కొనేవాళ్లు లేరు.. వడ్డీ రేటు భారం: ప్రభుత్వం సాయంతో లాభమేంటి!?
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గత నెలలో ఎంఎస్ఎంఈల కోసం 100 శాతం ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీంను ప్రకటించారు. దీంతో వివిధ బ్యాంకులు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. చాలా సంస్థలకు రుణాలు ఇస్తున్నప్పటికీ, కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా చితికిపోయిన కొన్ని సంస్థలు ఇప్పటికీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ఎందుకంటే మంచి క్రెడిట్ కలిగిన కంపెనీలు నిధులు సేకరించగలుగుతాయి. కానీ ఎంఎస్ఎంఈలలో చాలా వరకు ఇబ్బందుల్లో ఉన్నాయి. డిమాండ్ మందగించడానికి తోడు ఆర్థిక మద్దతు లేకపోవడం వల్ల నష్టపోతున్నాయి.
భారత్ 'ప్రతీకార' దెబ్బ: మనమే నష్టపోతున్నాం, GSP హోదాపై దిగివస్తున్న అమెరికా
అలాంటి వారిని మినహాయించారు
అధికారిక డేటా ప్రకారం జూన్ 18వ తేదీ నాటికి ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.40,416 కోట్ల రుణాలు మంజూరు చేశాయి. ఇందులో రూ.21,028.55 కోట్లు పంపిణీ చేశాయి. ఈ రుణ పథకంలో మొదటిసారి రుణాలు తీసుకునే వారిని, అలాగే బ్యాడ్ లోన్స్ క్రెడిట్ కలిగిన వారిని మినహాయించారని తెలుస్తోంది. అంటే పూర్తిగా ఒత్తిడిలో ఉన్న ఎంఎస్ఎంఈలకు సరైన రుణ పథకం లేదని అంటున్నారు.
రుణాలు తీసుకోవడానికి కూడా..
మందగమనం, కరోనా కారణంగా ఆర్బీఐ రెపో రేటును 4 శాతానికి తగ్గించింది. కానీ ఎంఎస్ఎంఈలకు 8% నుండి 14% మధ్య ఉంది. మొదటిసారి రుణ గ్రహీతలకు ప్రాధాన్యత తగ్గించడం, అధిక రుణ రేట్లు వంటి అంశాలు ఎంఎస్ఎంఈలను మరింత ఒత్తిడికి గురి చేస్తున్నాయట. దీనికి తోడు డిమాండ్ లేమి ఆందోళన కలిగిస్తోంది. కేంద్రం స్కీం ప్రకారం ప్రస్తుతం బ్యాంకులు ఎలాంటి హామీలు అడగడం లేదు. అయితే ఇది ఇప్పటికే బ్యాంకు రుణాలతో అనుసంధానమై ఉన్న ఎంఎస్ఎంఈలకు వెసులుబాటు ఉంది.
వడ్డీ రేట్ల భారం
ఈ పథకం కింద బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు దాదాపు మార్కెట్ రేటుకు సమానంగా ఉంటుంది. గణనీయమైన రాయితీ ఏమీ ఉండటం లేదు. గత నెలలో ఆర్బీఐ రుణరేటును 40 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో రికార్డ్ కనిష్టానికి 4 శాతానికి చేరుకుంది. ఇది రుణగ్రహీతలకు మాత్రం ఉపశమనం కలిగించలేదని చెబుతున్నారు. ఎందుకంటే ఈ పథకం కింద ఏడాదికి వడ్డీ రేటు 9.25 శాతంగా ఉంటోంది. ఇక బ్యాంకింగేతర సంస్థలు అయితే గరిష్టంగా 14 శాతానికి రుణాలు ఇస్తాయి. రుణ గ్రహీత క్రెడిట్ వ్యాల్యూను బట్టి బ్యాంకులు దాదాపు 8 శాతం వరకు రుణాలు ఇస్తున్నాయి.
డిమాండ్లేమి.. మూతబడిన కంపెనీలు.. అధిక వడ్డీ
ఇప్పటికే డిమాండ్ తగ్గిన నేపథ్యంలో అధిక వడ్డీ రేట్లకు, మూసివేయబడిన ఈ కంపెనీల కోసం రుణాలు తీసుకుంటే ఇది మరింత భారంగా మారుతుందని ఎంఎస్ఎంఈలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఈ ప్రయోజనాలు అవసరం
తక్కువ వడ్డీకి రుణాలు, స్థిరఖర్చులు, విద్యుత్ ఛార్జీల మాఫీ వంటి స్వల్పకాలిక వంటి ప్రయోజనాలు ప్రభుత్వం నుండి అవసరమని ఎంఎస్ఎంఈలు చెబుతున్నాయి. లేదంటే డిమాండ్ లేక, ఇప్పటికే మూతబడి ఉన్న కంపెనీలు తెరిచేందుకు అధిక వడ్డీ రేట్లకు రుణాలు తీసుకుంటే భారం పెరిగి మళ్లీ కంపెనీలు మూసుకోవాల్సిన పరిస్థితి అంటున్నారు. ప్రస్తుత పారామీటర్స్ ప్రకారం కొన్ని కంపెనీలు రుణాలు తీసుకోవాలన్నా అడ్డంకులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. వడ్డీ రేట్లు తగ్గించడంతో పాటు వివిధ అనుకూలతలు ఉండాలని కోరుతున్నారు.
లాభాలు తగ్గుతాయి
మొత్తం ఎంఎస్ఎంఈ రుణాల్లో మైక్రో ఎంటర్ప్రైజ్ వాటా 32 శాతంగా ఉంది. ఎంఎస్ఎంఈల రెవెన్యూ 17-21 శాతం పడిపోయింది. బలహీనమైన డిమాండ్ నేపథ్యంలో ఎబిడా మార్జిన్ 4 నుండి 5 శాతానికి తగ్గే అవకాశముంది. ఇది లాభాలను తగ్గిస్తుంది. ఆపరషనల్ ఖర్చులు అంతే ఉండటం లేదా పెరగడం ఉంటుంది. డిమాండ్ అంతగా లేనందున చిన్న, మధ్యతరహా సంస్థలకు ఫ్రెష్గా లోన్స్ అవసరం తక్కువగాను ఉండవచ్చునని భావిస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ లేనందున తమకు ప్రస్తుతం అదనపు మూలధన అవసరాలు లేవని, పైగా అదనపు రుణాలపై వడ్డీ భారీగా పెరుగుతుందని కొందరు యజమానులు చెబుతున్నారు.