈ దిశగా నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. వృద్ధి రేటు బలహీనంగా ఉన్నప్పటికీ ఆర్బిఐ రెపో రేటును 0.25 శాతం మేర పెంచడానికి మొగ్గు చూపవచ్చని గత వారంలో బ్రోకరేజ్ సంస్థ హెచ్ఎస్బిసి అంచనా వేసింది.
రెపో రేటు 0.25 శాతం పెరగవచ్చని అసోచామ్ కూడా వెల్లడించింది. ఈ మేరకు మార్కెట్లు సోమవారం ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఇందుకు భిన్నంగా ఆర్బిఐ ప్రకటన వెలువడితే మంగళవారం నుంచి మార్కెట్ల తీరు మరో విధంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ నెల 29, 30 తేదీల్లో ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్ఒఎంసి) సమావేశం జరగనుంది.
నెలకు 8,500 కోట్ల డాలర్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసే పథకాన్ని కొనసాగించే అవకాశమే ఎక్కువగా ఉన్నట్టు చాలా మంది మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలా అని నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు. ఈ వారంలోనే హెచ్ఎస్బిసి మానుఫ్యాక్చరింగ్ పిఎంఐ గణాంకాలు వెలువడనున్నాయి.
వీటి ప్రభావం కూడా మార్కెట్లపై ఉంటుంది. ఇక ఆర్థిక ఫలితాలను గమనించినట్లయితే.. ఈ వారంలో మారుతి సుజుకీ (28న), రాన్బాక్సీ (29న), భారతి ఎయిర్టెల్, డిఎల్ఎఫ్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ (30న), ఐడిఎఫ్సి, డాక్టర్ రెడ్డీస్ లాబొరెటరీస్ (31న) ఫలితాలు విడుదలకానున్నాయి. వీటి ఆధారంగా ఆయా కంపెనీల షేర్లలో పెద్ద ఎత్తున కదలికలకు అవకాశం ఏర్పడనుంది.
కాగా నిఫ్టీకి 6100 పాయింట్ల వద్ద బలమైన మద్దతు ఉంటుందని బ్రోకరేజ్ సంస్థ జిఇపిఎల్ క్యాపిటల్ పేర్కొంది. ఎగువన 6190-6200 పాయింట్ల మధ్య కదలాడటానికి అవకాశం ఉందని, అయితే 6252 స్థాయిని మాత్రం అధిగమించే అవకాశం లేదని పేర్కొంది. శుక్రవారం నిఫ్టీ 6144.90 పాయింట్ల వద్ద ముగిసింది. ఇన్ఫోసిస్, టిసిఎస్ షేర్లు ఈ వారం లాభాల వైపు మొగ్గు ఉండే విధంగాను, హెచ్ సిఎల్ టెక్నాలజీస్, విప్రో షేర్లు నష్టాల వైపు మొగ్గు ఉండేలా చలించేటట్లు కనిపిస్తున్నాయంటున్నారు.
మంగళవారం ఆర్బిఐ రెపో రేటును 7.75 శాతానికి పెంచవచన్న భావన నెలకొన్నందువల్ల వాహన రంగంలో ప్రధాన కంపెనీల షేర్లు ఈ వారం నష్టాల్లో ఆరంభమయ్యే అవకాశం ఉంది. టెలికాం రంగ కంపెనీల ఆర్థిక ఫలితాలు నిరుత్సాహకరంగా ఉండవచ్చు. బ్యాంకింగ్ రంగ షేర్లు మంగళవారం నాటి ఆర్ బిఐ సమీక్ష నుంచి సంకేతాలను అందుకునే వీలుంది. అయితే ఇదే కాక ఇతర అంశాలు కూడా ప్రభావితం చూపిస్తే ఈ రంగ షేర్లు కూడా నష్టపోయే అవకాశం ఉంది.