రూపాయి పతనం: రఘురామ్ రాజన్కు సవాల్
ముంబై: కొనసాగుతున్న రూపాయి పతనం, భయపెడుతున్న కరెంట్ ఖాతా లోటు, పారిశ్రామిక వృద్ధిలో తిరోగమనం, ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ (ఆర్బిఐ) కొత్త గవర్నర్కు సవాళ్లు విసురుతున్నాయి. కొత్త గవర్నర్గా వస్తున్న రఘురామ్ రాజన్ వీటిని ఎలా ఎదుర్కొంటారనేది ఇప్పుడు పారిశ్రామిక, వాణిజ్యవర్గాల్లో మాత్రమే కాకుండా విదేశీ సెంట్రల్ బ్యాంకర్లలో కూడా ఆసక్తికరంగా మారింది. దేశ ఆర్థిక రంగంలో సంక్షోభం ముదురుతున్ తరుణంలో ఆర్బిఐ 23వ గవర్నర్గా రఘురామ్ రాజన్ పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు.
ఈ నెల 4న పదవీ విరమణ చేస్తున్న దువ్వూరి సుబ్బారావు నుంచి ఆర్థిక సంక్షోభ ఛాయలు ఆయనకు వారసత్వంగా అందుతున్నాయి. గత ఐదేళ్ల పదవీకాలంలో దువ్వూరి ప్రవేశపెట్టిన అనేక సంప్రదాయాలను కొనసాగించడం కూడా రఘురామ్ రాజన్కు ఇబ్బందిగానే ఉండవచ్చు. ప్రతి 45 రోజులకూ ద్రవ్య పరపతి విధాన త్రై మాసిక మధ్యంతర సమీక్ష నిర్వహించే పద్ధతి దువ్వూరి ప్రవేశపెట్టారు.
త్రైమాసిక సమీక్షను ఆయనకంటే ముందు గవర్నర్గా ఉన్న యాగా వేణుగోపాల్రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ ఇద్దరు తెలుగువారు గవర్నర్లుగా ఉన్న కాలంలో రిజర్వ్ బ్యాంక్ వ్యవహారాల్లో అనేక మార్పులు సంభవించాయి. రఘురామ్ రాజన్ ఈ విధానాల్లో వేటిని కొనసాగిస్తారు, వేటికి స్వస్తి చెబుతారనేది కూడా ఉత్కంఠ కలిగిస్తోంది. ఐఎంఎఫ్లో దీర్ఘకాలం పనిచేసిన రఘురామ్ రాజన్ వయస్సు 50 ఏళ్లు మాత్రమే. ఇప్పటి వరకు ఆర్బిఐ సారథ్యం చేపట్టినవారిలో ఆయనే వయస్సులో చిన్నవాడు.
ఐఐటి ఢిల్లీ, ఐఐఎం అహ్మదాబాద్లో చదువుకున్న రాజన్కు 2008 ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే అంచనావేశారన్న పేరుంది. అందుకే ఆయన ఆర్బిఐ గవర్నర్గా బాధ్యతలు చేపట్టడాన్ని ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకర్లు గమనిస్తున్నారు. ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్గా పనిచేసిన అనుభవం వల్ల ప్రపంచదేశాల ఆర్థిక పరిణామాల గురించి ఆయనకు బాగా అవగాహన ఉందని అంటారు. ఆర్బిఐ పదవి వరించడానికి ముందు ఆయన ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారుగా ఉన్నారు. రాజన్కు ప్రస్తుతం ఆర్బిఐ గవర్నర్గా ఉన్న దువ్వూరికి మధ్య తేడా ఉంది. గత ఐదేళ్ల కాలంలో ప్రతి సందర్భంలోనూ సుబ్బారావు ఆచితూచి మాత్రమే అడుగులు వేశారు. ముఖ్యంగా రేట్ల పెంపు విషయంలో ఆయన ఏనాడూ దూకుడుగా వెళ్లలేదు.
ధరల అదుపు విషయంలోనే దువ్వూరి కచ్చితంగా ఉన్నారు. పరపతి విధానానికి ద్రవ్యోల్బణం లక్ష్యం కాదని అయితే ధరల అదుపు ఆర్బిఐ బాధ్యత అని అనేక సందర్భాల్లో ఆయన చెప్పారు. ద్రవ్యం సైడు నుంచి తాము తీసుకునే చర్యలకు తోడుగా సప్లై వైపు అవరోధాలను తొలగించాల్సిందిగా ప్రభుత్వానికి పలుమార్లు విన్నపాలు చేశారు. ఆఖరుకు దేశ ఆర్థిక రంగ ప్రస్తుత సంక్షోభానికి సర్కారు విధానాలే కారణమని బహిరంగంగానే చెప్పారు.
రుతుపవనాలు సానుకూలంగా ఉన్నందున ద్రవ్యోల్బణం ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం దిగివచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే ఆర్థిక వృద్ధిపై దృష్టి పెట్టేందుకు రాజన్కు వెసులుబాటు లభిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కరెంట్ ఖాతాలోటును 8,820 కోట్ల డాలర్ల నుంచి 7,000 కోట్ల డా లర్లకు తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. రాజన్కు ఈ విషయంలో గట్టి సవాళ్లే ఎదురుకావచ్చు.
అమెరికా ఉద్దీపన ప్యాకేజీల ఉపసంహరణ ప్రభావం ఆర్థిక రంగంపై పడకుండా కాచుకోవడం కూడా రాజన్ ఎదుర్కోవాల్సిన మరో కీలకమై సవాల్. ప్రధాని మన్మోహన్, ఆర్థిక మంత్రి చిదంబరం, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా, ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ రంగరాజన్ - ఈ నలుగురి నుంచి ఎదురైన సమస్య రఘురామ రాజన్కు ఎదురు కాకపోవచ్చునని అంటున్నారు. దేశ ఆర్థిక విధానాలను శాసించి, పాలిస్తున్న నలుగురు యోధుల బడిలోనే రఘురామ్ రాజన్ జూనియర్. అందువ ల్ల విధాన విషయాల్లో ఆయన ప్రభుత్వ నేతలతో విభేదించే సందర్భాలు రాకపోవచ్చు. ఇది ఆయనను విజయం దిశగా నడిపించవచ్చునని భావిస్తున్నారు.